ప్రపంచ తెలుగు మహాసభల సన్నాహక సమావేశం
ప్రపంచ తెలుగు మహాసభల సన్నాహక ఏర్పాట్ల పై రవీంధ్రభారతిలోని కళాభవన్ లో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా 2017 డిసెంబర్ 15 నుంచి 19 వరకు ప్రపంచ తెలుగు మహాసభలను హైదరాబాద్ నగరంలో నిర్వహించాలని గౌ. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి ఆదేశాల మేరకు పలు కీలక అంశాల పై కోర్ కమిటీ పలు నిర్ణయాల పై చర్చించింది. ఈ సమావేశంలో ప్రపంచ తెలుగు మహాసభలకు ఇతర దేశాలు, ఇతర రాష్ట్రాల్లో ఉన్న తెలుగు ముఖ్యులను ఆహ్వానించటం పై చర్చ జరిగింది. ఇతర దేశాధినేతలను, ఇతర రాష్ట్రాల ప్రముఖులను ఆహ్వానించటం పై చర్చించారు. వీటితో పాటు ముఖాముఖి చర్చలు, వేధికల పైన నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాల ఏర్పాట్లు, ప్రచురించాల్సిన ప్రచురణలు, సాహిత్య ప్రక్రియల పై ప్రధానంగా చర్చ జరిగింది. ఈ చర్చలో ప్రపంచ తెలుగు మహాసభల కోర్ కమిటీ సభ్యుల ప్రత్యేక ఆహ్వానం మేరకు నిజామాబాద్ పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు.
ప్రపంచ తెలుగు మహాసభల కోసం రాష్ట్రానికి తరలి వస్తున్న అతిథులకు చేయాల్సిన ఏర్పాట్ల పై ఈ సమీక్షా సమావేశంలో చర్చించారు. వీటితో పాటు, హైదరాబాద్ నగరంతో పాటు జిల్లా కేంద్రాల్లో తెలుగు సాహిత్యం, కవితలు పద్యాలను హోర్డింగ్ ల ద్వారా ప్రదర్శించి తగిన ప్రచారం నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసిఆర్ గారి ఆదేశాల మేరకు తగిన ఏర్పాట్లు చేయాలని ప్రపంచ తెలుగు మహాసభల కోర్ కమిటీ నిర్ణయం తీసుకుంది.
ఈ సమీక్ష సమావేశంలో విమానాలు, రైళ్ళల్లో, బస్సులకు ప్రచారం ప్రపంచ తెలుగు మహాసభల లోగోను స్టికరింగ్ చేసి తగిన ప్రచారం నిర్వహించాలని కోర్ కమిటీ నిర్ణయం తీసుకుంది. వీటితో పాటు ప్రపంచ తెలుగు మహాసభలకు తగిన ప్రచారం వార్తా పత్రికలు, ఎలక్ట్రానిక్ మాధ్యమాల ద్వారా నిర్వహించేందుకు ప్రచార మాద్యమాల సంపాదకులు, యాజమాన్యాలతో సమావేశం నిర్వహించాలని ఈ సమీక్షలో నిర్ణయం తీసుకున్నారు. వీటితో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రాచీన శాసనాలు, చారిత్రక, వారసత్వ కట్టడాల వద్ద ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని కోర్ కమిటీ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణ, సన్నాహక ఏర్పాట్ల పై జరిగిన సమావేశంలో కోర్ కమిటీ సభ్యులైన ప్రభుత్వ సలహాదారులు డా. కె.వి.రమణాచారి, తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షులు డా. నందిని సిధారెడ్డి, పర్యాటక, సాంస్కృతిక శాఖల కార్యదర్శి బి. వెంకటేశం, IAS, ముఖ్యమంత్రి కార్యాలయ ప్రత్యేకాధికారి దేశపతి శ్రీనివాస్, తెలుగు విశ్వ విద్యాలయం ఉపకులపతి డా. ఎస్.వి.సత్యనారాయణ, రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ అధ్యక్షులు డా. అయాచితం శ్రీధర్, మరియు సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ పాల్గొన్నారు.