ప్రపంచ తెలుగు మహాసభలకు వచ్చేవారికి సకల సౌకర్యాలు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు మహాసభల కోసం వచ్చేవారికి సకల సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలంగాణ సాహిత్య అకాడమి ఛైర్మన్ నందిని సిధారెడ్డి తెలిపారు. హైదరాబాద్ జంటనగరాల పరిధిలో ప్రపంచ తెలుగు మహాసభల కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రతినిధులకు గురువారం మధ్యాహ్నం 12గంటల నుంచి రవీంద్రభారతి ప్రాంగణంలో ఆహ్వానకిట్లను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి తరలివచ్చే భాషాభిమానులకు బస్సు స్టేషన్లు, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయంలో ప్రత్యేక కౌంటర్ల ద్వారా ఆహ్వాన కిట్లు అంద జేస్తారు. ప్రధాన వేదిక ఎల్బీ స్టేడియం ప్రాంగణంలోనూ ఆహ్వాన కిట్ల పంపిణీ కోసం ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు.
ప్రారంభోత్సవానికి వచ్చే భాషాభిమానుల కోసం జిల్లాల నుంచి కూడా ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు సిధారెడ్డి తెలిపారు. ప్రపంచ మహాసభలకు తరలివచ్చే సుమారు 6వేల మంది వరకూ భస సౌకర్యం కల్పించేందుకు ఏర్పాట్లు జరుగాయన్నారు. వచ్చే ప్రతినిధులు, అతిథులకు తగిన సమాచారం అందించడం ఇతరత్ర సౌకర్యాల గురించి వివరించేందుకు వెయ్యిమందికి పైగా వాలంటీర్లు పనిచేస్తున్నారు. తెలంగాణ జాగృతి వంటి సంస్థలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వాలంటీర్లను అందిస్తున్నాయి. వాలంటీర్లు ప్రత్యేక టీషర్టులు, టోపీలు ధరించి ఉంటారు.
సుమారు 8వేల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రతినిధులతో పాటు భారీ సంఖ్యలో భాషాభిమానులు మహాసభలకు తరలిరానున్నారు. ఇందులో వంద మంది వరకు వీవీఐపీలు, మరో ఐదు వందల వరకు వీఐపీలు ఉంటారు. ఈ వేడుకలకు సుప్రసిధ్ద కవులు, రచయితల వారసులను కూడా ఆహ్వానిస్తున్నామని చెప్పారు. చాలా మంది ప్రముఖుల హోర్డింగులు, తోరణాలు నగరవ్యాప్తంగా ఏర్పాటు చేశామని వివరించారు. మహాసభల సందర్భంగా రెండువందలకు పైగా పుస్తకావిష్కరణలు వివిధ వేదికలపై జరుగుతాయన్నారు. ప్రపంచ మహాసభల ప్రారంభోత్సవానికి హాజరయ్యే భాషాభిమానులు సాయంత్రం నాలుగున్నర గంటల వరకే ప్రధావ వేదిక ఎల్బీ స్టేడియంకు చేరుకుంటే సౌకర్యవంతంగా ఉంటుందని సాహిత్య అకాడమి ఛైర్మన్ నందిని సిధారెడ్డి తెలిపారు.