హైదరాబాద్ ఒక మినీ భారత్
తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తా
కలిసి కలహించుకోవడం కన్నా..విడిపోయి సహకరించుకోవడం మేలు
ఉపరాష్ర్టపతి వెంకయ్యనాయుడు
హైదరాబాద్ ఆగష్టు 21(ఎక్స్ ప్రెస్ న్యూస్);: తెలంగాణతో పాటు ఏపీ అభివృద్ధికి ఏ చర్యలు ఉపయుక్తమో తన వంతు సహకరిస్తానని ఉపరాష్ర్టపతి వెంకయ్యనాయుడు తెలిపారు. రాజ్ భవన్ లో వెంకయ్యను ప్రభుత్వం ఘనంగా సన్మానించింది. తెలంగాణ ప్రభుత్వం తనకు పౌరసన్మానం చేయడం గొప్పగా ఉందని ఉపరాష్ర్టపతి వెంకయ్యనాయుడు అన్నారు. రాష్ర్ట గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు చెప్పారు వెంకయ్య. ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడుతూ.. తెలుగు రాష్ర్టాలు కలిసి ముందుకెళ్లి అభివృద్ది సాధించాలన్నారు. అభివృద్ధి ఫలాలు చిట్టచివర వ్యక్తికి అందితేనే రాష్ర్టం ఏర్పాటైన లక్ష్యం నెరవేరుతుందన్నారు. రాష్ర్టం విడిపోయింది ఏ ఒక్కరి కోసం కాదు. అభివృద్ధి కోసం మాత్రమేనని తెలిపారు.
కలిసి కలహించుకోవడం కన్నా.. విడిపోయి సహకరించుకోవడం మేలు అని చెబుతూనే ఉన్నానని చెప్పారు. కలిసి మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. తెలుగు రాష్ర్టాల సీఎంలు ఒకరికొకరు సహకరించుకొని ముందుకు సాగాలని సూచించారు. ఇద్దరు సీఎంలు కలిసి చర్చించుకుంటే సమస్యలు పరిష్కారమవుతాయన్నారు వెంకయ్య. అభివృద్ధిలో సహకరించుకుంటే దేశంలోనే తెలుగు రాష్ర్టాలు ముందుంటాయన్నారు. రాష్ర్టాలు అభివృద్ధి చెందనిదే.. దేశాభివృద్ధి సాధ్యం కాదన్నారు. మన అంతిమ లక్ష్యం.. దేశం అభివృద్ధి చెందడమేననిస్పష్టంచేశారు.స్వాతంత్ర్యం వచ్చి 70 ఏళ్లు అయింది. స్వరాజ్యం వస్తే.. సమస్యలు పరిష్కారం అవుతాయని పోరాటం చేశాం. స్వరాజ్యం వచ్చింది కానీ సమస్యలు పూర్తి స్థాయిలో పరిష్కారం కాలేదని వెంకయ్య తెలిపారు. స్వరాజ్యాన్ని సురాజ్యం.. రామరాజ్యంగా తీర్చిదిద్దాలన్నారు. సురాజ్యం కోసం ప్రజాప్రతినిధులు తమ కర్తవ్యాలను నిర్వర్తించాలని కోరారు వెంకయ్య.
తాను పుట్టింది నెల్లూరు.. చదివింది విశాఖలో.. రాజకీయంగా పెరిగింది.. ఒదిగింది.. ఎదిగింది మాత్రం హైదరాబాద్ లోనే అని వెంకయ్యనాయుడు చెప్పారు. హైదరాబాద్ తో తనకెంతో సంబంధం ఉందన్నారు. హైదరాబాద్ లో రాజకీయంగా ఎదిగానని చెప్పడానికి ఎంతో గర్వపడుతున్నానని చెప్పారు. హైదరాబాద్ ను ఒక మినీ భారత్ అనడంలో అతిశయోక్తి లేదన్నారు. ప్రపంచ పటంలో హైదరాబాద్ కు ప్రత్యేక స్థానం ఉందన్నారు. హైదరాబాద్ అంటే ఉత్తరాది వాళ్లకి దక్షిణాది.. దక్షిణాది వాళ్లకి ఉత్తరాది అని తెలిపారు వెంకయ్య. హైదరాబాద్ బిర్యానీ, హలీంకు ప్రత్యేకత ఉందన్నారు. తాను మంచి భోజనప్రియుడిని.. భాషా ప్రియుడిని అని పేర్కొన్నారు. తెలంగాణలో తాను పర్యటించని ప్రాంతం లేదు. అన్ని తాలుకాలు తిరిగాను. హైదరాబాద్ అన్న.. తెలంగాణ అన్న తనకెంతో ఇష్టమన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఉపన్యాసం షడ్రపోపేత భోజనంలా ఉంటుందని ఉపరాష్ర్టపతి వెంకయ్యనాయుడు కొనియాడారు. కేసీఆర్ మాట్లాడే తీరు తనకు బాగా నచ్చుతుందన్నారు. ఆయన జనానికి అర్థమయ్యే భాషలోనే మాట్లాడుతాడు అని పేర్కొన్నారు. అట్ల మాట్లాడితేనే ప్రజలకు మనం మాట్లాడేది అర్థమవుతుందన్నారు.
తెలుగు భాషలో గ్రామరే కాదు.. గ్లామర్ కూడా ఉంది. మన భాషను మనం మరిచిపోకూడదు. మాతృభాషను మరిచిపోయినవాడు మనిషే కాదన్నారు వెంకయ్య. ఇంగ్లీష్ కూడా తప్పనిసరి అయినప్పటికీ.. తెలుగును మరిచిపోకండి అని చెప్తున్నాను. మన భాష ద్వారానే మన సంస్కృతి ప్రస్ఫుటిస్తుందని స్పష్టం చేశారు. తెలుగు భాషాభివృద్ధికి రెండు రాష్ర్ట ప్రభుత్వాలు కలిసి చర్యలు తీసుకోవాలని సూచించారు. రెండు తెలుగు రాష్ర్టాలు తెలుగు భాషను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు వెంకయ్య. ప్రజలకు అర్థమైన భాషలో పాలన ఉండాలి. వ్యవహారిక భాషగా.. పాలనా భాషగా తెలుగు ఉండాలన్నది తన కోరిక అని వెంకయ్య పేర్కొన్నారు.