ఆర్థిక రంగంలో మహిళల భాగస్వామ్యం లేకుండా వేగవంతమైన సామాజిక మార్పు సాధ్యం కాదు – ఉపరాష్ట్రపతి
-
ఆర్థిక అవగాహనతో కూడిన మహిళా సాధికారత అవసరం
-
“ఆర్థిక అవగాహన ద్వారా మహిళా సాధికారత” అంశం మీద జరిగిన జాతీయ సదస్సులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి
దేశాభివృద్ధిలో ప్రతి అడుగులో మహిళలకు సమాన భాగస్వామ్యం కల్పించడం ద్వారా వేగవంతమైన పురోగతి సాధించవచ్చని ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు తెలిపారు. ఈ క్రమంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ప్రభుత్వేతర, స్వచ్ఛంద సేవా సంస్థలు సైతం మహిళలకు ఆర్థిక అవగాహన కల్పించడం మీద దృష్టి పెట్టాలని సూచించారు.
ఆర్థిక అవగాహన ద్వారా మహిళా సాధికారత అనే అంశం మీద హైదరాబాద్ లో జరిగిన జాతీయ సదస్సుల్లో ఉపరాష్ట్రపతి ప్రసంగించారు. ఆర్థిక వ్యవహారాలు నిర్వహించే శక్తి కలవారిగా మహిళలను తీర్చిదిద్ది, స్వశక్తి కలిగిన భాగస్వాములుగా దేశాభివృద్ధిలో వారికి అవకాశాలు కల్పించాలని తెలిపారు. ఆర్థిక అవగాహన ద్వారా మహిళా సాధికారతను సాధించే క్రమాన్ని వేగవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో 7.3 శాతంగా ఉన్న భారత దేశ వృద్ధి రేటు 2020 నాటికి 7.5 శాతానికి పెరుగుతుందని ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అంచనా వేసిందన్న ఉపరాష్ట్రపతి, వచ్చే ఐదేళ్ళలో 5 లక్షల డాలర్ల ఆర్థికవృద్ధిని దేశం లక్ష్యంగా నిర్దేశించుకుందని, ఈ క్రమంలో మహిళా భాగస్వామ్యాన్ని మరింత పెంచి, ఈ ప్రక్రియను వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఆర్థిక వ్యవస్థలో మహిళల ప్రమేయం లేకుండా సామాజిక మార్పు సాధ్యం కాదనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలని ఆయన స్పష్టం చేశారు.
బాలికలు, మహిళలకు ఆర్థిక అవగాహన కల్పించడం మరియు వారికి భాగస్వామ్యం కల్పించడం ద్వారా ఆర్థిక క్రమశిక్షణ దిశగా వారిని ముందుకు తీసుకువెళ్ళవచ్చని, సమానమైన మహిళల ఆర్థిక భాగస్వామ్యం ద్వారా వారి కుటుంబాలు ఆర్థికంగా స్వావలంబన సాధించడం మాత్రమే కాకుండా, దేశపురోభివృద్ధికి బాటలు వేస్తాయని తెలిపారు.
లింగ సమానత్వం అనేది పౌరులందరికీ సంబంధించిన అంశమని, అది కేవలం మహిళకు మాత్రమే సంబంధించినదిగా భావించొద్దన్న ఉపరాష్ట్రపతి, మహిళల ఆర్థిక అవగాహన లింగ వివక్షను రూపు మాపి, సురక్షితమైన మహిళ భవిష్యత్తుకు తోడ్పాటునందిస్తుందని తెలిపారు. “సమాజాభివృద్ధికి స్త్రీ పురుషులిద్దరూ రెండు బండి చక్రాల వంటి వారు, సమాజం అనే పక్షి ఎగరాలంటే రెండు రెక్కలుండాలి, ఒక రెక్కతో సాధ్యం కాదు” అన్న వివేకానందుని మాటలను ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి గుర్తు చేశారు.
ఆర్థిక అవగాహన ఉన్న మహిళలు పొదుపు మరియు పెట్టుబడుల ద్వారా ఆర్థిక స్థిరత్వాన్ని సాధించగలరన్న ఉపరాష్ట్రపతి, గ్రామీణ మహిళలకు సాంకేతి పరిజ్ఞానం పట్ల కూడా అవగాహన కల్పించాలని, వారి ఉత్పత్తులను అమ్మేందుకు, వాటికి ప్రచారం కల్పించుకునేందుకు సాంకేతికత సహకారం తీసుకునే విధంగా వారికి అవగాహన కల్పించాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు.
మహిళా పొదుపు సంఘాలు ( డ్వాక్రా), స్వయం సహాయ సంఘాలు ఒక విజయవంతమైన ఉద్యమమని, దాన్ని దేశ వ్యాప్తంగా మరింత పటిష్ఠపరచాలని, ముఖ్యంగా ఉత్తర, తూర్పు భారతంలో ఈ దిశగా మరింత కృషి జరగాల్సిన అవసరం ఉందని, ముద్రా బ్యాంకు యోజన కూడా మహిళా సశక్తీ కరణకు తోడ్పడుతందని ఉపరాష్ట్రపతి తెలిపారు.
ఆర్థికాభివృద్ధికి మహిళల ఆర్థిక అవగాహన అత్యంత కీలకమైన అంశంగా పేర్కొన్న ఉపరాష్ట్రపతి మహిళల ఆర్థిక అవగాహన పెంచేందుకు ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించాల్సిన అవసరం ఉందని తెలిపారు.
ఉపరాష్ట్రపతి ప్రసంగంలోని ముఖ్యాంశాలు
- సమాజంలో ఆర్థిక క్రమశిక్షణ అత్యంత కీలకమైనది. దేశాభివృద్ధికి సంపద సృష్టి అత్యంత ఆవశ్యకమని ఆర్థశాస్త్రాన్ని రచించిన చాణుక్యుడు ఏనాడో తెలిపారు.
- జనాభాలో ప్రపంచంలో రెండో పెద్ద దేశం భారత్ అయితే, భారతదేశంలో 50 శాతం మంది మహిళలు ఉన్నారు. ఈ నేపథ్యంలో మహిళలకు సైతం అభివృద్ధిలో సమాన భాగస్వామ్యం కల్పించాల్సిన అవసరం ఉంది.
- ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్ ఒకటి. ప్రస్తుతం 7.3 శాతంగా భారత వృద్ధి రేటు ఉందని, 2020 నాటికి అది 7.5 శాతానికి పెరుగుతుందని అంతర్జాతీయ సంస్థలు అంచనా వేస్తున్నాయి.
- ప్రపంచ వ్యాప్తంగా నూతనంగా పెట్టుబడులు పెట్టాలనుకునే వారిని భారతదేశం ఆకర్షిస్తోంది. రానున్న 10 నుంచి 20 ఏళ్ళలో భారతదేశ ఆర్థిక వృద్ధి 10 ట్రిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనాలున్నాయి. ఈ అభివృద్ధిలో మహిళలను భాగస్వాములను చేయాల్సిన అవసరం ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ప్రభుత్వేతర సంస్థలు, స్వచ్ఛంద సేవా సంస్థలు ఇందులో భాగస్వాములు కావాలి.
- మహిళల సమాన భాగస్వామ్యం లేకుండా వ్యవసాయ రంగం సహా అన్ని రంగాల్లో అభివృద్ధిని వేగవంతం చేయడం సాధ్యం కాదు. “మహిళలు సాధించిన పురోగతి సమాజ పురోగతికి కొలమానం” అన్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ మాటలను ఈ సమయంలో గుర్తు చేయడం సమంజసంగా ఉంటుందని భావిస్తున్నాను.
- మహిళల అభివృద్ధిలో అక్షరాస్యత కీలక పాత్ర పోషిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అదే సమయంలో వారి ఆర్థిక అవగాహన దేశాభివృద్ధిలో వారిని భాగస్వాములను చేసే దిశగా ముందుకు తీసుకెళుతుంది.
- దేశాభివృద్ధిలో మహిళల భాగస్వామ్యం లేకుండా పురోగతి సాధ్యం కాదనే విషయాన్ని మనందరం గుర్తించాలి. మహిళల సాధికారత, స్వావలంబన ద్వారా దేశాభివృద్ధిలో వారికి సమాన భాగస్వామ్యం కల్పించడం సాధ్యమౌతుంది. ఈ క్రమంలో ఆర్థిక అవగాహనతో పాటు వారికి సమాన హక్కులు, అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉంది.
- సూక్ష్మ ఆర్థిక వ్యవస్థలో మహిళల భాగస్వామ్యం కీలకమైనది. వారికి ఆర్థిక అవగాహన కల్పించడం ద్వారా మరియు గ్రామీణ మహిళలకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడం ద్వారా దేశ ఆర్థికాభివృద్ధిలో వారికి భాగస్వామ్యం కల్పించవచ్చు.
- గత రెండు దశాబ్ధాల్లో లక్షలాది మంది మహిళల జీవితాలు అభివృద్ధిని సాధించాయని తెలియజేయడం ఆనందదాయకం. మహిళలు ఆర్థిక వ్యవస్థలో భాగస్వాములు కావడం మాత్రమే కాదు, ఆర్థిక, సామాజిక అభివృద్ధిని సాధించారు.
- డిజిటల్ చెల్లింపుల దిశగా ప్రజలు క్రమంగా చైతన్యవంతం అవుతున్నారు. ఇదే క్రమంలో ఆర్థిక నేరాలు, సాంకేతిక నేరాల పట్ల ప్రజల్లో అవగాహన పెరగాల్సిన అవసరం ఉంది. దేశ ప్రజలకు ఆర్థిక అవగాహన కల్పించేందుకు ప్రభుత్వంతో పాటు ప్రైవేటు సంస్థలు కూడా ముందుకు రావడం ఆనందదాయకం.
- ప్రస్తుతం అంకుర సంస్థలకు భారతదేశం అతిపెద్ద మార్కెట్ గా అవతరించింది. ఈ దిశగా మహిళల భాగస్వామ్యం పెరగాల్సిన అవసరం ఉంది.
- ఆర్థిక వ్యవహారాల్లో పురుషులతో సమానంగా మహిళలకు నిర్ణయాధికారం దేశంలో చాలా కుటుంబాల్లో లేదు. ఈ పరిస్థితి మారి పురుషులతో పాటు మహిళలకు కూడా సరైన ఆర్థిక నిర్ణయాధికారం రావలసిన అవసరం ఉంది.