సీనియర్ జర్నలిస్టు ఆదిరాజు వెంకటేశ్వర రావుకు ఘన నివాళి
సీనియర్ జర్నలిస్ట్, రచయిత ఆదిరాజు వెంకటేశ్వరరావు గురువారం ఆసిఫ్నగర్లోని దత్తాత్రేయనగర్ స్వగృహంలో అనారోగ్యంతో కన్నుమూశారు.
వెంకటేశ్వరరావు అంతిమ సంస్కారాలు ఫిలింనగర్ లోని మహాప్రస్థానంలో శుక్రవారం మధ్యాహ్నం జరిగాయి. పాత్రికేయులు, సన్నిహితులు హాజరై ఘనంగా నివాళులు అర్పించారు.
1978 నుంచి కొన్ని సంవత్సరాలు ఆదిరాజు నాయకత్వంలో సమాచార భారతి బహుభాష వార్తా సంస్థ అనేక సంచలన వార్తలు అందించి జనాదరణ పొందిందని సీనియర్ జర్నలిస్టులు కోవూరు హనుమంత రావు, ఈశ్వర్ పిళ్ళై గుర్తు చేసారు . సమాచార భారతి వేదికగా పలువురు పత్రికా రంగంలో ప్రవేశించారని పేర్కొన్నారు. వివిధ రంగాల వారితో ఆదిరాజు వెంకటేశ్వరరావు కు సన్నిహిత సంబంధాలు ఉండేవని చెప్పారు. ఇటీవల రాష్ట్ర అవతరణ వేడుకల్లో విశిష్ట పురస్కారంతో గౌరవించిన ప్రభుత్వం.
ఘనంగా నివాళి అర్పించిన పాత్రికేయులు :
పలువురు సీనియర్ జర్నలిస్టులు అల్లం నారాయణ, దేవులపల్లి అమర్, కోవూరు హనుమంత రావు, క్రాంతి, పాశం యాదగిరి, ఈశ్వర్ పిళ్ళై, దేవులపల్లి అజయ్, కోవూరు వేణుగోపాల రావు, ఆదిరాజు సన్నిహితులు రాజు తదితరులు నివాళి అర్పించారు. ఆదిరాజు ఇద్దరు కుమారులను ఓదార్చారు. ఆదిరాజు చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు.
వెంకటేశ్వరరావు మృతిపట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర సంతాపం:
తొలితరం తెలంగాణ ఉద్యమ కారుడు, ప్రముఖ రచయిత, సీనియర్ జర్నలిస్టు ఆదిరాజు వెంకటేశ్వర రావు మరణం పట్ల ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆయన ఎంతో పోరాడారని, పత్రికా-సాహితీ రంగానికి విశేష సేవలు అందించారని ఆయన సేవలను ముఖ్యమంత్రి గుర్తు చేసుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఖమ్మం జిల్లా పండితాపురానికి చెందిన ఆదిరాజు వెంకటేశ్వర రావు 1969 ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేశారు. అనేక పుస్తకాలు రచించారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ లోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తెలంగాణ ఉద్యమంలో ఆయన క్రియాశీల పాత్రను గుర్తించి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆయనకు విశిష్ట పురస్కారం అందించింది.
ఆదిరాజు మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంతాపం :
అమరావతి :సీనియర్ పాత్రికేయులు ఆదిరాజు వెంకటేశ్వరరావు మృతిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రగాఢ సంతాపం తెలిపారు . ఆదిరాజు వెంకటేశ్వరరావు జర్నలిజానికి వన్నెతెచ్చారు, చెప్పదల్చుకున్నఅంశాన్ని ధైర్యంగా చెప్పేవారు. ఆదిరాజు వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు .