తెలుగు భాషాభివృద్ధికి తెలుగు అకాడమీ కృషి చేయాలి, దేశంలో ఉన్నతంగా తెలుగు అకాడమీ ఎదగాలి – తెలుగు అకాడమీ స్వర్ణోత్సవ వేడుకల్లో ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి
- దేశంలో ఉన్నతంగా తెలుగు అకాడమీ ఎదగాలి
- తెలుగు భాషాభివృద్ధికి తెలుగు అకాడమీ కృషి చేయాలి
- జే.ఈ.ఈ,నీట్ పోటీ పరీక్షల పుస్తకాలను తెలుగులో తేవాలి
- మారుతున్న ప్రమాణాలకనుగుణంగా పుస్తక ప్రచురణ ఉండాలి
- తెలుగును ప్రోత్సహించేందుకు సిఎం కేసిఆర్ తెలుగు భాష తప్పనిసరి చేశారు
- తెలుగు భాష ఉన్నన్ని రోజులు తెలుగు అకాడమీ ఉంటుంది
- తెలంగాణ విద్యార్థులు, రచయితలు, కవులకు అకాడమీ అండగా ఉండాలి
- తెలుగు అకాడమీ స్వర్ణోత్సవ వేడుకల్లో ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి
హైదరాబాద్, ఆగస్టు 08 : తెలుగు భాష ఉన్నంత కాలం తెలుగు అకాడమీ ఉంటుందని, తెలుగు భాషాభివృద్ధికి కృషి చేస్తూ తెలంగాణ విద్యార్థులు, రచయితలు, కవులు, భాషాభిమానులకు తెలుగు అకాడమీ అండగా ఉండాలని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి ఆకాంక్షించారు. తెలుగు అకాడమీ ఏర్పాటై 50 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా తెలుగు అకాడమీ స్వర్ణోత్సవ వేడుకల్లో ముఖ్య అతిధిగా ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి పాల్గొన్నారు. కోటి 40 లక్షల రూపాయలతో ఆధునీకరించిన భవనాన్ని ప్రారంభించారు. స్వర్ణోత్సవం సందర్భంగా రూపొందించిన తెలుగు అకాడమీ ప్రత్యేక సంచికను, 50 సంవత్సరాల మోనోగ్రామ్ ను ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఆవిష్కరించారు.
తెలుగు అకాడమీ దేశంలోని అన్ని అకాడమీల కంటే ఉన్నతంగా, పటిష్టంగా ఎదగాలని, ఇందుకోసం మారుతున్న కాలానికనుగుణంగా, ప్రమాణాలకనుగుణంగా పుస్తకాలను ప్రచురించాలని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సూచించారు. తెలుగుకు గొప్ప వైభవం తీసుకొచ్చే విధంగా అకాడమీ పనిచేయాలన్నారు. తెలుగు వైభవాన్ని ప్రపంచానికి చాటే విధంగా ముఖ్యమంత్రి కేసిఆర్ తెలుగు ప్రపంచ మహా సభలు నిర్వహించారని గుర్తు చేశారు.
తెలుగు అకాడమీకి మంచి వనరులున్నాయని, వీటిని ఉపయోగించుకుని తెలుగు భాషకు సేవ చేయాలని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి చెప్పారు. తెలుగు అకాడమీ ఇప్పటి వరకు 4000 పుస్తకాలను రూపొందించడం గొప్ప అంశమన్నారు. జాతీయ స్థాయిలో నిర్వహించే జే.ఈ.ఈ, నీట్ పోటీ పరీక్షలకు తెలుగులో పుస్తకాలు ముద్రించాలన్నారు. వీటితో పాటు మిగిలిన పోటీ పరీక్షలన్నింటికి అభ్యర్థులకు అవసరమయ్యే పుస్తకాలను రూపొందించి, అందించాలన్నారు.
తెలుగు భాషను ప్రోత్సహించే విధంగా ముఖ్యమంత్రి కేసిఆర్ 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు తెలుగు తప్పనిసరి చేశారని, ఇది తెలుగు భాషకు ఎంతో ఉపయోగపడుతుందని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. తెలుగును ప్రోత్సహించే విధంగా, తెలుగు భాషను ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా అకాడమీ కొత్త కార్యక్రమాలు రూపొందించుకోవాలని సూచించారు.
తెలుగు అకాడమీ కార్యక్రమాలను మరింత విస్తృతం చేయాలని, మరింత గొప్ప గుర్తింపు పొందాలని ఆకాంక్షించారు. తెలుగు అకాడమీకి ప్రభుత్వం నుంచి పూర్తి సాయ, సాకారాలుంటాయని హామీ ఇచ్చారు.
తెలంగాణ రాష్ట్రం వచ్చాక జూనియర్ కాలేజీలకు మహర్ధశ వచ్చిందని ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ అన్నారు. తెలుగు అకాడమీ పుస్తకాలు అత్యంత నాణ్యతతో ఉన్నాయని, ఇంటర్ లో ఉచిత పుస్తకాల కార్యక్రమానికి తెలుగు అకాడమీ అందిస్తున్న సేవలు గొప్పవని కొనియాడారు.
ఉన్నత విద్యలో తెలుగు పుస్తకాలను తీసుకొచ్చే గొప్ప లక్ష్యంతో 50 సంవత్సరాల క్రితం తెలుగు అకాడమీ మాజీ ప్రధాన మంత్రి పి.వి నరసింహ్మరావు ఏర్పాటు చేశారని అకాడమీ డైరెక్టర్ సత్యనారాయణ రెడ్డి అన్నారు. తెలుగు అకాడమీ లేనప్పుడు తెలుగులో పరీక్షలు రాయడానికి విద్యార్థులకు అనుమతి ఉన్నా…పుస్తకాలు లేక ఇబ్బంది పడేవారని చెప్పారు. ఇప్పుడు ఇంటర్, డిగ్రీ, పిజీ, ఇంకా అనేక పోటీ పరీక్షల పుస్తకాలను తెలుగులో ప్రచురించి విద్యార్థులకు అందుబాటులోకి తెచ్చామన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇంటర్, డిగ్రీ, పీజీ పుస్తకాలను మార్చి ముద్రించినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్, తెలుగు అకాడమీ డైరెక్టర్ సత్యనారాయణ రెడ్డి, మాజీ డైరెక్టర్ వెలిశాల కొండల్ రావు, చీఫ్ ఇంజనీర్ మల్లేషం, ఇతర అధికారులు పాల్గొన్నారు.