గవర్నర్ అల్ఫాహార విందుకుహాజరైన తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం చంద్రబాబు
ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన పవన్ కల్యాణ్
హైదరాబాద్ ఆగష్టు 15(ఎక్స్ ప్రెస్ న్యూస్): 71వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ఇచ్చిన అల్ఫాహార విందుకు ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం కేసీఆర్, కేంద్రమంత్రులు దత్తాత్రేయ, సుజనా చౌదరి, తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య,జనసేన పార్టీ అధ్యక్షుడు, ప్రముఖ సినీనటుడు పవన్ కల్యాణ్ హాజరయ్యారు. ఈ విందుకు హాజరు కావాలని గవర్నర్ ప్రత్యేకంగా పవన్ను ఆహ్వానించారు. ఆయన ఆహ్వానం మేరకు రాజ్భవన్లో నిర్వహించిన తేనీటి విందుకు పవన్ తొలిసారి హాజరయ్యారు.
ఎట్హోంగా పిలిచే ఈ అల్పాహార విందు కార్యక్రమంలో పవన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిరథ మహారథులందరికీ గవర్నర్ నరసింహన్ దంపతులు ఘనంగా స్వాగతం పలికారు. అయితే ఇంతకు ముందు కూడా ఇద్దరు సీఎంలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నా… ఈసారికి ఉన్న ప్రత్యేక వేరని తెలుస్తోంది. విభజన తర్వాత రెండు రాష్ట్రాల మధ్య ఎన్నో సమస్యలు అపరిస్కృతంగా ఉన్నాయి. ఈ సమస్యల పరిష్కారానికి రెండు రాష్ట్రాలు ఎన్నోసార్లు చర్చలు జరుపుకున్నాయి. ఒక్కోసారి గవర్నర్ కూడా ఈ చర్చల్లో పాల్గొన్నారు. ఈసారి ఇద్దరు ముఖ్యమంత్రులు మరింత చేరువయ్యారు. ఢిల్లీ పర్యటనలో, ఆ తర్వాత కేసీఆర్ తన పాత మిత్రుడికి స్నేహ హస్తం చాపారు.విభజన సమస్యలపై కలిసి మాట్లాడుకుని పరిష్కరించుకుందామని చంద్రబాబుతో చెప్పినట్లు కేసీఆర్ తెలిపారు. చంద్రబాబు కూడా మొదటి నుంచి ఇదే చెబుతూ వస్తున్నారు.
తెరాస ఎంపీలు కేశవరావు, డీఎస్, ఆంధ్రప్రదేశ్ సభాపతి కోడెల శివప్రసాదరావు, తెలంగాణ మంత్రులు సీఎం కడియం శ్రీహరి, నాయిని నర్సింహారెడ్డి, కేటీఆర్,లక్ష్మారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఈటల రాజేందర్, కాంగ్రెస్ నేతలు జానారెడ్డి, షబ్బీర్ అలీ, ఏపీ మంత్రి కామినేని శ్రీనివాస్, భాజపా నేతలు కిషన్రెడ్డి, లక్ష్మణ్, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి, తెలంగాణ మాజీ సీఎస్ రాజీవ్ శర్మ, తెలంగాణ బీసీ కమిషన్ ఛైర్మన్ బీఎస్ రాములు, బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు.