తెలంగాణ గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ వారి ఆద్వర్యంలో 23.04.2019న నిర్వహించిన మామిడి కొనుగోలుదారులు మరియు అమ్మకపుదారుల సమావేశం
ఈ రోజు అనగా 23.04.2019 తేదీన గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్), తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం వారు శ్రీ కొండ లక్ష్మణ బాపూజీ తెలంగాణా రాష్ట్ర ఉద్యాన విశ్వ విద్యాలయం మరియు తెలంగాణా రాష్ట్ర ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ వారి సహకారంతో మామిడి కొనుగోలుదారులు మరియు అమ్మకపుదారుల (మహిళా రైతులు) సమావేశాన్ని నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి సి. పార్ధసారధి IAS, వ్యవసాయ ఉత్పత్తుల కమిషనర్ మరియు, వ్యవసాయ ముఖ్య కార్యదర్శి గారు ముఖ్య అతిధిగా పాల్గొని తెలంగాణ రాష్ట్రంలో సుమారు 2.85 లక్షల ఏకరాలలో మామిడిని సాగుచేస్తూ 10.23 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి సాధిస్తున్నామని, ఇందులో 85% – 90% బంగినపల్లి రకం మామిడి సాగు చేస్తున్నారని తెలపడం జరిగింది. అంతేకాకుండా ఉద్యాన శాఖ రైతులకు మామిడి తోటల పెంపకానికి వివిధ ప్రోత్సాహకాలు అందిస్తుందని తెలియచేయడం జరిగింది.
మామిడి పండించే చిన్న సన్నకారు మహిళా రైతులు మరియు స్వయం సహాయక బృంద సభ్యుల ఆదాయాన్ని పెంచాలనే ఉద్ద్యెశ్యంతో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ చేపట్టిన ఈ కార్యక్రమానికి పైలెట్ ప్రాజెక్ట్ గా మొట్టమొదటిసారిగా వివిధ ప్రభుత్వ శాఖలైన ఉద్యాన శాఖ, మార్కెటింగ్ శాఖ, పుడ్ ప్రొసెస్సింగ్ సొసైటీ, ఉద్యాన విశ్వవిద్యాలయం వారి సమన్వయంతో చేపట్టడం జరిగిందని, ముఖ్యంగా దీని వెనుక సెర్ప్ ముఖ్య కార్యనిర్వహణాదికారి శ్రీమతి పౌసమి బసు IAS గారి చొరవ మరియు కృషి అభినందనీయమని కొనియాడడం జరిగింది.
కొనుగోలు దారులు మరియు అమ్మకపు దారులను ఒకే వేదిక మీదికి తీసుకుని వచ్చి తద్వారా మధ్యవర్తుల ప్రమేయం లేకుండా రైతులు పండించిన పంటకు తగిన తగిన ధర పొందే అవకాశం కల్పించడమే ఈ సమావేశం ముఖ్య ఉద్ద్యెశమని తెలపడం జరిగింది.
ఈ పైలెట్ ప్రాజెక్టు కోసం రాష్ట్రంలోని (4 జిల్లాలు) నాగర్ కర్నూల్, జగిత్యాల్, మహబూబ్ నగర్ మరియు మంచీర్యాల జిల్లాలోని 11 మండలాలోని 94 గ్రామాలలో 2850 మంది మహిళా మామిడి రైతులను ఎంపిక చేసి, వీరిని 175 మామిడి ఉత్పత్తుదారుల సంఘాలుగా ఏర్పరచడం జరిగింది. గత 2-3 నెలల నుండి ఉద్యాన విశ్వవిద్యాలయం వారి సహకారంతో మామిడి పండ్ల కోయడం, ప్యాకింగ్, గ్రేడింగ్ పై 2459 రైతులకు మరియు 806 మంది మామిడి కాయలు కోసే (pickers) వారికి క్షేత్ర స్థాయిలో శిక్షణ ఇవ్వడం జరిగింది.
ఎల్. వెంకట్రామ్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర ఉద్యాన సంచాలకులు గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో పండించే మామిడి పండ్లు అధిక నాణ్యత కలిగి ఉంటాయని, ముఖ్యంగా జగిత్యాల్, కొల్లాపూర్ మామిడి పండ్లకు అత్యంత ఆధరణ ఉందని, అయితే రైతులు ముఖ్యంగా మామిడి పండ్ల పక్వతపై దృష్టి పెట్టాలని, సరైన పక్వత లేకపోతే తగిన నాణ్యత ఉండదని చెప్పడం జరిగింది.
అంతేకాకుండా తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం చేపట్టిన సర్వే ప్రకారం మన రాష్ట్రంలో పండే మామిడి ఉత్పత్తిలో 10% మాత్రమే వినియోగిస్తున్నారని మరియు 36% ప్రజలు మాత్రమే మామిడి పండ్లను తింటున్నారని తెలపడం జరిగింది. అయితే దీని వాడకం మరింత పెరగాల్సిన ఆవశ్యకత ఉన్నదని, ప్రతి ఒక్కరు మామిడి పండ్ల సీజన్ లో 2-3 కిలోల మామిడి పండ్లు తినాలని కొరడమైనది.
తెలంగాణ రాష్ట్ర ఉద్యాన అభివృద్ధి సంస్థ ద్వారా తెలంగాణ మామిడి పండ్ల అమ్మకాలు దేశ రాజధాని డిల్లీ లో చేపట్టడం జరిగిందని తద్వారా మామిడి పండ్లకు దేశవ్యాప్త ప్రాచుర్యం కల్పించడం జరిగిందని తెలపడం జరిగింది. వివిధ ప్రభుత్వ శాఖల సమన్వయంతో ఈ సమావేశం నిర్వహించిన గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ని అభినందించడం జరిగింది.
అనంతరం సెర్ప్ ముఖ్య కార్యనిర్వహాధికారి శ్రీమతి పౌసమి బసు IAS గారు ఈ ప్రాజెక్టు గురించి సవివరంగా తెలియచేయడం జరిగింది, సుమారు 3,500 మెట్రిక్ టన్నుల అమ్మకాలు లక్ష్యంగా నిర్దేశించుకుని, దీనికి గాను గ్రామ స్థాయి సేకరణ కేంద్రాలు మరియు జిల్లా స్థాయి సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పటం జరిగింది.
ఈ సమావేశంలో పాల్గొన్న వివిధ కొనుగోలు సంస్థలు, వారికి కావలిసిన నాణ్యత ప్రమాణాలు, మామిడి పండ్లు పరిమాణం (టన్నులలో) గురించి వివరాలను ఇవ్వడం జరిగింది.
ఈ సమావేశంలో శ్రీ ఎల్. వెంకట్రామ్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర ఉద్యాన సంచాలకులు గారు, అఖిల్ గౌరవ్ గారు, తెలంగాణ పుడ్ ప్రొసెస్సింగ్ సొసైటి సంచాలకులు, డా. భగవాన్, పరిశోధన సంచాలకులు, కొండ లక్ష్మణ బాపూజీ తెలంగాణా రాష్ట్ర ఉద్యాన విశ్వ విద్యాలయం, 4 జిల్లాల నుండి మామిడి రైతులు మరియు ఉత్పత్తిదారుల సంఘ సభ్యులు, ఉద్యాన శాఖ & సెర్ఫ్ అధికారులు, బిగ్ బాస్కెట్, వాల్ మార్ట్, విలేజ్ బాస్కెట్, అలనా, శిరాత్ అగ్రో, ప్యాప్సీ, ఫిక్కీ, సిఐఐ, మొదలైన సంస్థల ప్రతినిధులు పాల్గొనడం జరిగింది.