“సినివారం”కార్యక్రమంలో భాగంగా ఈరోజు “లగ్గం” లఘు చిత్ర ప్రదర్శన
తెలంగాణ ప్రభుత్వం – భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “సినివారం” కార్యక్రమంలో భాగంగా ఈరోజు (10.03.2018) సాయంత్రం పైడి జయరాజ్ ప్రివ్యూ థియేటర్ లో, రవీంద్ర భారతిలో “లగ్గం” లఘు చిత్ర ప్రదర్శన జరిగింది.
అభయ్, అన్నీ కేథరిన్ నటీనటులుగా ఆదిత్య హసన్ దర్శకత్వంలో వచ్చిన లగ్గం లఘుచిత్రంలో టైటిల్కు తగ్గట్టే మాటలున్నాయి. అచ్చ తెలంగాణ యాసలో దోస్తుగాళ్లు మాట్లాడుకుంటే ఎట్లుంటదో ఈ సినిమా అట్లున్నది. అభివృద్ధి పోకడలను సైక్లింగ్ వ్యవస్థను ఎత్తి చూపాడు దర్శకుడు.
సోషల్మీడియా నుంచి మొదలు ఇంజినీరింగ్ చదువుల గురించి చర్చించాడు. ఎన్నారైలు ఇండియాకు వచ్చి ఎలా ప్రవర్తిస్తారు? వచ్చాక ఎలా ఉంటారు? వెళ్తున్నప్పుడు ఎలా ఉంటారు? వెళ్లాక ఎలా మారుతారు? అనే అంశాలపై చక్కటి వివరణ ఇచ్చాడు. కెరీర్లో ఎదుగకపోతే ఎవరు బాధపడుతారు? ఎవరు సంతోషంగా ఉండరని కూడా చెప్పాడు. ప్రభుత్వ ఉద్యోగం కొట్టాలనుకున్న అభయ్ ఉద్యోగం సాధించాడా? ప్రేమించిన అమ్మాయిని గెలుచుకున్నాడా? తెలియాలంటే లగ్గం సూడాలి.
ఈ సందర్భంగా…సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ గారు మాట్లాడుతూ… మన మట్టిలోంచి, మన మూలాల నుంచి సినిమాని తీసి మంచి ప్రయత్నం చేశారని లఘు చిత్రంలో కెమెరా వర్క్ అద్భుతంగా ఉందని, తెలంగాణ యాసని ఉపయోగించి సినిమాని కొత్తగా చూపించే ప్రయత్నం చేశారని అభినందించారు.
ఆ తరువాత అనంతరం ఆయా చిత్ర బృందాలతో ముఖాముఖీ కార్యక్రమం నిర్వహించారు.
అందులో భాగంగా పెళ్లి చూపులు ఫెమ్ అభయ్ మాట్లాడుతూ ఔత్సాహిక సినీనటులకు పలు సూచనలు, నటనలో పలు మెళకువలు తెలియజేశారు.
అనంతరం ప్రతీ రెండవ శనివారం నిర్వహించే టాక్ @ సినివారం కార్యక్రమంలో భాగంగా సినీదర్శకుడు ఆర్.కె. మామ పాల్గొని మాట్లాడారు.
తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో సినివారం లాంటి ప్లాట్ ఫామ్ నిర్వహించడం సినిమా ప్రేమికులకు , ఔత్సాహిక సినిమా కళాకారులకు గొప్ప వరం అన్నారు. మూస ధోరణిలో కాకుండా కొత్తరకంగా సినిమా తీయాలనే ఆలోచనతో సినిమాలు తీశానన్నారు.
కోటి 20 లక్షల రూపాయలతో సొంత నిర్మాణంలో “హైదరాబాద్ నవాబ్స్” అనే సినిమా తీశానన్నారు. అంగ్రేజి సినిమా సమయంలో సినిమా విడుదల కోసం థియేటర్లు దొరకలేదన్నారు. ప్రస్తుతం హైదరాబాద్ నవాబ్స్-2 సినిమాని రూపొందింస్తున్నానని అన్నారు. కథ, కథనమే సినిమాకు ముఖ్యం అన్నారు.
ఈ కార్యక్రమంలో సినీ ప్రేమికులు , సినివారం బృందం పాల్గొన్నారు.