సమాజానికి మంచి కవిత్వాన్ని అందించే కవులు, రచయితలకు గుర్తింపు లభిస్తుంది, అక్షరం విలువ గుర్తించి కవిత్వాలు రాయాలి – తెలంగాణ సాహిత్య అకాడమీ ఛైర్మన్ నందిని సిధారెడ్డి
సమాజానికి మంచి కవిత్వాన్ని అందించే కవులు, రచయితలకు గుర్తింపు లభిస్తుంది , కవికి అక్షరమే ఆయుధమని, అక్షరం విలువ గుర్తించి కవిత్వాలు రాయాలని తెలంగాణ సాహిత్య అకాడమీ ఛైర్మన్ నందిని సిధారెడ్డి అన్నారు.
రచయిత చిత్తలూరి సత్యనారాయణ రచించిన “నల్ల చామంతి” కవితా సంపుటి పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని సుందరయ్య కళానిలయంలో గురువారం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్ననందిని సిధారెడ్డి పుస్తకాన్ని ఆవిష్కరించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. రచయిత మంచి పుస్తకాన్ని రాశారన్నారు. కొత్తగా ఎంతో మంది కవులు వస్తున్నారని, కవిత్వం ప్రజలను ఆలోచింపచేస్తుంది కావున కవిత్వం విలువలు తెలిసిన వారే కవిత్వాలు రాయాలని సూచించారు. రచయితలు, కవులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి అధ్యయనం చేసి రాసే పుస్తకాలకు ఆదరణ లభిస్తుందన్నారు. పాత కవులతోపాటు ఇప్పుడు కొత్తతరం కవులు, రచయితలు మంచి పుస్తకాలను రాస్తున్నారని అభినందించారు.
ఈ కార్యక్రమానికి సభాధ్యక్షుడిగా ఏనుగు నరసింహారెడ్డి వ్యవహరించగా, పుస్తక రచయిత చిత్తలూరి సత్యనారాయణ, కవులు కె.శివారెడ్డి, జి.లక్ష్మీ నరసయ్య తదితరులు పాల్గొన్నారు.