అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని రవీంద్రభారతిలో జరిగిన టీప్రైడ్ అవార్డుల ప్రదానోత్సవంలో పాల్గొన్న మంత్రులు కేటిఆర్, జగదీష్ రెడ్డి
రవీంద్రభారతిలో జరిగిన టీప్రైడ్ అవార్డుల ప్రదానోత్సవంలో మంత్రులు కేటిఆర్, జగదీష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని ఎస్సీ వ్యాపారవేత్తలకు అవార్డులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి కేటీఆర్.. ఎస్సీలకు తెలంగాణలో దక్కినట్లుగా ప్రోత్సాహం దేశంలో మరెక్కడా దక్కడం లేదన్నారు. శిక్షణ ఇచ్చి దళిత, గిరిజన గుత్తేదారులను ప్రోత్సహిస్తున్నామన్నారు. దళితులకు బిజినెస్ ఫెసిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేస్తామన్నారు. సూక్ష్మ, చిన్న పరిశ్రమలు ఎన్పీఏ బారిన పడకుండా పరిష్కారం చూపిస్తామన్నారు. రూ. 50 కోట్ల కార్పస్ ఫండ్తో మూతపడే స్థితిలో ఉన్న కంపెనీలను ఆదుకుంటున్నామని కేటీఆర్ స్పష్టం చేశారు.
దళితుల అభివృద్ధి కోసం ఆచరణతో, త్రికరణ శుద్ధితో పనిచేస్తున్న ప్రభుత్వం తెలంగాణ. ఆచరణలో చేసి చూయించడమే అంబేడ్కర్కు నిజమైన నివాళి. దళిత పారిశ్రామిక వేత్తలు, కాంట్రాక్టర్లను ప్రోత్సహిస్తున్నం. పారిశ్రామిక హెల్త్ క్లీనిక్ దేశంలో ఎక్కడా లేదు. ఇండస్ట్రియల్ హెల్త్ క్లీనిక్ ద్వారా పరిశ్రమలను పునరుద్దరిస్తున్నాం. ఒక ప్రణాళికతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతున్నది. ఉన్నవారు, లేని వారు తప్ప భవిష్యత్తులో మరో కులం ఉండదు. టీ ప్రైడ్ ద్వారా ఎంతో మంది పారిశ్రామిక వేత్తలుగా ఎదుగుతున్నారు. చదువు సవ్యంగా అందించగలిగితే యువత ప్రపంచంతో పోటీ పడుతుంది. విద్య విషయంలో ప్రభుత్వం ఎంతో శ్రద్ధతో పనిచేస్తుంది. ప్రపంచంతో పోటీ పడే ఆత్మవిశ్వాసాన్ని చదువు కల్పిస్తున్నది. అంబేడ్కర్ ఓవర్సీస్ పథకంతో విదేశీ విద్యకు ఆర్థిక సాయం అందిస్తున్నం. నాణ్యమైన విద్యను అందించేందుకు రాష్ట్రంలో 700 పైచిలుకు గురుకులాలను ప్రారంభించుకున్నాం. బోధించు, సమీకరించు, పోరాడు.. నినాదంతో ఉద్యమంతో ముందుకెళ్లినం.. అని కేటీఆర్ తెలిపారు.