హైదరాబాద్ను విశ్వనగరంగా తీర్చిదిద్దే చర్యల్లో ప్రభుత్వం మరో ముందడుగు
హైదరాబాద్ను విశ్వనగరంగా తీర్చిదిద్దే చర్యల్లో ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. గ్రేటర్ మణిహారమైన ఔటర్ రింగ్ రోడ్డు వెంట రెండుచోట్ల ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్లు ఏర్పాటు చేయాలని సంకల్పించింది. ఇందులో భాగంగా తొలుత తెల్లాపూర్లో టెక్నోసిటీ, శ్రీనగర్లో డిస్కవరీ సిటీ పేరిట పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్ షిప్ (పీపీపీ)లో రెండు సమీకృత పట్టణాలు ఏర్పాటు చేసేందుకు హెచ్ఎండీఏ బోర్డు ఏడో సమావేశంలో ఆమోద ముద్ర పడింది. ఈ రెండు టౌన్షిప్ల ప్రతిపాదనలను ఆచరణలోకి తీసుకువచ్చే దిశగా చర్యలకు శ్రీకారం చుట్టారు. పురపాలక, పట్టణాభివృద్ధిశాఖల మంత్రి కే తారకరామారావు అధ్యక్షతన బుధవారం బేగంపేటలోని మెట్రో రైల్ భవన్లో హెచ్ఎండీఏ బోర్డు ఏడో సమావేశం జరిగింది. పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్, హెచ్ఎండీఏ కమిషనర్ చిరంజీవులు, జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్రెడ్డి ఆయా ప్రభుత్వశాఖల ముఖ్య అధికారులు ఈ సమావేశంలో పాల్గొని హెచ్ఎండీఏకు సంబంధించిన 42 అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. విశ్వనగర అభివృద్ధే లక్ష్యంగా చేపట్టాల్సిన ప్రాజెక్టులు, తక్షణం అమలు చేయాల్సిన పథకాలకు ఆమోద ముద్ర వేశారు.
మూసీ రివర్ ఫ్రంట్లో భాగంగా మరో కిలోమీటర్ మేర ఉప్పల్ భగాయత్ బఫర్జోన్ పరిధిలో సుందరీకరణ పనులు, బాలానగర్ ైఫ్లెఓవర్ పనులపై నిర్ణయం తీసుకున్నారు. భవిష్యత్తు అభివృద్ధికి బాటలు వేసే లక్ష్యంలో తెరపైకి ల్యాండ్ పూలింగ్ స్కీం (భూ సమీకరణ పథకం)ను తక్షణం అమలు చేయాలని నిర్ణయించారు. నగరం నలువైపులా ఇంటర్ సిటీ బస్ టెర్మినల్స్ ఏర్పాటు చేయాలని, ప్రతిపాదనల రూపకల్పనపై చర్చించారు. హెచ్ఎండీఏ చేపట్టిన లే అవుట్లో మిగిలిపోయిన చిన్న, చిన్న స్థలాలను విక్రయించాలని, పౌరులను ముప్పుతిప్పలు పెడుతున్న మాస్టర్ప్లాన్ను శాస్త్రీయంగా రూపొందించాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఉన్న మాస్టర్ప్లాన్లో మార్పులు-చేర్పులు చేసి భవిష్యత్తులో ఎలాంటి సమస్యల్లేని సమీకృత మాస్టర్ప్లాన్ రూపకల్పన దిశగా చర్యలు తీసుకోవాలని మంత్రి కేటీఆర్ అధికారులకు సూచించారు. ల్యాండ్పూలింగ్ స్కీం ద్వారా అభివృద్ధిని పరుగులు పెట్టిస్తామని నవీన్ మిట్టల్ పేర్కొన్నారు. హెచ్ఎండీఏలో నిధుల కొరత లేదని కమిషనర్ చిరంజీవులు చెప్పారు.
ప్రధానంగా చర్చకు వచ్చిన అంశాలు
-ఎస్ఆర్డీపీలో భాగంగా బాలానగర్ క్రాస్రోడ్ నుంచి నర్సాపూర్ జంక్షన్ వరకు రూ.380 కోట్లతో నిర్మించనున్న ైఫ్లెఓవర్ నిర్మాణ పనులకు ఆమోద ముద్ర వేశారు.
-సంగారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో చేపడుతున్న రహదారి విస్తరణ పనులు, సెంట్రల్ లైటింగ్, ఫుట్పాత్ తదితర అభివృద్ధి పనులకు, ఉప్పల్లో 72 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్న లే అవుట్ అభివృద్ధి పనులకు బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
-మూసీ రివర్ ఫ్రంట్లో భాగంగా ఉప్పల్భగాయత్లో మరో కిలోమీటర్ మేర సుందరీకరణ పనులు, నెక్లెస్రోడ్లో కూకట్పల్లి ఐ అండ్ డీ నిర్మాణ పనులకు, ఇన్నర్ రింగ్ రోడ్ మైలార్దేవరపల్లి నుంచి శ్రీశైలం రోడ్ వయా లక్ష్మీగూడ, జల్పల్లి, మామిడిపల్లి పీ7 రోడ్ పనులకు ఆమోద ముద్ర వేశారు.
-పీపీపీ పద్ధతిలో తెల్లాపూర్లో ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ (టెక్నో సిటీ) ఏర్పాటుకు త్వరలోనే డీపీఆర్ను అందజేయాలని, ఔటర్ సమీపంలోని శ్రీనగర్ వద్ద ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ (డిస్కవరీ సిటీ) పనులను పట్టాలెక్కించాలని నిర్ణయించారు.
-ఔటర్ భూ నిర్వాసితుల కోసం కోహెడలో వేసిన లే అవుట్ను మరింత అభివృద్ధి చేయాలని నిర్ణయించారు.
-2017-18 బడ్జెట్తోపాటు సిటీ ఐటీఎస్ ప్రాజెక్టు, టీఎంఎస్, హెచ్టీఎంఎస్ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.