రవీంద్రభారతిలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు – హాజరైన విద్యాశాఖా మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి, విద్యాశాఖా కార్యదర్శి జనార్దన్ రెడ్డి లు – మంత్రి జగదీష్ రెడ్డి చేతుల మీదుగా ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డుల ప్రదానోత్సవం
అనంతరం జరిగిన సభలో మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి మాట్లాడుతూ గురువులను పూజించడంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కు ముఖ్యమంత్రి కేసీఆరే సాటి అని, తనకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులకు ఆయన ఇచ్చే ప్రాధాన్యత తెలియంది కాదు అని అన్నారు.
ఉపాధ్యాయులకు ఇక్కడ లభించినంత గౌరవం మరే దేశంలో లేదని, వృత్తిలో ఉపాధ్యాయులకు ఉండే సంతృప్తి అపురూపమైనదని, ఎంత ఉన్నతికి ఎదిగినా గురువులను మరచి పోవడం దుర్లభం అని చెప్పారు. నేటి సమాజంలో ఉపాధ్యాయులపై వత్తిడి పెరిగింది. ఉపాధ్యాయుల నుండి సమాజం ఎంతో నేర్చుకోవలన్న ఆశ, ఆకాంక్ష కనపరుస్తుందని, పోటీ ప్రపంచంలో విద్యార్థులను తీర్చి దిద్దే గురుతర బాధ్యత ఉపాద్యాయులమీదనే ఉందన్నారు.
అన్నింటినీ అధిగమించి ఉత్తమ ఉపాధ్యాయులుగా పురస్కారం అందుకునెందుకు ఉపాద్యాయులు పోటీ పడాలి. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో విద్యావ్యవస్థ పటిష్టవంతంగా మారుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా ఉపాధ్యాయులు చేస్తున్న కృషి విస్మరించలేనిదని మంత్రి జగదీష్ రెడ్డి కొనియాడారు.
విద్యార్థుల భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకుని ఉపాధ్యాయులు పడుతున్న శ్రమ మరచిపోలేము. విద్యావ్యవస్థ మొదలైంది భారత దేశంలోనే వేల సంవత్సరాల క్రిందటే ఈ దేశంలో విశ్వవిద్యాలయాలకు అంకురార్పణ జరిగిందని, అసంఖ్యాక గురుకులాలు ఏర్పాటే ఇందుకు నిదర్శనం. ఒక్క గురుకులాల మీదనే ముఖ్యమంత్రి కేసీఆర్ 15 వేల పై కోట్లు ఖర్చు చేస్తున్నారని అన్నారు.
అనంతరం మంత్రి జగదీష్ రెడ్డి చేతుల మీదుగా ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది.