సముద్రాల
హుస్నాబాద్ నియోజకవర్గం
ఈ ఖరీఫ్ లో మిడ్ మానేరు ద్వారా 75 వేల ఎకరాలు
వచ్చే యాసంగి లో గౌరవెల్లి ద్వారా 75 వేల ఎకరాలు.
కరువు పీడిత ప్రాంతాలు సస్యశ్యామలం.
గౌరవెల్లి పంప్ హౌజ్ 2 నెలల్లో పూర్తి.
పనుల వేగం రెట్టింపు చేయాలి.
– మంత్రి హరీశ్ రావు.
కాళేశ్వరం తొలిఫలితం హుస్నాబాద్ తదితర దుర్భిక్ష ప్రాంతాలకు అందనున్నట్టు ఇరిగేషన్ మంత్రి చెప్పారు.సిరిసిల్ల, హుస్నాబాద్, మానకొండూరు, ఇల్లంతకుంట, స్టేషన్ ఘం పూర్ అసెంబ్లీ నియోజకవర్గాలను సస్యశ్యామలం చేయడం ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని మంత్రి హరీశ్ రావు అన్నారు.సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ డివిజన్ లోని గౌరవెల్లి సాగునీటి ప్రాజెక్ట్ ద్వారా వచ్చే యాసంగి లో 75 వేల ఎకరాలకు సాగునీటిని అందించనున్నట్టు మంత్రి హరీశ్ రావు చెప్పారు.
మిడ్ మానేరు ద్వారా ఈ ఖరీఫ్ లో 75 వేల ఎకరాలకు సాగునీరందివ్వనున్నట్టు ఆయన తెలిపారు. బుధవారం హుస్నాబాద్ సమీపంలో మంత్రి హరీశ్ రావు మీడియా సమావేశంలో మాట్లాడారు.అంతకుముందు ఆయన తోటపల్లి రిజర్వాయర్,తోటపల్లి లిఫ్ట్ పథకం, మోయతుమ్మెద వాగుపై అక్విడెక్ట్ లు,గౌరవెల్లి రిజర్వాయర్ పంప్ హౌజ్, టన్నెల్, సర్జ్ పూల్, కెనాల్స్ పనులు తనిఖీ చేశారు. 8.3 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో సుమారు లక్ష 20 వేల ఎకరాలకు సాగునీరు అందించేలా గౌరవెల్లి ప్రాజెక్టును నిర్మిస్తున్నామని ఆయన చెప్పారు. గౌరవెల్లి లో 12 కిలోమీటర్ల టన్నెల్ పనులలో 6 కిలోమీటర్ల టన్నెల్ పనులు పూర్తయినట్టు హరీశ్ రావు తెలిపారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి 75 కిలోమీటర్ల కాలువలో 73 కిలోమీటర్లు పూర్తయిందని వివరించారు.ఈ 2 కిలోమీటర్ల పనులకు గాను మిగిలిపోయిన భూసేకరణ పనులను పూర్తి చేయాలని సిద్ధిపేట, కరీంనగర్ జిల్లాల కలెక్టర్ లను మంత్రి కోరారు.
గౌరవెల్లి కింద సీలింగ్ భూములు, మొఖా మీద ఉన్న వారికి కూడా రాష్ట్ర ప్రభుత్వం తరపున పూర్తిగా సహకరిస్తామని మంత్రి భరోసా ఇచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవతో ఇక్కడ వరద కాలువ జీవనదిగా మారుతున్నదని చెప్పారు. ఎస్సారెస్పీ నిండినా నిండకపోయినా, వరద వచ్చినా రాకపోయినా కాళేశ్వరం ద్వారా ఈ ప్రాజెక్టు ఒక్క ఏడాదిలోనే జీవకాలువగా మారుతుందని వివరించారు.
ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్ర పాలకులు ప్రాజెక్టులు నిజంగా రైతులకు నీళ్లు ఇచ్చే ఉద్దేశ్యంతో కట్టలేదని మంత్రి హరీశ్ రావు విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టుని యుద్ధ ప్రాతిపాదికన నిర్మిస్తున్నామని, ఇప్పటికే 75 శాతం పూర్తయిందని వెల్లడించారు. ఒకప్పుడు ప్రాజెక్టు అంటే కల అని, నేడు టిఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రాజెక్టు అంటే నిజం అని హరీశ్ రావు అన్నారు. ఎవరు అడ్డుపడ్డా వచ్చే వానాకాలానికి కాళేశ్వరం నీళ్లు హుస్నాబాద్ కు నీళ్లు వస్తాయని స్పష్టం చేశారు.నిర్వాసిత కుటుంబాలకు ప్రభుత్వం తరుపున పూర్తి సహకారం అందిస్తామని మంత్రి హరీశ్ రావు భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ హయాంలో ఎకరాకు 2 లక్షలు పరిహారం ఇస్తే, తమ ప్రభుత్వం ఎకరాకు దాదాపు 7 లక్షలు చెల్లిస్తున్నదని తెలిపారు. గౌరవెల్లి 1.4 టీఎంసీ వరద కాలువ ఉన్నప్పుడు 693 ఇండ్లు మునిగితే, ఇప్పుడు 8.3 టీఎంసీలకు పెంచితే అదనంగా మునుగుతున్న ఇండ్లు 150 మాత్రమేనని మంత్రి హరీశ్ రావు వెల్లడించారు. మిడ్ మానేరు ప్రాజెక్టు నిర్మాణం 98 శాతం పూర్తయిందని మంత్రి తెలిపారు. ఈ ప్రాజెక్టులో గత కాంగ్రెస్ ప్రభుత్వం ఏడేండ్లకు 52 వేల క్యూబిక్ మీటర్ల పని చేసిందన్నారు.మట్టి పనులు మినహా స్ట్రక్చర్స్, ఇతర సాంకేతిక పనులు చేయలేదన్నారు.శ్రీరాం సాగర్ వరదకాలువలో భాగమైన మిడ్ మానేరు ప్రాజెక్టుకు చెందిన 25 గేట్లు పూర్తయినట్టు హరీశ్ చెప్పారు.మిడ్ మానేరు లో 25 టి.ఎం.సీలను నింపే విధంగా నిర్మాణం పూర్తయి నట్టు తెలిపారు.ఈ నెలాఖరులోగా మిడ్ మానేరు రెడీ అవుతుందన్నారు. ఇప్పటికే 5 టి.ఎం.సి. ల నీటిని నిల్వ ఉంచగలిగామన్నారు.గతంలో కాంగ్రెస్, తెలుగుదేశం హయాంలో పాదయాత్రలు,ప్రసంగాలు, ఎన్నికల హామీలు మినహా వరదకాలువ పనులు 27 సంవత్సరాలుగా కాలేదని మంత్రి విమర్శించారు.
మంత్రి పర్యటనలో కరీంనగర్ ఎంపీ వినోద్ కుమార్, హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్,టి ఆర్ ఎస్ నాయకుడు పేర్యాల రవీందర్ రావు పాల్గొన్నారు.