తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలలో భాగంగా మైమరపించిన 1,001 మంది కళాకారుల భారీ జైత్రయాత్ర ప్రదర్శన
ఆదివారం తెలంగాణ భాషా సాంస్కృతికశాఖ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలలో భాగంగా వెయ్యినొక్కమంది 1001 కళాకారులు సాంస్కృతిక జైత్రయాత్ర నిర్వహించారు. 31 జిల్లాల నుంచి వచ్చిన 1,001 మంది కళాకారులు లుంబినీ పార్కు నుంచి పీపుల్స్ప్లాజా వరకు భారీ ప్రదర్శన నిర్వహించి తమ కళారూపాలతో కనువిందు చేశారు.
ఈ 1001 కళాకారుల సాంస్కృతిక జైత్రయాత్ర యాత్రను పర్యాటకశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం, భాషా సాంస్కృతికశాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, బీసీ కమిషన్ సభ్యులు జూలూరు గౌరీశంకర్, ఆంజనేయులుగౌడ్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా పర్యాటకశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం మాట్లాడుతూ తెలంగాణ నేలకు గొప్ప సాంస్కృతిక వారసత్వం ఉన్నదని, దాన్ని ప్రపంచానికి చాటే లక్ష్యంతో ఈ జైత్రయాత్రను నిర్వహిస్తున్నామన్నారు.
బాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ మాట్లాడుతూ కల సాకారం చేసుకున్న ప్రజలు తెలంగాణ వైభవాన్ని సగర్వంగా ప్రపంచానికి చాటుతున్నారన్నారు. ఈ కళారూపాల వారసత్వాన్ని ముందు తరాలకు అందించాల్సిన అవసరము ఉందన్నారు.
ఈ ప్రదర్శనలో పాల్గొన్న ఒగ్గుడోలు, డప్పు, కోలాటం, కొమ్ముకోయ, యక్షగానం, గుస్సాడి, భజన, లంబాడి కళాకారులు తమ ఆటపాటలతో అలరించారు. పోతురాజు నృత్యాలు, బతుకమ్మ, బోనాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.