సుప్రసిద్ధ ఒగ్గుకథ కళాకారుడు డా. చుక్కా సత్తయ్య మరణం పట్ల ప్రముఖుల ప్రగాఢ సంతాపం
తెలంగాణ కళారూపం ఒగ్గుకథ కీర్తిని ఎల్లలు దాటించిన అప్పూర్వ కళాకారుడు డా. చుక్కా సత్తయ్య ఆకస్మిక మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నామని ప్రభుత్వ సలహాదారులు డా. కె.వి.రమణాచారి, IAS (R), రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి, తెలుగు వర్సిటీ ఉపకులపతి ఎస్వీ సత్యనారాయణ, రాష్ట్ర గ్రంథాలయ పరిషత్తు చైర్మన్ అయాచితం శ్రీధర్, రాష్ట్ర అధికార భాషాసంఘం సభ్యుడు దేవులపల్లి ప్రభాకర్రావు, సీఎంవో ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్, సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ తదితరులు తెలిపారు.
తన ఒగ్గు కథతో తెలంగాణ ప్రజల హృదయాల మీద చెరగని ముద్రా వేసిన చుక్కా సత్తయ్య జాతీయ స్థాయిలో సంగీత నాటక అకాడమీ అవార్డు పొందిన ఏకైక జానపద కళాకారుడు. చుక్కా సత్తయ్య కంఠాన్ని, అద్భుతమైన వేశాన్ని, అభినయ కౌశల్యాన్ని తెలంగాణ ప్రజలు ఎన్నటికీ మర్చిపోరు. ఆయన స్మృతికి ఘనంగా నివాళులర్పిస్తున్నాం అని, ఆయన కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నామని తెలిపారు.
ఒగ్గు కథకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపును, గౌరవాన్ని తెచ్చిన సుప్రసిద్ధ ఒగ్గుకథ కళాకారుడు చుక్కా సత్తయ్య మరణం పట్ల తెలుగు విశ్వవిద్యాలయం ప్రగాఢ సంతాపాన్ని ప్రకటిస్తున్నది అని ఉపకులపతి ఆచార్య ఎస్.వి.సత్యనారాయణ తెలిపారు.
ఒగ్గుకథకు పర్యాయపదంగా నిలిచిన సత్తయ్యకు అనేక ప్రతిష్టాత్మక పురస్కారాలు లభించాయి. ఒక ప్రజా కళారూపానికి సముచిత స్థానాన్ని కల్పించిన సత్తయ్య మరణం ప్రజా సాంస్కృతిక రంగానికి తీరని లోటని భావిస్తూ, వారి కుటుంబ సభ్యులకు తెలుగు విశ్వవిద్యాలయం సానుభూతిని తెలియజేస్తున్నది.