భద్రాచలం అభివృద్ధి నమూనాలపై సీఎం కేసీఆర్ సమీక్ష
భద్రాచలం ఆలయానికున్న ప్రాశస్త్ర్యం, ప్రపంచ వ్యాప్తంగా శ్రీరామ చంద్రుడికున్న ఆదరణ దృష్ట్యా భద్రాద్రి ఆలయాన్ని దేశంలోనే ఓ అద్భుత పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. గోదావరి నది సరిగ్గా భద్రాచలం ఆలయం దగ్గరే మలుపు తిరిగి తూర్పుకు ప్రవహిస్తుందని, కొద్ది దూరం పోయిన తర్వాత ఉత్తర వాహినిగా మారుతుందని, రామచంద్రుడు కూడా పశ్చిమ దిక్కు నుంచి తూర్పు దిక్కుకు వచ్చి ఇదే ప్రాంతంలో నడయాడాడని సీఎం చెప్పారు. ఈ కారణాల వల్ల భద్రాద్రి ఆలయానికి ఎంతో స్థల మహత్యం, పౌరాణిక నేపథ్యం, ఆద్యాత్మిక ప్రాధాన్యం ఉందని సీఎం వెల్లడించారు. కాబట్టి భద్రాద్రి ఆలయాన్ని ఏమాత్రం ఖర్చుకు వెనుకాడకుండా అభివృద్ధి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రగతి భవన్లో బుధవారం యాదాద్రి దేవాయాల అభివృద్దిపై సమీక్ష నిర్వహించారు. మంత్రులు శ్రీ ఇంద్రకరణ్ రెడ్డి, శ్రీ తుమ్మల నాగేశ్వర్ రావు, శ్రీ నాయిని నర్సింహరెడ్డి, శ్రీ జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే శ్రీ శ్రీనివాస గౌడ్, సీఎంఓ ముఖ్య కార్యదర్శి శ్రీ నర్సింగ్ రావు, ప్రత్యేక కార్యదర్శి శ్రీ భూపాల్ రెడ్డి, భద్రాచలం ఆలయ ఇవో శ్రీ కె. ప్రభాకర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. చినజీయర్ స్వామి సూచనలకు అనుగుణంగా ఆలయ శిల్పి ఆనంద్ సాయి బృందం రూపొందించిన దేవాలయ అభివృద్ధి నమూనాలను ముఖ్యమంత్రి పరిశీలించారు. మరికొన్ని సూచనలు చేశారు. ప్రస్తుతమున్న దేవాలయానికి ఉత్తరం, పడమర దిక్కున ఉన్న స్థలాలను కూడా కలుపుకుని దాదాపు 30 ఎకరాల విస్తీర్ణంలో దేవాలయాన్ని అభివృద్ధి చేయాలని చెప్పారు. దేవాలయ ప్రాంగణంలోనే కళ్యాణ మండపం, షాపింగ్ కాంప్లెక్స్,భక్తుల సేదతీరే ప్రాంతాలను అభివృద్ది చేయాలని చెప్పారు. ప్రస్తుతమున్న దేవాలయంలోని గర్భగుడి, ఇతర ప్రధాన కట్టడాలకు ఎలాంటి ఆటంకం కలుగుకుండా ఇతర నిర్మాణాలు చేపట్టాలని సూచించారు.
‘‘శ్రీరామ చంద్రుడిని కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశమంతా పూజిస్తారు. ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో భక్తులున్నారు. రాముడు అందరి దేవుడు. రాముడు కొలువై ఉన్నభద్రాచలాన్ని పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, చత్తీస్ గఢ్, మహారాష్ట్ర, ఒరిస్సా రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారు. సీతారామ కళ్యాణం సందర్భంగా లక్షల సంఖ్యలో భక్తులు వస్తారు. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని లక్షలాది మంది తరలివచ్చినా ఏమాత్రం ఇబ్బంది కలుగకుండా భగవంతుడి దర్శనం, గోదావరిలో పుణ్యస్నానం ఆచరించడానికి అనువుగా ఏర్పాట్లుండాలి. భక్తులు ఇక్కడికి రావడానికి అనుగుణంగా రవాణా సౌకర్యాలను కూడా ప్రభుత్వం మెరుగుపరుస్తున్నది. కొత్తగూడెం-భద్రాచలం మధ్యన విమానాశ్రయం నిర్మిస్తున్నాం. కొత్తగూడెం వరకున్న రైలుమార్గాన్ని భద్రాచలం వరకు పొడిగించే ప్రతిపాదనలు ఇప్పటికే రైల్వేశాఖకు పంపాం. గోదావరి, ప్రాణహిత నదుల వెంట రహదారిని నిర్మించడం వల్ల మహారాష్ట్ర వరకు రోడ్డు సౌకర్యం కలుగుతుంది. ఇటు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి, అటు చత్తీస్ గఢ్, ఒరిస్సా రాష్ట్రాలను కలిపే రహదారులు నిర్మిస్తున్నాం. గోదావరి నదిపై ప్రస్తుతమున్న బ్రిడ్జితో పాటు మరో వంతెన నిర్మిస్తున్నాం. గోదావరి నదిలో కూడా ఎప్పుడూ నీరు నిల్వ ఉండే విధంగా ప్రాజెక్టులు కూడా వస్తున్నాయి. యాత్రికులు పడవ ప్రయాణం కూడ చేయవచ్చు. అన్ని విధాలా భద్రాద్రి ఆలయాభివృద్ధికి చర్యలు తీసకుంటాం’’ అని ముఖ్యమంత్రి చెప్పారు.
శుక్రవారం ప్రగతి భవన్లో అర్చకులతో సీఎం సమావేశం:
———————————————————-
ఈ నెల 15న మద్యాహ్నం ఒంటిగంటకు ప్రగతి భవన్లో అర్చకులతో సమావేశం కావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. అర్చకులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి తగు నిర్ణయం తీసుకోవాలని నిశ్చయించారు. అర్చకుల జీతాల పెంపుదల, జీతాలు చెల్లించే విధానం, దూప దీప నైవేధ్యం నిర్వహణ ఎలా ఉండాలి? తదితర అంశాలపై గురువారం సమావేశమై ముసాయిదా రూపొందించాలని అధికారులను ఆదేశించారు. అర్చకుల వేతనాలు, ఆలయాల నిర్వహణకు సంబంధించి ప్రగతి భవన్లో బుధవారం సమీక్ష జరిగింది. మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావు, నాయిని నర్సింహరెడ్డి, జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే శ్రీనివాస గౌడ్, ప్రభుత్వ సలహాదారు కె.వి. రమణాచారి, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఎస్. నర్సింగ్ రావు, దేవాదాయ శాఖ కార్యదర్శి శివశంకర్, జాయింట్ కమిషనర్ కృష్ణవేణి, ప్రత్యేక కార్యదర్శి భూపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అర్చకులకు వేతనాలు చెల్లించడంతో పాటు ఇతర ఆద్మాత్మిక కార్యక్రమాల నిర్వహణ కోసం ధార్మిక పరిషత్ ను ఏర్పాటు చేయాలని కూడా ముఖ్యమంత్రి నిర్ణయించారు.
ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంత దేవాలయాల విషయంలో చాలా నిర్లక్ష్యం, వివక్ష జరిగిందని సీఎం అన్నారు. దేవాలయాల నిర్వహణలో, అర్చకులకు జీతాలు చెల్లించే విషయంలో అన్యాయం జరిగిందన్నారు. పూర్వకాలంలో అప్పటి జాగిర్ధార్లు, మహారాజులు దేవాలయాలకు భూములు ఇచ్చారని, ఆ భూములపైనే ప్రభుత్వం ఆజమాయిషీ చేస్తున్నది తప్ప కొత్తగా భూములిచ్చింది లేదని సీఎం అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతే యాదాద్రి, వేముల వాడ దేవాయాలకు భూములు ఇచ్చామని, భద్రాద్రికి కూడా భూములు ఇస్తామని, దేవాలయాల అభివృద్ధికి బడ్జెట్లోనే నిధులు కేటాయించి ఖర్చు చేస్తున్నామని సీఎం వెల్లడించారు. దేవాలయ భూముల పరిరక్షణ, ఆలయాల పరిరక్షణ జరగాలని సీఎం అన్నారు.
యాదాద్రి, వేములవాడ, భద్రాచలం తరహాలోనే బాసరకు స్తపతులను పంపి, దేవాలయ అభివృద్ధికి సంబంధించి కార్యాచరణ రూపొందించనున్నట్లు సీఎం వెల్లడించారు.
Courtesy:FB/Telangana CMO