ప్రపంచ తెలుగు మహాసభలపై ముఖ్యమంత్రి సమీక్ష – సాహిత్య, భాష ప్రాధాన్యంగా మహాసభలు
ప్రపంచ తెలుగు మహాసభల పేరుకు అనుగుణంగా సాహిత్య, భాష ప్రాధాన్యంగా మహాసభలు జరగాలని అలాగే ప్రధాన వేదిక అయిన లాల్ బహదూర్ శాస్త్రి స్టేడియం ప్రాంగణంలో సభలు జరిగిన అయిదు రోజులు సాయంత్రం పూట సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా జరగాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు అన్నారు. ప్రపంచ తెలుగు మహాసభలు తెలంగాణ రాష్ట్ర గౌరవానికి సంబంధించిన అంశమని, నూటికి నూరు శాతం ఆహ్వానితులను తగు రీతిలో గౌరవంచాలని, సౌకర్యాలు కలిగించాలని ముఖ్యమంత్రి అన్నారు. ప్రధాన ఘట్టాలైన ప్రారంభ సమావేశం, ముగింపు సమావేశాల విషయంలో నిర్ణయాత్మకంగా, నిర్నీతంగా వుండాలని, ఇదొక బహుముఖమైన కార్యక్రమం కాబట్టి ఎక్కడా ఏ లోటు రాకుండా జాగ్రత్త పదాలని సీఎం అన్నారు. ప్రారంభ సమావేశానికి ముఖ్య అతిథిగా ఉప రాష్ట్రపతి శ్రీ ఎం. వెంకయ్య నాయుడు వస్తున్నారని, మహారాష్ట్ర గవర్నర్ శ్రీ సిహెచ్. విద్యాసాగర్ రావు, ఉభయ తెలుగు రాష్ట్రాల గౌవర్నర్ ఇ.ఎస్.ఎల్. నరసింహన్ విశిష్ట అతిథులుగా వస్తున్నారని, ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్రపతి శ్రీ రామ్ నాథ్ కోవింద్ వస్తున్నారని సీఎం చెప్పారు.
డిసెంబర్ 15 నుంచి 19 వరకు హైదరాబాద్ లో జరగనున్న ప్రపంచ తెలుగు మహాసభల సన్నాహక సమీక్ష సమావేశం సోమవారం మధ్యాహ్నం సుమారు 4 గంటల పాటు ప్రగతి భవన్ లో జరిగింది. సమావేశంలో ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావుతో పాటు, ఉప ముఖ్యమంత్రి శ్రీ కడియం శ్రీహరి, మంత్రులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు, శ్రీ టి. హరీష్ రావు, శ్రీ చందూలాల్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ ఎస్.పి. సింగ్, ప్రభుత్వ సలహాదారు శ్రీ అనురాగ్ శర్మ, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి శ్రీ వేణుగోపాల చారి, సాంస్కృతిక సారథి అధ్యక్షుడు శ్రీ రసమయి బాలకిషన్, ఎమ్మెల్సీ శ్రీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, మైనింగ్ కార్పోరేషన్ చైర్మెన్ శ్రీ శేరి సుభాష్ రెడ్డి, సాహిత్య అకాడమీ చైర్మన్ శ్రీ నందిని సిధారెడ్డి, ప్రభుత్వ సలహాదారు శ్రీ కెవి. రామాణాచారి, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ శ్రీ మామిడి హరికృష్ణ, అధికార భాషా సంఘం అధ్యక్షులు శ్రీ దేవులపల్లి ప్రభాకర్ రావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీ అయూచితం శ్రీధర్, తెలుగు విశ్వ విద్యాలయం ఉప కులపతి శ్రీ ఎస్.వి. సత్యనారాయణ. సీఎంఓ ఓ.ఎస్.డి. శ్రీ దేశపతి శ్రీనివాస్, టూరిజం కార్యదర్శి శ్రీ బుర్ర వెంకటేశం, ఆర్ అండ్ బి ముఖ్య కార్యదర్శి శ్రీ సునీల్ శర్మ, డీజీపీ శ్రీ మహేందర్ రెడ్డి, జిహెచ్ఎంసి కమిషనర్ శ్రీ జనార్ధన్ రెడ్డి, హెచ్ఎండిఎ కమిషనర్ శ్రీ చిరంజీవులు, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చెల్ కలెక్టర్లు తదితరులు హారయ్యారు.
సాహిత్య అకాడమీ చైర్మన్, ఇతర నిర్వాహకుల నుంచి సమావేశాల సన్నాహక కార్యక్రమాల గురించి ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. ఏ ఏ దేశాల నుంచి ఎంత మంది ప్రతినిధులు, పొరుగు రాష్ట్రాల నుంచి ఎంతమంది ప్రతినిధులు వస్తున్నారని అడిగారు. మొత్తం సుమారు ఎనిమిది వేల మంది హాజరవుతున్నట్లు వారు చెప్పారు. ప్రధాన వేదిక ఎల్.బి. స్టేడియంతో సహా మిగిలిన అన్ని వేదికల పర్యవేక్షణ బాధ్యత ఒక్కొక్కరు తీసుకోవాలని, అలానే భోజనాలు, బస, ఇతర లాజిస్టిక్స్, ఏ సమస్య లేకుండా చూసుకోవాలని సీఎం అన్నారు. వివిధ వేదికల వద్ద జరిగే కార్యక్రమాలకు హాజరయ్యే ప్రతినిధులకు అక్కడికి చేరుకోవటానికి, ఆ తరువాత సాయంత్రం పూట ప్రధాన వేదిక ఎల్.బి.స్టేడియం చేరుకోవటానికి తగువిధమైన సౌకర్యం కల్పించాలని సీఎం సూచించారు. ప్రతి ప్రతినిధితో మాట్లాడి వారి అభిలాష కనుక్కుని దానికి అనుగుణంగా ఎవరెవరు ఎక్కడికి వెళతారో ఆ విధంగానే రవాణా సౌకర్యం కల్పించాలన్నారు. సాయంత్రం ఎల్.బి.స్టేడియంలో జరిగే కార్యక్రమాల ప్రారంభ సమయానికి ఒక గంట ముందుగానే ఇతర వేదికల వద్ద కార్యక్రమాలు ముగింపు ఉండేలా చూడాలని సూచించారు. ఎల్.బి.స్టేడియం వద్ద ప్రతిరోజు తెలంగాణ మీద ప్రత్యేకంగా రూపొందించిన డాక్యుమెంటరీని ప్రదర్శించాలని, సాహిత్య కార్యక్రమాలు, కళాకారుల పరిచయాలు జరగాలని సీఎం అన్నారు.
విదేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ప్రతినిధులు ఎవరెవరు ఎన్ని రోజులు ఎక్కడెక్కడ వేదికల వద్ద జరిగే సభలకు హాజరవుతారో వివరాలు రూపొందించి దానికి అనుగుణంగానే సౌకర్యాలు కలిగించాలని సీఎం అన్నారు. విదేశీ ప్రతినిధులకు రవాణా కొరకు కార్లు ఏర్పాటు చేయాలని సీఎం అన్నారు. ప్రధాన వేదిక అయిన ఎల్.బి. స్టేడియం కు ప్రతిరోజు పెద్ద సంఖ్యలో ప్రతినిధులు, ఇతర సాహిత్యాభిలాషులు హాజరవుతారు కాబట్టి పార్కింగ్ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అలాగే, సభల ప్రారంభం నాటి నుంచే ఫుడ్ కోర్ట్స్ పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయాలని కోరారు. ఎల్.బి.స్టేడియంలో జరిగే సాంస్కృతిక కార్యక్రమాలు తెలంగాణ వైభవాన్ని ఘనంగా చాటి చెప్పాలని సీఎం చెప్పారు. అయిదు రోజుల్లో ఒకనాడు పూర్తిగా సాంస్కృతిక సారథి ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించాలని సూచించారు. వివిధ జిల్లాల నుంచి తెలుగు ఉపాధ్యాయులకు, లెక్చరర్లకు, ఆచార్యులకు, వివిధ రచయితల సంఘాల సభ్యులకు, తెలుగులో పాండిత్యం వున్న ఇతరులకు, సాహిత్యాభిలాషులకు మహాసభలకు హాజరయ్యేందుకు జిల్లా కలెక్టర్లు రవాణా, భోజన సౌకర్యం కలిగించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. హైదరాబాద్ చుట్టు ప్రక్కల వున్న ప్రైవేటు, ప్రభుత్వ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న సాహిత్యాభిలాష వున్న వారిని సభలకు హాజరయ్యేందుకు వారికి సౌకర్యం కలిగించాలన్నారు. అభిలాష వుండి మహాసభలకు హాజరుకాదలుచుకున్న వారందరికీ వచ్చే వెసులుబాటు కలిగించాలని ముఖ్యమంత్రి చెప్పారు.
‘‘ప్రపంచ తెలుగు మహాసభలకు అందరూ ఆహ్వానితులే’’ అన్న ప్రాతిపదికన సభలు నిర్వహించాలని, హాజరు కాదలుచుకున్న ప్రతి సాహిత్యాభిలాషి రావొచ్చన్న సందేశం పోవాలని సీఎం అన్నారు. ప్రారంభ, ముగింపు సమావేశాలు జరుగుతున్న ఎల్.బి. స్టేడియంలో విదేశీ, ఇతర రాష్ట్రేతర ప్రతినిధులకు ప్రత్యేక సీటింగ్ అరెంజ్ మెంట్ వుండాలని, అలానే నమోదు చేసుకున్న ఇతర ప్రతినిధులకు మరో ఎన్ క్లోజర్ వుండాలని, మహిళలకు ఒక ప్రత్యేకమైన ఎన్ క్లోజర్ వుండాలని, వివిధ సాహిత్య వేదికల్లో సాహిత్య కార్యక్రమాల్లో పాల్గొనే వారికి మరో ఎన్ క్లోజర్ వుండాలని, మంత్రులు, ప్రజాప్రతినిధులకు ఒక ఎన్ క్లోజర్ వుండాలని, ప్రెస్ గ్యాలరి ఏర్పాటు చేయాలని సీఎం అన్నారు.
13 భారతీయ గుర్తింపు పొందిన భాషల్లో జ్ఞాన్ పీఠ్ అవార్డు బహుమతి గ్రహీతలను వివిధ రాష్ట్రాల నుంచి ప్రత్యేకంగా ఆహ్వానించి తగు రీతిలో సత్కరించాలని ముఖ్యమంత్రి సూచించారు. ఇంత మంది ఇతర భాషల వారిని సన్మానం చేశామన్న కీర్తి తెలుగు మహాసభల సందర్భంగా మనకు దక్కాలని సీఎం అన్నారు.