శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానము, యాదగిరి గుట్ట
శ్రీ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవములు -2017
తేదీ 27.02.2017 నుండి 09.03.2017 వరకు
శ్లో: శ్రీమత్పయోనిధి నికేతన చక్రపాణే, భోగేంద్ర భోగ మణిరాజిత పుణ్యమూర్తే
యోగీశ శాశ్వత చరణ్య భవాబ్ది పోత, లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబమ్
నూతనంగా ఏర్పడిన యాదాద్రి జిల్లాలో మొట్టమొదటి బ్రహ్మోత్సవాల వేడుకలకు సంప్రదాయంగా శ్రీకారం చుట్టారు. ఈసారి ప్రధాన ఆలయంలో కాకుండా, ప్రత్యామ్నాయ సన్నిధి బాలాలయంలో చేపట్టారు.
స్వస్తి శ్రీ దుర్ముఖి నామ సంవత్సర, ఫాల్గుణ శుద్ధ పాడ్యమి సోమవారము తేదీ 27-02-2017 రోజున శ్రీ స్వామివారి వార్షిక నవాహ్నిక బ్రహ్మోత్సవములలో భాగంగా శ్రీ స్వామి వారి ఆలయములో ఉదయము గం. 8-45 లకు, విష్వక్సేనారాధన, స్వస్తి వాచనం, శుద్ధి పుణ్యాహవాచన కైంకర్యములు శ్రీ పాంచరాత్రాగమ శాస్త్ర రీత్యా ఆలయ యజ్ఞాచార్యులు, ప్రధాన అర్చకులు, అర్చక బృందము, పారాయణీకులు, ఎంతో వైభవముగా నిర్వహించిరి. ఈ వేడుకలో వంశ పారంపర్య ధర్మ కర్త శ్రీ బి. నరసింహమూర్తి గారు కార్యనిర్వహణాధికారిణి శ్రీమతి ఎన్.గీత గారు ఆలయ పేష్కార్, పర్యవేక్షకులు, ఉద్యోగ సిబ్బంది, భక్తులు పాల్గొని శ్రీ స్వామి వారిని సేవించి తరించిరి.
శ్రీ విష్వక్సేనారాధన:– భగవదారాధన విధానములో భగవానుని పరివార గణముతో కూడిన రీతిలో, ఆరాధించవలయునని ఆగమ శాస్త్రములు పేర్కొనుచున్నందున ఉత్సవ ప్రారంభ వేడుకగా ఈ విష్వక్సేనారాధన నిర్వహించెదరు. విష్వక్సేనుడు సర్వ సైన్యాధ్యక్షుడు. భగవానుని ఇచ్ఛానుసారము వేడుకను నిర్వహించుచున్నందు వలన, వీరిని ఆరాధించిన భగవత్ ప్రీతి కలుగును. కావున ఈ ఆరాధనను నిర్వహించెదరు. విష్వక్సేన ప్రసాదమును భక్తులందరికీ అక్షితా రూపములో అందజేసెదరు.
స్వస్తి వాచనము:– విశ్వశాంతర్థ్యం, లోక కళ్యాణార్థం నిర్వహించబడు ఈ బ్రహ్మోత్సవములు మంగళ ప్రదములుగా పూర్తియగుటకు వేద స్వస్తి మంత్ర పఠనములను గావించుచూ సమస్త లోకములకు జీవకోటికి శుభములు కలుగవలెనని అనేక విధములుగా స్థుతించెదరు.
శుద్ధి పుణ్యాహవాచనము:– ఉత్సవములలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన పవిత్రమైన వేడుక ఈ శుద్ధి పుణ్యాహవాచన వేడుక ఉత్సవ సంబంధమైన సంభారములను ద్రవ్యములను పవిత్రీకరిస్తూ ఆలయ పరిసర ప్రాంతములలో పుణ్యాహవాచన పవిత్ర జలములను ప్రోక్షణ గావించుచూ అర్చక స్వాములు, యాజ్ఞికులు మేళ తాళముల మధ్య ఈ వేడుకను నిర్వహించుట సాంప్రదాయమై యున్నది.
సాయంకాల కార్యక్రమములు:– శ్రీ స్వామి వారి ఆలయములో యధావిధి పూజల అనంతరము సాయంకాలము గం. 6.30 లకు మృత్సంగ్రహణము, అంకురారోపణ కార్యక్రమము, యజ్ఞాచార్యులు, ప్రధాన అర్చకులు, అర్చక బృందము, పారాయణీకులు అత్యంత వైభవముగా నిర్వహించెదరు.
ఆలయ ప్రాంగణంలో భక్తి శ్రద్దలతో, మంగళవాయిద్యాలతో మృత్సంగ్రహణం, అంకురార్పణం
మృత్సంగ్రహణము, అంకురారోపణ:– భూసూక్త పఠనములో పుట్టమన్నును (పుట్ట బంగారమును) తెచ్చి, పోలికలలో నింపి, నవ ధాన్యములతో, నవ ద్రవ్యములతో అభిమంత్రించి, మంత్రపుత పుణ్యాహవాచన జలములతో తడిపి ఉత్సవ పరిసమాప్తి లోగా అంకురించి, దేశ సుభిక్షమును కోరుచూ భగవంతుని ప్రార్థించే వేడుక. ఈ మృత్సంగ్రహణ వేడుక మృత్తికను అభిమంత్రించి తాకిన సర్వవిధ పాపములు తొలగి, దేహసృష్టి, తృష్ణను కలిగించునని మృత్సంగ్రహణ వేడుక విలక్షణమైన ఆనందప్రదము అని, అభీష్టప్రదము అని, వేదవాక్యము తెలియజేయుచున్నది. ఈ వేడుకలలో ఆలయ అధికారులు, అనువంశిక ధర్మకర్త శ్రీ బి. నరసింహమూర్తి గారు, కార్యనిర్వహణాధికారిణి శ్రీమతి ఎన్.గీత గారు, అర్చక బృందము, యాజ్ఞికులు, పారాయణీకులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తరించెదరు.
బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయ ఖజానాలో వివిధ విభాగాల ద్వారా ఆదాయం –
శ్రీ స్వామివారి ఆదాయం 6,85,709
ప్రదాన బుకింగ్ 12,604
అతిశీఘ్ర దర్శనం 26,300
వ్రతాలు 57,000
కళ్యాణ కట్ట 26,000
విచారణ శాఖ 46,450
ప్రసాద విక్రయం 2,93,030
శాశ్వత పూజలు 43,812
టొల్ గెట్ 1050 . VIP 150/- 46,500