తెలంగాణ ఆత్మగౌరవాన్ని పెంచిన కేసీఆర్
– కాళేశ్వరం ఓ ఇంజనీరింగ్ మహాద్భుతం
– ప్రాజెక్టులు అంటే పెండింగ్ అన్నదానికి కేసీఆర్ గారు తెరదించారు
– మూడేండ్లలో చెప్పిన పనిని చేసి చూయించారు
– అసమర్ధ, అవగాహనారాహిత్య రాజకీయ నాయకత్వం వల్ల తెలంగాణ 60 ఏళ్లు నష్టపోయింది
– ఎగిసి పడుతున్న కాళేశ్వరం నీళ్లను చూసి వారు తలదించుకోవాలి
– కుట్రలు, కేసుల మూలంగా వెనకబడ్డ పాలమూరు రంగారెడ్డి ఇక పరుగులు పెడుతుంది
– ఉమ్మడి పాలమూరు, రంగారెడ్డి, నల్లగొండ రైతులు నిశ్చింతగా ఉండండి
– కాళేశ్వరం రెండో పంపు ట్రయల్ రన్ విజయవంతం అయిన సంధర్భంగా రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
ఇచ్చిన మాట నిలబెట్టుకునే ఏకైక ప్రజా నాయకుడు అనే దానిని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరో సారి రుజువు చేసుకున్నారు. ప్రపంచంలోనే ఇంజనీరింగ్ మహాధ్బుతాలలో ఒకటిగా కాళేశ్వరం ఎత్తిపోతల పథకం చరిత్రలో నిలుస్తుంది. సాగునీటి రంగంలో ఇది అతి భారీ ఎత్తిపోతల పథకం. ప్రాజెక్టులు అనగానే 30, 40 ఏండ్లు పడుతుంది అన్న భావన నుండి మూడేండ్లలో పూర్తి చేయవచ్చు అని చెప్పి, పనిని పూర్తి చేసి, నీళ్లను కండ్లకు చూయించిన నేతగా కేసీఆర్ గారు చరిత్ర పుటల్లో నిలిచిపోతారని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు అన్నారు.
కాళేశ్వరం ఎత్తిపోతల పథకం రెండో పంపు ట్రయల్ రన్ విజయవంతం అయిన సంధర్భంగా ఆయన కార్యాలయం నుండి ఓ ప్రకటన విడుదల చేశారు. తాను స్వయంగా కలగని, వ్యూహం రచించి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధించినట్లే, సాధించిన రాష్ట్రంలో ఓ మహాద్భుతమయిన సాగునీటి కలను సాకారం చేసిన విధానం భావితరాలకు ఆదర్శప్రాయం అని ఆయన అన్నారు. ప్రజా నాయకుడు అంటే పనులతో ఫలితం ఇచ్చి చరిత్రలో నిలిచేవాడని నిరూపించిన ఘణాపాఠి కేసీఆర్ గారని, అసమర్ధపు, అవగాహనా రాహిత్యపు, కురచ, సంకుచిత రాజకీయ నాయకత్వం వల్ల 60 ఏళ్లలో తెలంగాణ నష్టపోయింది ఎంతో ఆవిష్కరించిన ఈ ఫలితాలను చూస్తే అర్ధం అవుతుంది. అదేవిధంగా లేకి విమర్శలు, దిగజారుడు వ్యాఖ్యానాలు, సాంప్రదాయ అభాండాలు వీటికి మాత్రమే పరిమితం అయిన పార్టీలు నేతలు ఈ రోజు కాళేశ్వరం నీటి ప్రవాహం చూసి తలదించుకోవాలని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ జాతి సమున్నతంగా తల ఎత్తుకునే విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మన ఆత్మగౌరవాన్ని పెంచారని, తన కల, వ్యూహం, పట్టుదల ద్వారా సాధించిన ఈ మహాధ్బుతం భారతదేశంలో తెలంగాణ సత్తాను చాటిందని నిరంజన్ రెడ్డి గారు అభిప్రాయపడ్డారు. అన్ని రంగాలలో, అన్ని సంధర్భాలలో దేశం చూపు తెలంగాణ వైపే నిలిపేలా కేసీఆర్ దార్శనికతతో వ్యవహరించారని అన్నారు. ఇన్నాళ్లూ కుట్రలు, కేసుల మూలంగా ఇబ్బందులు ఎదుర్కొన్నపాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఇక పరుగులు పెట్టిస్తారని, ఉమ్మడి పాలమూరు, రంగారెడ్డి, నల్లగొండ రైతులు నిశ్చితంగా ఉండాలని, కాళేశ్వరం పూర్తయిన నేపథ్యంలో తెలంగాణ రైతులోకం ఎంతో హర్షిస్తుందని పేర్కొన్నారు.