నిరంతర చైతన్య జ్యోతి సినారె: సంచాలకులు మామిడి హరికృష్ణ
జీవన తాత్వికతకు, హృదయ అనువాదానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచి నిరంతర చైతన్య జ్యోతిగా వెలుగొందిన మహాకవి డా. సి. నారాయణరెడ్డి అని తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ అన్నారు.
తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ, హాసం క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో రవీంద్ర భారతిలోని పైడి జైరాజ్ ప్రివ్యూ థియేటర్ లో సినారె 88వ జయంతి సందర్భంగా మంగళవారం “సవ్యసాచి డా. సి. నారాయణరెడ్డి” డాక్యుమెంటరీ ప్రదర్శన జరిగింది. ప్రముఖ రచయిత, వ్యాఖ్యాత ఎస్. వి. రామారావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి మామిడి హరికృష్ణ ముఖ్య అతిథిగా విచ్చేశారు.
ఆయన మాట్లాడుతూ… జీవిత అనుభవానికి సంబంధించిన అనేక అనుభవాల గురించి రచనలు చేసిన సినారె ప్రపంచ సాహిత్యరంగంలో తెలుగు భాషకు సుస్థిర స్థానాన్ని ఏర్పాటుచేశారన్నారు. పాలకుల హృదయాన్ని గెలుచుకున్న సినారె అంత్యక్రియలను ప్రభుత్వమే నిర్వహించిందని, భాషా సాంస్కృతిక శాఖ తరపున సినారె కు అక్షర నివాళిగా “స్వరనారాయణీయం” పుస్తకం కూడా ప్రచురించామన్నారు. ఇన్నాళ్ళుగా సాహిత్యపరంగా చూసిన సినారె ను, ఎస్.వి. రామారావు గారు ఈ డాక్యుమెంటరీతో విజువల్ గా చూపించారని అన్నారు.
తెలంగాణ సారస్వత పరిషత్ కార్యదర్శి జె. చెన్నయ్య మాట్లాడుతూ… సినారె 24ఏళ్ళ వయసులో నాగార్జున సాగరం, 26 ఎల్లప్పుడూ కర్పూర వసంతరాయలు రాసారని, 30 ఏళ్ళ వయసులో సినిమాల్లోకి ప్రవేశించారని అన్నారు.
ఈ కార్యక్రమంలో భాస్కర్ రెడ్డి, సురేందర్ రెడ్డి, సినారె కుటుంబ సభ్యులు, సినారె అభిమానులు పాల్గొన్నారు.
(Courtesy: FB-Mamidi Harikrishna)