ఆలోచింపచేసిన సందేశాత్మక నాటక ప్రదర్శన
తెలంగాణ సారస్వత పరిషత్ (20.02.19): తెలంగాణ ప్రభుత్వం రైతుల కంట కన్నీరు తుడిచే లా రైతుబంధు, రుణమాఫీ వంటి సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని, రైతులకు అండగా ఉంటూ ప్రోత్సహించడం శుభపరిణామం అని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కె.వి రమణాచారి అన్నారు.
రసరంజని ఆధ్వర్యంలో తెలంగాణ సారస్వత పరిషత్తులో భానుదయ సమర్పణలో బుధవారం జగమంత కుటుంబం నాటక ప్రదర్శన ఆద్యంతం ఆలోచింపజేసింది. ప్రముఖ రచయిత కందుల వెంకట సుబ్బారావు రచించి, దర్శకత్వం వహించిన ఈ నాటకం రైతుల స్థితిగతులను, గ్రామీణ ప్రజల ప్రేమాభిమానాలను కళ్లకు కట్టింది. దేశానికి అన్నం పెట్టే రైతన్న పకృతి వ్యవసాయం చేసి చిరంజీవిగా జీవించమని ఆయా పాత్రలో ఒదిగి నటించిన కళాకారులు ఈ నాటకం ద్వారా మంచి సందేశాన్ని ఇచ్చారు.
తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కె.వి రమణాచారి దంపతులు నాటకాన్ని వీక్షించి కళాకారులను అభినందించి ప్రోత్సాహంగా వారికి తన వొంతుగా నగదు బహుమతి అందచేశారు.