63వేల మంది పోలీసులకు ఒకేసారి సమాచారం, కాప్ కనెక్ట్ పేరుతో ప్రత్యేక యాప్ – ఈ యాప్తో ఉత్తమ ఫలితాలు డీజీపీ మహేందర్రెడ్డి
హైదరాబాద్ హైదరాబాద్: కాప్ కనెక్ట్ యాప్ను సోమవారం డీజీపీ మహేందర్రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా డీజీపీ మీడియాతో మాట్లాడారు.
తెలంగాణలో పోలీసు వ్యవస్థను బలోపేతం చేసేందుకు, నేర రహిత రాష్ట్రం కోసమే కాప్ కనెక్ట్ పేరుతో ప్రత్యేక యాప్ను రూపొందించినట్లు డీజీపీ మహేందర్రెడ్డి స్పష్టం చేశారు.
తెలంగాణలోని 63 వేల మంది పోలీసులకు సమాచారం త్వరితగతిన చేరవేసేందుకు కాప్ కనెక్ట్ ఎంతో దోహదం చేస్తుందన్నారు. ఇప్పటికే వాట్సాప్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా పోలీసు వాట్సాప్ గ్రూప్స్ ఏర్పాటు చేశామని తెలిపారు. వాట్సాప్ గ్రూప్లో 60 వేల మంది సభ్యులుగా ఉన్నారని చెప్పారు. వాట్సాప్ ఒక్కో గ్రూప్లో గరిష్టంగా 256మందికే సభ్యులుగా ఉండే అవకాశం ఉందన్నారు. కానీ కాప్ కనెక్ట్ ద్వారా63 వేల మంది ఒకే గ్రూప్ ఏర్పాటు చేయొచ్చు అని తెలిపారు.
ఈ యాప్ ద్వారా ఉన్నతాధికారుల నుంచి కానిస్టేబుళ్ల వరకు సమాచారం చేరవేసే అవకాశం ఉందన్నారు. పోలీసు శాఖలోని `17విభాగాల్లో కాప్ కనెక్ట్ ద్వారా అనుసంధానం కావొచ్చన్నారు. బయటివారికి ఇందులో అనుసంధానం అయ్యే అవకాశం లేదన్నారు. ఈ యాప్లో వీడియో కాన్ఫరెన్స్ సౌలభ్యం కూడా ఉందని డీజీపీ వెల్లడించారు. కాప్ కనెక్ట్లో 638 పోలీసు స్టేషన్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించొచ్చని ఆయన స్పష్టం చేశారు. ఏకకాలంలో అంతర్గత సమాచారం పంచుకోవడానికి అనేక అంశాలు పొందుపర్చాం. అభిప్రాయాలు పంచుకోవడం వల్ల ఉత్తమ ఫలితాలు వచ్చే అవకాశం ఉందని డీజీపీ మహేందర్రెడ్డి పేర్కొన్నారు.