శ్రీశైల దేవస్థానంలో ఏకాంతంగా శ్రీ సుబ్రహ్మణ్యస్వామివారికి (కుమారస్వామి వారికి) విశేష అభిషేకం
Vishesha Abhishekam Performed to Sri Kumara Swamy (Subrahmanyam Swamy) varu at Srisailam Temple
శ్రీశైల దేవస్థానం, శ్రీశైలం: లోక కల్యాణం కోసం దేవస్థానం కృత్తికా నక్షత్రాన్ని పురస్కరించుకొని ఈ రోజు (22.05.2020) ఉదయం ఆలయ ప్రాంగణంలోని శ్రీ సుబ్రహ్మణ్యస్వామి (కుమారస్వామి వారికి) విశేషపూజలను నిర్వహించడం జరిగింది.
ప్రతి మంగళవారం మరియు కృత్తికానక్షత్రం, షష్ఠి తిథి రోజులలో శ్రీ సుబ్రహ్మణ్యస్వామి వారికి ఈ విశేష అభిషేకం మరియు పూజాదికాలు దేవస్థానం సేవగా (సర్కారిసేవగా) నిర్వహించబడుతున్నాయి.
కుమారస్వామివారికి పూజలు జరపడం వలన లోకకల్యాణమే కాకుండా ప్రతి ఒక్కరికి ఉద్యోగ, వ్యాపార, వ్యవహారాలలో ఆటుపోట్లు తొలగి ఆయా పనులు సక్రమంగా జరుగుతాయి. సుబ్రహ్మణ్యస్వామి అనుగ్రహంతో ఎటువంటి శత్రుబాధలు, గ్రహపీడలు, దృష్టి దోషాలు మొదలైనవి తొలగిపోతాయి. అలాగే సంతానం కోసం పూజించేవారికి తప్పక సంతానభాగ్యం లభిస్తుందని చెప్పబడుతోంది.
ఈ అభిషేకానికి ముందుగా దేశం శాంతిసౌభాగ్యాలతో విలసిల్లాలని, ప్రకృతివైపరీత్యాలు సంభవించకుండా సకాలంలో తగినంత వర్షాలు కురిసి, పంటలు బాగా పండాలని, పాడి సమృద్ధిగా ఉండాలని,
జనులకు ఆయురారోగ్యాలు కలిగి వారికి అకాలమరణాలు రాకుండా ఉండాలని, దేశంలో అగ్ని ప్రమాదాలు, వాహన ప్రమాదాలు మొదలైనవి జరగకుండా ఉండాలని, అన్ని సామాజిక వర్గాల ప్రజలు సుఖశాంతులతో ఉండాలంటూ అర్చకస్వాములు సంకల్పాన్ని పఠించారు.
తరువాత కార్యక్రమం నిర్విఘ్నంగా జరిగేందుకు మహాగణపతిపూజ జరిపి, అనంతరం శ్రీసుబ్రహ్మణ్యస్వామివారికి అభిషేకము, సుబ్రహ్మణ్య అష్టోత్తరము చేసిన అనంతరం సుబ్రహ్మణ్యస్తోత్రము పారాయణలు చేశారు.
సుబ్రహ్మణ్యస్వామి అభిషేకంలో స్వామివారికి పంచామృతాలైన పాలు, పెరుగు,తేనే,నెయ్యి, కొబ్బరినీళ్లు మరియు వివిధ పండ్ల రసాలతో అభిషేక కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా వివిధ పళ్ల రసాలతో చేసే అభిషేకంలో ఎంతో ఫలితం ఉంటుందని ఆగమాలు చెబుతున్నాయి.
ప్రస్తుతం కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ఆలయములో దర్శనాలు పూర్తిగా నిలుపుదల చేయబడ్డాయి. అదేవిధంగా లాక్ డౌన్ కూడా అమలు చేయబడుతోంది. కాబట్టి అర్చకస్వాములు భౌతికదూరాన్ని పాటిస్తూ ఏకాంతంగా కుమారస్వామికి విశేషార్చనలు జరిపించారు.