2018 జూన్ కల్లా ఎస్.ఆర్.ఎస్.పి రెండో దశ పూర్తి
దేవాదుల ఆయకట్టు స్థిరీకరణ కు తుపాకులగూడెం ప్రాజెక్టు కీలకం
మంత్రి హరీశ్ రావు సమీక్ష
హైద్రాబాద్ ఆగష్టు 16(ఎక్స్ ప్రెస్ న్యూస్): శ్రీరాంసాగర్ రెండవ దశ, తుపాకులగూడెం ప్రాజెక్టు పనులను 2018 జూన్ వరకు పూర్తి చేయాలని ఇరిగేషన్ మంత్రి హరీశ్ రావు ఆదేశించారు. బుధవారం ఇక్కడ జలసౌధలో శ్రీ రాం సాగర్ ప్రాజెక్టు స్టేజ్ 2, తుపాకులగూడెం ప్రాజెక్టు పనుల పురోగతిని మంత్రి సమీక్షించారు.ఇకపై ప్రతివారం పనుల పురోగతిని సమీక్షించాలని మంత్రి ఇరిగేషన్ ఉన్నతాధికారులను ఆదేశించారు. తుపాకులగూడెం పూర్తయితేనె 10 నెలలపాటు దేవాదుల పంపులు నిరంతరాయంగా పనిచేస్తాయని అన్నారు.తుపాకులగూడెం వల్ల దేవాదుల ప్రాజెక్టులో 6 లక్షల ఎకరాల స్థిరీకరణ జరుగుతుందన్నారు.
ఎస్.ఆర్.ఎస్.పి.రెండో దశ నుంచి పూర్వ నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లోని కరవు పీడిత ప్రాంతాల్లో 4 లక్షల ఎకరాలకు సాగునీరందించే పనులు మరింత వేగవంతం చేయాలని హరీష్ కోరారు. ఎస్.ఆర్.ఎస్.పి. స్టేజ్ 2 కింద మొత్తం 1321 కోట్లతో పనులు జరుగుతున్నాయన్నారు. 2005 నుంచి 2014 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును పూర్తిగా నిర్లక్ష్యం చేసిందన్నారు. టి ఆర్ ఎస్ ప్రభుత్వం ఎస్.ఆర్.ఎస్.పి స్టేజ్ 2 పరిధిలో 2 లక్షల 25 వేల ఎకరాలు స్థిరీకరించిందని మరో 1 లక్షా 75 వేల ఎకరాలకు సాగునీరు అందించాలన్నారు. ఈ పథకం కింద 4 లక్షల ఎకరాలకు సాగునీరు అందించవలసి ఉందన్నారు. కాకతీయ ప్రధాన కాలువలో లైనింగ్ దెబ్బతినడం, పూడిక వంటి కారణాలతో వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో కరువు పీడిత ప్రాంతాల్లో భూములకు నీరందడం లేదని మంత్రి చెప్పారు.
ఆయా ప్రాంతాల్లో సాగునీటిని అందించేందుకు ఈ మరమ్మతు పనులను పూర్తి చేసి, ఫీల్డ్ చానల్స్ అన్నింటినీ ఉపయోగంలోకి తీసుకు రావాలన్నారు. ఈ పథకంతో పూర్వ నల్లగొండ జిల్లాలో తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2,13,175 ఎకరాలకు, ఖమ్మం జిల్లాలో పాలేరు, మధిర అసెంబ్లీ నియోజకవర్గాలలో 75, 262 ఎకరాలకు, వరంగల్ జిల్లాలో వర్ధన్నపేట , పాలకుర్తి, డోర్నకల్ నియోజకవర్గాలలో 1,09,512 ఎకరాలకు సాగునీరందుతుందని మంత్రి గుర్తు చేశారు. శ్రీ రాంసాగర్ ప్రాజెక్టు ఆయకట్టు చివరి భూములకు సాగునీరు అందించాలని సి.ఎం.కేసీఆర్ నడుం బిగించినట్టు హరీశ్ రావు తెలిపారు.స్థానిక ప్రజాప్రతినిధులు, ఎం.ఎల్.ఏ, ఎం.పిల సహకారం తీసుకొని బాటిల్ నెక్స్ సమస్యలు పరిష్కరించాలని ఆయన ఆదేశించారు. వచ్చే ఏడాది కాళేశ్వరంతో ఎస్.ఆర్.ఎస్.పి ని కనెక్ట్ చేస్తున్నందున ఈ లోగా శ్రీ రాం సాగర్ రెండో దశ పనులు పూర్తి కావాలని ఆదేశించారు . ఈ నేపధ్యంలో ఎల్ఎండి కి ఎగువ, దిగువ ప్రాంతాలలో కాలువల్లో నీటి ప్రవాహానికి ఎలాంటి అడ్డంకులు లేకుండా చూడాలని కోరారు. శ్రీరామ్ సాగర్ నీరు ఇప్పటిదాకా చూడని జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, డోర్నకల్ అసెంబ్లీ నియోజక వర్గాలకు సాగునీరందించడానికి ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని చెప్పారు.
ఈ సమీక్ష సమావేశంలో ఇరిగేషన్ ఇ. ఎన్. సి.మురళి దర్,ఈ.ఎన్.సి(ఆడ్మిన్)నాగేందర్ రావు వివిధ ఏజెన్సీల ప్రతినిధులు పాల్గొన్నారు.