కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ జయేంద్ర సరస్వతి శివైక్యం
సంతాపం ప్రకటించిన ప్రధాని మోదీ, సిఎం కెసిఆర్
కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ జయేంద్ర సరస్వతి శంకరాచార్య(82) శ్వాసకోశ సంబంధిత వ్యాధితో బాధపడుతూ ఈ ఉదయం 9 గంటలకు కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి పరమపదించారు.
జయేంద్ర సరస్వతి నిర్యాణంపై ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం ప్రకటించారు. ‘జయేంద్ర సరస్వతి గొప్ప ఆలోచనలు, ఉన్నతమైన సేవతో లక్షలాది భక్తుల హృదయాల్లో జీవించారు. అసంఖ్యాక సమాజ సేవా కార్యక్రమాల్లో ఆయన ముందుండేవారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను.’ అని ట్విటర్ ద్వారా మోదీ తన సంతాప సందేశాన్ని పోస్ట్ చేశారు.
కాగా కంచి కామకోఠి పీఠాధిపతి శ్రీ జయేంద్ర సరస్వతి మృతి పట్ల ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు సంతాపాన్ని వ్యక్తం చేశారు. కంచి పీఠాభివృద్ధికి ఆయన చేసిన సేవలను సీఎం కొనియాడారు.
1935 జులై 18న తమిళనాడు తంజావూరు జిల్లా ఇరుల్నీకిలో జన్మించారు జయేంద్ర సరస్వతి. కంచి కామకోటి పీఠానికి 69వ పీఠాధిపతిగా జయేంద్ర సేవలందించారు. 18వ ఏటనే సన్యాసం స్వీకరించిన జయేంద్ర.. 1954 మార్చి24 నుంచి కంచి పీఠాధిపతిగా కొనసాగుతున్నారు. చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి అడుగుజాడల్లో నడిచేందుకు ఆయన సన్యాసం తీసుకున్నారు.