మహాసభలను అత్యంత వైభవోపేతంగా విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు – ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు
ఈ గడ్డ మీద చదవాలంటే తెలుగు తప్పనిసరి
జనవరి మొదటివారంలో తెలుగు భాషాభివృద్ధికి ప్రకటనలు
https://www.facebook.com/TelanganaCMO/videos/717799551758233/
హైదరాబాద్ డిసెంబర్ 19: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచ తెలుగు మహాసభలను అత్యంత వైభవోపేతంగా నిర్వహించిందని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో గౌరవంగా తెలుగు మహాసభలు నిర్వహించుకొని ప్రపంచానికి చాటిచెప్పామని తెలిపారు. ఇక నుంచి ప్రతీ ఏడాది డిసెంబర్ మొదటి వారంలో రెండు రోజుల పాటు వైభవంగా తెలంగాణ తెలుగు మహాసభలు నిర్వహించబడుతాయని సీఎం ప్రకటించారు.
తెలుగు మహాసభల ముగింపు వేడులకు హాజరైన రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు రాష్ట్ర ప్రజల తరపున సీఎం ధన్యవాదాలు తెలిపారు.
తెలుగు మహాసభల ముగింపు వేడుకల్లో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. తెలుగు మహాసభలను సుసంపన్నం చేసినందుకు ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. సభలు విజయవంతమైనందుకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. 1974లో డిగ్రీ విద్యార్థిగా ఇదే స్టేడియంలో ప్రపంచ తెలుగు మహాసభలకు హాజరై తిలకించాను అని సీఎం గుర్తు చేశారు. తెలుగు మహాసభలు గొప్పగా నిర్వహించుకున్నందుకు ఎంతో సంతోషంగా ఉందన్నారు.
తెలుగు నేల మీదనే.. మన గడ్డ మీదనే.. మన మాతృభాషను మృతభాష అనో.. బతికించుకోవాలనో అనాల్సి రావడం బాధాకరం. ఆ పరిస్థితి మన భాషకు సంభవించకుండా ఉండటానికి తెలంగాణ ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తుంది స్పష్టం చేశారు. ప్రతీ ఏటా రెండు రోజుల పాటు డిసెంబర్ నెలలో తెలంగాణ తెలుగు మహాసభలు నిర్వహించబడుతాయని పేర్కొన్నారు. ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు తెలుగు భాషను తప్పనిసరి చేయాలన్న నిబంధనను అమలు చేస్తామని ఉద్ఘాటించారు. ఈ గడ్డ మీద చదువుకోవాలంటే తెలుగు తప్పనిసరిగా నేర్చుకోవాల్సిందేనని సీఎం స్పష్టం చేశారు. భాషా పండితుల సమస్యలను పరిష్కారిస్తామని చెప్పారు. పదవీ విరమణ పొందిన భాషా పండితుల భృతి కోతను ఎత్తేస్తామని ప్రకటించారు. భాషా పండిత మిత్రులకు ఇచ్చిన హామీని తప్పకుండా నెరవేరుస్తామని ఉద్ఘాటించారు. తెలుగు భాష అభివృద్ధి కొరకు, ఒక అద్భుతమైన జీవ భాషగా తీర్చిదిద్దడానికి కావాల్సిన ప్రకటనలు చేయాలని భావించాను. కానీ ఇప్పుడు ప్రకటన చేయలేకపోతున్నామని సీఎం తెలిపారు. ఈ మహాసభల సందర్భంగా తెలుగు భాషాభివృద్ధి విషయంలో వందల, వేల సూచలను వచ్చాయన్నారు. జనవరి మొదటి వారంలో భాషా సాహితీ సదస్సు నిర్వహించి భాషాభివృద్ధి ప్రణాళికను ప్రకటిస్తామని చెప్పారు.
తెలుగు మహాసభలను సంతోషంగా నిర్వహించుకొని గొప్పగా ముందుకు వెళ్లామని తెలిపారు. తెలంగాణ కొత్తగా ఏర్పడిన రాష్ట్రం కాబట్టి.. ప్రతీ ఒక్కరూ సభలను విజయవంతం చేసేందుకు కృషి చేశారని పేర్కొన్నారు. నేను చెప్పిన పద్యాలకు పలువురు నన్ను అభినందించారు. ఒక నవ్వుల పద్యంతో నా ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను అని ఆ పద్యం చదివి వినిపించి సీఎం తన ప్రసంగాన్ని ముగించారు.
ఇదీ ఆ పద్యం..
నవ్వవు జంతువుల్.. నరుడు నవ్వున్..
నవ్వులు చిత్తవృత్తికిన్ దివ్వెలు..
కొన్ని నవ్వులెటు తేలవు..
కొన్ని విష ప్రయుక్తముల్..
పువ్వులవోలె ప్రేమ రసముల్ విరజిమ్ము..
విశుద్ధమైన లే నవ్వులు..
సర్వదుఃఖ ధమనంచాలు..
వ్యాధులకున్ మహౌషధుల్..
కాగా కార్యక్రమానికి ముందు తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిద్ధారెడ్డి మాట్లాడుతూ ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించుకోవడం తెలుగు ప్రజలకు గొప్ప పండుగ అని పేర్కొన్నారు. తెలుగు మహాసభల ముగింపు వేడుకల్లో సిద్ధారెడ్డి స్వాగతోపన్యాసం చేశారు. తెలుగు మహాసభలు రాబోయే తరాలకు మార్గదర్శకంగా నిలిచాయన్నారు. ఈ ఐదు రోజుల పాటు నిర్విరామంగా ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు, పుస్తకావిష్కరణలు, అవధానాలు జరిగాయి. ఈ మహాసభలకు 42 దేశాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారని తెలిపారు. ప్రపంచ తెలుగు మహాసభలు వర్ధిల్లాలని సిద్ధారెడ్డి చెప్పారు. తెలుగు మహాసభల్లో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించాయని ఆయన తెలిపారు.