ప్రతి విద్యార్థినీ విఐపిగా చూడాలి –
- పదవ తరగతి పరీక్ష ఫలితాలపై సమీక్ష
- టి-సాట్ స్టూడియోలో విద్యా శాఖ ప్రత్యేక కార్యక్రమం
- ప్రధానోపాద్యాయులు, జిల్లా విద్యాధికారులకు విద్యాశాఖ కార్యదర్శి డా.బి.జనార్ధన్ రెడ్డి మార్గదర్శనం
- కేరీర్ గైడెన్స్ పై విద్యార్థులకు, తల్లిదండ్రులకు అవగాహాన కార్యక్రమాలు
* విద్యార్థులకు శనివారం లోపు కౌన్సెలింగ్ పూర్తిచేయాలని డీఈవోలకు ఆదేశం.
పదవ తరగతి ఫలితాలు వెలువడిన తర్వాత పాఠశాల విద్యాశాఖ ఫలితాలపై టి-సాట్ విద్య ఛానల్ ద్వారా మంగళవారం సమీక్ష నిర్వహించింది. పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి డా.బి.జనార్ధన్ రెడ్డి కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకు, తల్లిదండ్రులకు, పాఠశాల ప్రధానోపాద్యాయులకు అనేక సూచనలు చేశారు.పదిలో అత్యున్నత ప్రతిభ కనబర్చిన విద్యార్థులను సన్మానించడంతో పాటు, ఇతర విద్యార్థులను కూడా తగిన రీతిలో అభినందించాలని అన్నారు, వారి కేరీర్ గైడెన్స్ కి తగిన సలహాలు అందించాలని ప్రదానోపాధ్యాయులకి సూచించారు. వారికి ఇష్టమైన సబ్జెక్టుల ఆధారంగా భవిష్యత్తులో ఉన్న అవకాశాల్ని వివరించాలని తెలియజేశారు. ఉత్తీర్ణత సాధించిన విద్యార్థుల హాజరు శాతం ఎక్కువగా ఉన్న విషయాన్ని తల్లిదండ్రులకు, విద్యార్థులకు అర్థమయ్యేలా వివరించి మంచి ఫలితాలకోసం ఉత్తీర్ణత పెంచే చర్యలు తీసుకోవాల్సిందిగా సూచించారు. ఇంటర్మీడియట్ తో పాటు పాలిటెక్నిక్, ఐటిఐ, వొకేషనల్ కోర్సులు, ఇంజనీరింగేతర కోర్సులు, హెల్త్, పారామెడికల్ కోర్సులు, కంప్యూటర్ కోర్సులు వంటి వాటిని విద్యార్థుల అభిరుచిని బట్టి, ఆర్థిక స్థోమతలను బట్టి నిర్ణయించుకునేలా వారికి తగు సూచనలు చేయాలన్నారు. ఈ కౌన్సెలింగ్ కార్యక్రమాలను పాఠశాలల్లో శనివారం లోపు ముగించాలని ప్రధానోపాధ్యాయులకు, డీఈవోలకు సూచించారు. అలాగే ఫెయిలైన విద్యార్థుల్లోనూ ఉత్సాహాన్ని నింపి విద్యా సంవత్సరం నష్టపోకుండా అడ్వాన్స్ సప్లిమెంటరీకి వారిని సన్నద్దం చేయాలన్నారు. ఆయా సబ్జెక్టులకు అద్యాపకులచే ప్రత్యేక పాఠాలు బోధించే ఏర్పాట్లు చేయాలని పాఠాశాల నిర్వాహకులకు సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా లైవ్ ప్రసారంలో పాల్గొన్న ప్రదానోపాద్యాయులు, ఉపాధ్యాయులు అడిగిన సందేహాలని విద్యాశాఖ కార్యదర్శి నివ్రుత్తి చేశారు.ఈ కార్యక్రమంలో డా.బి.జనార్ధన్ రెడ్డి తో పాటు స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ టి.విజయ్ కుమార్, పరీక్షల డైరెక్టర్ బి. సుధాకర్, మోడల్ స్కూల్స్ డైరెక్టర్ ఎ.సత్యనారాయణ రెడ్డి మరియు ఎస్. సి. ఈ.ఆర్. టి డైరెక్టర్ బి. శేషుకుమారి పాల్గొన్నారు.