వ్యవసాయ మరియు సహకార శాఖ ముఖ్య కార్యదర్శి సి. పార్థసారథి ఐఏఎస్ రాబోయే ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ కు సంబంధించి ప్రభుత్వ కొనుగోళ్ల సన్నద్ధతపై సమీక్ష నిర్వహించారు. తేదీ: 10.05.2019న మద్యాహ్నం 4.00 గంటలకు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మార్కెటింగ్ శాఖ సంచాలకులు శ్రీమతి జి.లక్ష్మీబాయి, మార్క్ఫెడ్, హాకా ఎం.డీ. భాస్కరచారి మరియు మార్క్ఫెడ్, నాఫెడ్, హాకా, గిడ్డంగుల సంస్థ, ఎన్.ఐ.సి., సి.సి.ఐ., వ్యవసాయ విశ్వవిద్యాలయం మరియు మార్కెటింగ్ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఈ సమావేశంలో వ్యవసాయోత్పత్తులను కనీస మద్ధతు ధరలకు కొనుగోళ్ళు మరియు ముందస్తుగా ధరలను రైతులకు తెలియజేయుటకు చేసిన ఏర్పాట్లపై సమీక్ష జరిపి, ఈ క్రింది విధంగా ఆదేశాలు జారీ చేయడమైనది:-
నేషన్ ఇన్ఫర్మెటిక్ సెంటర్(ఎన్.ఐ.సి.) వారు ఇప్పటికే సంబంధిత శాఖలలో ప్రభుత్వ మద్ధతు ధర కొనుగోళ్లకు సంబంధించి రూపొందించిన సాఫ్ట్వేర్ను పరిశీలించి అనగా, పౌరసరఫరాల సంస్థ వారి ధాన్యం కొనుగోళ్ళు, మార్కెటింగ్ శాఖకు సంబంధించి ప్రత్తి కొనుగోళ్ళు మరియు భారత ప్రభుత్వ సంస్థ నాఫెడ్కు సంబంధించిన ఇతర పంటల కొనుగోళ్లక సాఫ్ట్వేర్ను పరిశీలించి తెలంగాణ రాష్ట్రంలో అన్ని వ్యవసాయోత్పత్తుల మద్ధతు ధరలకు సంబంధించి ఒక సమీకృత సాఫ్ట్వేర్ను ఆయా శాఖలతో చర్చించి రూపొందించాల్సిందిగా ఆదేశించడమైనది.
రైతులకు సంబంధించి ఆయా కొనుగోళ్ల సమయంలో వారు పండించిన పంటలు, ఉత్పత్తి వివరాలన్నింటినీ ఆయా సాఫ్ట్వేర్లో అనుసంధానం చేసి కొనుగోలు సంస్థలకు అందుబాటులో ఉంచుటకు నిర్ణయించడమైనది.
ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇప్పటికే వ్యవసాయ శాఖ సేకరిస్తున్న సమాచారాన్ని త్వరలోనే సంబంధిత జిల్లా శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి ఆ సమాచారాన్ని వారికి అందజేసి, రాబోయే సీజన్కు పంటలవారీగా అవసరమైన కొనుగోలు కేంద్రాలు ఇతరత్రా ఏర్పాట్లపై పకడ్బందీగా ప్రణాళికలు రూపొందించడానికి నిర్ణయించడమైనది.
రైతులు పంట వేయకముందే ఏ విధమైన ధర లభించే అవకాశముందో తెలిపే వ్యవస్థను ఇప్పటికే వ్యవసాయ విశ్వవిద్యాలయం, వ్యవసాయ మార్కెటింగ్ శాఖ వారి సహకారంతో నిర్వహిస్తున్నది. ఈ సమాచారాన్ని ఎప్పటికప్పుడు గ్రామ పంచాయతీ వరకు తీసుకువెళ్ళే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించడమైనది.
పంటల కొనుగోళ్లకు సంబంధించి వ్యవసాయ మరియు మార్కెటింగ్ శాఖలు సంబంధింత సంస్థలతో పూర్తి సమన్వయంతో పని చేయుటకు తగిన ఏర్పాట్లు చేయాల్సిందిగా ఆదేశించడమైనది.