ఆర్ధిక వ్యవస్థ పరిపుష్టికి మత్స్య ఉత్పత్తి దోహదం – మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
చేపల ఉత్పత్తి, మార్కెటింగ్ లో ఇండియాలోనే తెలంగాణాను ఉన్నత స్థానానికి తీసుకునివెళ్తామని, రాష్ట్ర పశు సంవర్థక, మత్స్య శాఖామాత్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆయన గురువారం హైటెక్స్ లో ఆక్వా ఎక్స్ పో -2018 లో ముఖ్య అతిథిగా హాజరైనారు. అంతకుముందు ఆక్వా ఎక్స్ పో -2018 లో స్టాల్స్ ను మంత్రిగారు ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గ్రామీణ ఆర్ధిక వ్యవస్థ పరిపుష్టికి మత్స్య ఉత్పత్తి దోహదం చేస్తుందని అన్నారు. ఈ సంవత్సరం తెలంగాణలో 80 కోట్ల చేప విత్తనాలను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఉత్పత్తి అయిన చేపలను విక్రయించడానికి మండల, జిల్లా స్థాయిలో చేపల మార్కెట్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. చేపల ఉత్పత్తిలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో వివిధ జిల్లాలనుండి వచ్చిన మత్స్యకారులు ఈ ఎక్స్ పో లోని స్టాల్స్ ను సందర్శించి, నూతన సాంకేతిక పద్దతులలో అవగాహన పెంపొందించుకోవాలని అన్నారు.
తెలంగాణలో మిషన్ కాకతీయ, మిషన్ భగీరధ ద్వారా చెరువుల పూడిక తీత చేయడం, నూతన రిజర్వాయర్ల నిర్మాణం ద్వారా మత్స్య పరిశ్రమ అభివృద్దికి మెరుగైన ఉన్నాయని అన్నారు. ఈ నెల 15 నుండి 17 వరకు మూడు రోజులు జరిగే ఈ ఎక్స్ పో లో 12 దేశాల నుండి ప్రతినిధులు పాల్గొంటున్నారని అన్నారు. చేపలు తినడం ఆరోగ్యకరమని ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు.
యన్.సి.డి.సి., న్యూఢిల్లీ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ సందీప్ కుమార్ నాయక్ మాట్లాడుతూ, చేపల ఉత్పత్తి లో ఆధునిక పద్దతులను అవలంభించడం ద్వారా ఉత్పత్తిని పెంపొందించుకోవాలని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపల ఉత్పత్తి పెంపుకు విశేషంగా కృషి చేస్తుందని అన్నారు. తమ పూర్తి సహకారం అందిస్తామని అన్నారు.
పశు సంవర్ధక, మత్స్య శాఖ సెక్రటరీ శ్రీ సందీప్ కుమార్ సుల్తానియా మాట్లాడుతూ, దక్షిణ ఆసియాలో మొదటిసారిగా Society for Indian Fisheries and Aquaculture (SIFA) సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. చైనా కంటే భారత దేశం అక్వాలో పది రెట్లు వెనక బడి ఉందని అన్నారు. చైనా 66 మిలియన్ టన్నులు ఉత్పత్తి చేస్తుండగా, భారత దేశం 6.5 మిలియన్ టన్నులు మాత్రమే చేపల ఉత్పత్తి చేస్తున్నదని అన్నారు. కావున ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించడం ద్వారా ఉత్పత్తి పెంచే లక్ష్యంతో ఈ ఎక్స్ పో ను ఏర్పాటు చేశామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఇటలీ ఆక్వా నిపుణుడు రోహన్ శుభ సింగ్, తెలంగాణ ప్రభుత్వ సాంకేతిక అడ్వైజర్ శ్రీ ఎన్.వి. గుప్తా, Society for Indian Fisheries and Aquaculture (SIFA) అధ్యక్షులు శ్రీ వి. రామచంద్ర రాజు, మత్స్య శాఖ కమిషనర్ డా. సి. సువర్ణ, ఇతర జిల్లాల నుండి వచ్చిన మత్స్య సహకార సంఘ సభ్యులు హాజరైనారు.