సీతారామ ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలి – మంత్రి హరీశ్ రావు ఆదేశం
హైదరాబాద్ ఆగష్టు 29(ఎక్స్ ప్రెస్ న్యూస్): భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సీతారామ ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని మంత్రి హరీశ్ రావు ఆదేశించారు. ఈ ప్రాజెక్టు కు చెందిన భూసేకరణ, అటవీ, పర్యావరణ అనుమతులు, పంప్ హౌజ్ లు,కెనాల్స్…..ఇతర పనుల పురోగతిని మంత్రి మంగళవారం సమీక్షించారు. ఆర్ అండ్ బి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తో కలిసి హరీశ్ రావు సమీక్ష సమావేశం నిర్వహించారు. 6 లక్షల ఎకరాలకు సాగునీరందించే లక్ష్యం తో తలపెట్టిన సీతారామ ప్రాజెక్టు పనుల పురోగతి అనుకున్నంత వేగంగా లేకపోవడం,పనులు మందకొడిగా సాగుతుండటం పట్ల మంత్రులు తీవ్ర అసంతృప్తి ని వ్యక్తం చేశారు.15 రోజుల్లో మరో సారి సీతారామ ప్రాజెక్టు పై సమీక్ష జరపనున్నట్టు హరీశ్ రావు , తుమ్మల ప్రకటించారు. ప్యాకేజీ ల వారీగా సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం పనులను రివ్యూ చేశారు. మొత్తం 8 ప్యాకేజీ లలో ప్రస్తుతం 3 ప్యాకేజీల పనులను ప్రారంభించారు. మిగత 5 ప్యాకేజీల పనులను కూడా వెంటనే అగ్రిమెంట్ చేసుకొని ప్రారంభించాలని మంత్రి హరీశ్ రావు ఆదేశించారు.మొత్తం 5 పంప్ హౌజ్ లలో ఒక పంప్ హౌజ్ పనులే గ్రౌండ్ అయ్యాయి. మరొక పంప్ హౌజ్ పనులు ప్రారంభం కానున్నాయి. అయితే మిగతా 3 పంప్ హౌజ్ ల పనులనీ కూడా వెంటనే చేపట్టాలని, వాటి పురోగతిని త్వరలో జరిగే సమావేశంలో సమీక్షిస్తామని మంత్రి హరీశ్ రావు తెలిపారు. మూడు పంప్ హౌజ్ పనులను ఎప్పటిలోగా పూర్తి చేయనున్నారో తేదీల వారీగా కార్యాచరణ ప్రణాళిక ను రూపొందించి తనకు 15 రోజుల్లో తెలియజేయాలని హరీశ్ రావు ఆదేశించారు.
అటవీ భూముల సేకరణ కోసం డి.జీ. పి.ఎస్.సర్వే ను 10 రోజుల్లో పూర్తి చేయాలని హరీశ్ రావు ఆదేశించారు. భూసేకరణ నష్టపరిహారాన్ని వెంటనే చెల్లించాలని ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ జోషీ ని మంత్రి హరీశ్ రావు కోరారు.5 ప్యాకేజీ లలో యుద్ధ ప్రాతిపదికన పనులు చేయాలని కోరారు. ఈ ప్రాజెక్టు కు చెందిన అటవీ, పర్యావరణ అనుమతులను సాధించాలన్నారు.ఇందుకు గాను అటవీ, రెవెన్యూ శాఖ లతో సమన్వయం చేసుకొని ఈ ప్రక్రియ ను తక్షణమే పూర్తి చేయాలని ఇరిగేషన్ శాఖ తరపున అటవీ,పర్యావరణ అనుమతుల సలహాదారు సుధాకర్ ను మంత్రి హరీశ్ రావు ఆదేశించారు. అలాగే కి.మీ.13 నుంచి కి.మీ 30 వరకు కెనాల్స్ తవ్వకాల కోసం వన్య ప్రాణి పరిరక్షణ బోర్డు ద్వారా అనుమతి తీసుకునే ప్రక్రియ ను వేగవంతం చేయాలని హరీశ్ రావు కోరారు.ప్రాజెక్టు కోసం అటవీ భూములను సేకరించినపుడు ప్రత్యామ్నాయ భూముల ను కూడా వెంటనే సేకరించి అటవీ శాఖ కు స్వాధీన పరచాలని మంత్రులు తుమ్మల, హరీష్ రావు ఆదేశించారు.
సమావేశంలో ఖమ్మం ఎం.పి.పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొత్త గూడెం జిల్లా కలెక్టర్ రాజీవ్ హనుమంతు, జాయింట్ కలెక్టర్ రామకిషన్, ఆర్.డి.ఓ., ఇరిగేషన్ ఈ. ఎన్. సి.మురళి దర్, ఈ.ఎన్. సి. నాగేందర్ రావు, ఖమ్మం సి.ఈ.సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.