వరంగల్ రూరల్ జిల్లా గీసుకొండ మండలం శాయంపేటలో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ ఏర్పాటుకు సీఎం కేసీఆర్ ఇవాళ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగించారు.
భారతదేశంలోనే అతిపెద్ద టెక్స్టైల్ పార్క్కు శంకుస్థాపన చేయించుకున్నందుకు మీ అందరిని అభినందిస్తున్నానని సీఎం చెప్పారు. తెలంగాణ ఉద్యమం జరిగే రోజుల్లో మన వరంగల్ చుట్టుపక్కల ఉండే వర్ధన్నపేట, పరకాలతో పాటు ఇతర నియోజకవర్గాల ప్రజలు సోలాపూర్, భీవండి, సూరత్తో పాటు పలు ప్రాంతాలకు వెళ్లారని గుర్తు చేశారు. అక్కడికి వలస వెళ్లిన వారు కూడా టీఆర్ఎస్కు మద్దతిస్తూ.. ఉద్యమం చేశారు. ఉద్యమ సమయంలో వారిని పిలిచి మాట్లాడటం జరిగింది. అజంజాహీ మిల్లు మూతబడింది కాబట్టి అక్కడికి వలస వెళ్లినమని చెప్పారు. అజంజాహీ మిల్లును తలదన్నేలా వరంగల్ జిల్లాలో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ రాబోతుందని ఆనాడే చెప్పాను. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు.
కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ ఏర్పాటుతో లక్ష మందికి పైగా ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. ఈ ఒక్క రోజే 22 సంస్థలు ఒప్పందం చేసుకున్నాయి. పారిశ్రామికవేత్తలు రాష్ట్రప్రభుత్వంతో ఒప్పందం చేసుకోవడం సంతోషాన్నిస్తుందన్నారు. ఈ ఒప్పందాల వల్ల 3,900 కోట్ల రూపాయాల పెట్టబుడులు రానున్నాయని తెలిపారు సీఎం. ఈ రోజు జరిగిన ఒప్పందాలతో 27 వేల మందికి ప్రత్యక్ష ఉపాధి, 50 వేల మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుందన్నారు. ఇతర రాష్ర్టాల్లో ఉన్న మన నేతన్నలు.. తిరిగి రాష్ర్టానికి రావాలని కోరుతున్నానని పేర్కొన్నారు. భూములు కోల్పోయిన ప్రతీ ఒక్కరికి ఉద్యోగం వచ్చే అవకాశం ఉందన్నారు. నిర్వాసితులకు ఎలాంటి నష్టం జరగకుండా చూస్తామన్నారు.