– వందేళ్లపాటు రాష్ట్ర ప్రజల సేవలో నిమగ్నమయ్యేలా మార్పులు చేస్తా
– మీలో ఒకడిగా, సోదరుడిగా అన్ని రంగాల వారికీ అండగా ఉంటా
– వందేళ్లపాటు రాష్ట్ర ప్రజల సేవలో నిమగ్నమయ్యేలా మార్పులు చేస్తా – కేటీఆర్
హైదరాబాద్ డిసెంబర్ 17: వందేళ్లపాటు తెలంగాణ రాష్ట్ర సమితిని రాష్ట్ర ప్రజల సేవలో నిమగ్నమయ్యేలా మార్పులు చేస్తానని పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్లో సోమవారం పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు.
అనంతరం కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. సంస్థాగతంగా పటిష్ఠంగా పార్టీ నిర్మాణం చేసి, ఎక్కడికక్కడ పార్టీ కార్యాలయాలతో పాటు శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని కేటీఆర్ చెప్పారు. ‘‘తెరాసను భవిష్యత్తులో తిరుగు లేని రాజకీయ శక్తిగా మార్చేందుకు కేసీఆర్ ముఖ్యమైన బాధ్యతను నాకు అప్పగించారు. మీ అందరి మద్దతుతో సీఎం కేసీఆర్ నాపై ఉంచిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తాను. పార్టీని అజేయ శక్తిగా మలిచే క్రమంలో మీ ఆశీర్వాదం కోరుకుంటున్నాను.
మొన్ననే జరిగిన ఎన్నికల్లో అఖండమైన మెజార్టీ ఇచ్చారు. కుల, మతాలకు అతీతంగా టీఆర్ఎస్ ను ఆశీర్వదించారు. పేదలు, రైతులకు పార్టీ అంకితమయ్యేందుకు సంక్షేమ పథకాలను అమలు చేస్తాం. మీలో ఒకడిగా, సోదరుడిగా అన్ని రంగాల వారికీ అండగా ఉంటా. పార్టీని అజేయ శక్తిగా మారుస్తా. కేసీఆర్ నాపై పెట్టిన బాధ్యతను సవ్యంగా నిర్వర్తిస్తా. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య పార్టీ ఉండేలా భగవంతుడు నాకిచ్చిన శక్తిని మీకోసం వినియోగిస్తా.. తనకు మద్దతు తెలుపుతూ ఇక్కడికి వచ్చిన ప్రజలందరికీ వినమ్రంగా, హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ.. శిరసు వంచి పాదాభివందనం చేసుకుంటున్నాను అని కేటీఆర్ పేర్కొన్నారు.
బాధ్యతలు చేపట్టేముందు కేటీఆర్ తెలంగాణ తల్లికి, ఆచార్య జయశంకర్ విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ర్యాలీగా కేటీఆర్ తెలంగాణ భవన్కు చేరుకున్నారు. ఈ వేడుకను తెరాస శ్రేణులు భారీ ఎత్తున నిర్వహించగా.. పెద్ద సంఖ్యలో కేసీఆర్, కేటీఆర్ అభిమానులు, కార్యకర్తలు హాజరయ్యారు. జెండాలు, పార్టీ నాయకుల చిత్రపటాల ప్రదర్శనతో ఆ తెలంగాణ భవన్ ప్రాంతమంతా గులాబీ మయంగా మారిపోయింది. డప్పు చప్పుళ్ల మోత, పోతు రాజుల విన్యాసం, బాణసంచా కాల్పులు మధ్య తెలంగాణ భవన్ పరిసరాలు సందడిగా మారాయి.