లైఫ్ సైన్స్, ఫార్మా పరిశ్రమలకు హైదరాబాద్ కేంద్రంగా వెలుగొందుతున్నదని ఆఫ్రికా జర్నలిస్టుల బృందం ప్రశంసించింది.
శుక్రవారం నాడు ఫ్రాంక్ ఫోన్ దేశాల నుండి వచ్చిన జర్నలిస్టుల బృందం శామీర్ పేటలోని జినోమ్ వ్యాలీ ని సందర్శించింది.ఈ బృందానికి వైస్ ప్రెసిడెంట్(ఆపరేషన్స్)ఏకే సింగ్ సాదర స్వాగతం పలికారు. జర్నలిస్టుల బృందం జీనోమ్ వ్యాలీ లో పలు కంపెనీలను ప్రత్యక్షంగా పరిశీలించారు.పరిశోధన, ఆవిష్కరణల గురించి అధికారులు వారికి వివరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఏకే సింగ్ మాట్లాడుతూ 1991 లో ఈ జినోమ్ వ్యాలీ ఏర్పాటు చేశారని,ప్రస్తుతం నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం పలు కంపెనీలకు సింగిల్ విండొ విధానం ద్వారా అన్ని రకాల అనుమతులు ఇస్తున్నట్లు వివరించారు. జినోమ్ వ్యాలి లో జాతీయ, అంతర్జాతీయ ఫార్మా, లైఫ్ సైన్స్ రంగాల కంపెనీలు ఉన్నాయని,పదిహేను వేల మందికి పైగా ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు వివరించారు.ఇప్పటి వరకు ఏడు వందల కంపెనీలకు అనుమతించడం జరిగిందని,ఇందులో వంద కంపెనీలు ఆర్& డి రంగంలో ఉన్నయన్నారు.రాష్ట్రంలో పరిశ్రమ లకు స్నేహ పూర్వక వాతావరణం ఉందని,దాదాపు అన్ని కంపెనీలు తమ ప్రాజెక్టులను ప్రారభించాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మీడియా అకాడమీ కార్యదర్శి రాజమౌళి,సమాచార శాఖ డిడిలు వెంకటేశ్వరరావు, వెంకటరమణ, జినోమ్ వ్యాలీ అధికారులు రవికుమార్, శరణ్య తదితరులు పాల్గొన్నారు.