రెండేండ్లలో ట్యాంకర్ల అవసరం లేకుండా అందరికీ నీళ్లు – రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రి కే తారకరామారావు
అందరికీ నీళ్లు
-రెండేండ్లలో ట్యాంకర్ల అవసరం లేకుండా నీరిస్తాం..
-డిసెంబర్ నాటికి పట్టణ భగీరథను పూర్తిచేస్తాం
-రెండున్నర లక్షల డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మిస్తాం..
-దేశంలో అగ్రగామి రాష్ట్రంగా ఉన్నాం.. కేంద్ర పథకాల అమలులోనూ ముందున్నాం
-రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రి కే తారకరామారావు
-గ్రేటర్లో ఒకేరోజు 4,554 డబుల్ బెడ్రూం ఇండ్లకు శంకుస్థాపన
-ఐదు సర్వీసు రిజర్వాయర్ల ప్రారంభం
రాబోయే రెండేండ్లలో రాష్ట్రంలోని ప్రజలందరికీ సురక్షిత మంచినీరు అందిస్తామని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. హైదరాబాద్ నగరంలో ట్యాంకర్ల దగ్గరికి బిందెలతో వెళ్లే అవసరం లేకుండా ఇంటింటికీ నల్లా నీరు ఇస్తామని చెప్పా రు. అలాగే పేద ప్రజలు ఆత్మగౌరవంతో నివసించేందుకు రెండున్నర లక్షల డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించి ఇస్తామని చెప్పారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రం దేశంలోనే నంబర్వన్గా ఉందని ఆయన చెప్పారు. కేంద్ర పథకాల అమలులో కూడా తెలంగాణయే అగ్రగామిగా ఉందని వివరించారు. రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు చూడడానికి నీతి ఆయోగ్ సభ్యులే కాక సాక్షాత్తూ ప్రధాని మోదీ ప్రాతినిధ్యం వహించే వారణాసి నుంచి కూడా జర్నలిస్టులు వస్తున్నారని కేటీఆర్ గుర్తుచేశారు. శుక్రవారం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఒకేరోజు 4554 డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణాలకు ఆయన శంకుస్థాపన చేశారు. అలాగే నగరంలో ఐదు సర్వీసు రిజర్వాయర్లను కూడా ప్రారంభించారు. ఉదయం నుంచి సాయం త్రం వరకు నగరమంతా సుడిగాలి పర్యటన చేసి పలు కార్యక్రమాల్లో మంత్రి బిజీగా గడిపారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల్లో జరిగిన సభల్లో ప్రసంగించారు.
డబుల్ బెడ్ రూం ఇండ్ల ఘనత మనదే..
—————————————-
పేదలనుంచి ఒక్క పైసా తీసుకోకుండా రూ.18వేల కోట్లతో 2.50లక్షల డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మించి ఇస్తున్న ఘనత సీఎం కేసీఆర్దేనని మంత్రి కేటీఆర్ చెప్పారు. బహిరంగ మార్కెట్లో ఒక్కో ఇల్లు 35 లక్షల విలువ చేస్తుందని అన్నారు. ఇంతకు ముందు ఇందిరమ్మ ఇండ్ల పేరిట పేదలనుంచి కొంత, బ్యాంకు లోన్ పేరిట కొంత డబ్బులు కట్టించుకునేవారని, కానీ తమ ప్రభుత్వం పైసా ఇచ్చే పనిలేకుండా ఉచితంగా ఇండ్లు నిర్మించి ఇస్తున్నదని చెప్పారు. ఇందిరమ్మ ఇండ్లు అంటే ఒక్కటే అర్ర, తండ్రి, తల్లి, పిల్లా పాప, గొడ్డు, గోదా అన్నట్టు అందరూ డబ్బా ఇండ్లలోనే ఉండేవారు అని కేటీఆర్ గుర్తు చేశారు. అయితే సీఎం కేసీఆర్ మాత్రం రెండు బెడ్రూములు, హాల్, కిచెన్, బాత్రూంలు కట్టిస్తున్నారని చెప్పారు. తమ ప్రభుత్వం కట్టే ఒక్కో ఇల్లు కాంగ్రెస్ కట్టిన పది ఇందిరమ్మ ఇండ్లకు సమానమని ఆయన చెప్పారు. హైదరాబాద్లో ఇప్పటికే 40వేల ఇండ్లకు టెండర్లు పూర్తి చేశామని. మరో 60 వేల ఇండ్లకు టెండర్లు పూర్తిచేసి రాబోయే ఆగస్టునాటికి పేదలకు అందిస్తామని చెప్పారు. రూ.8.60 లక్షల చొప్పున డబుల్ బెడ్ రూం ఇండ్లకు ఖర్చు చేస్తున్నామని, దేశంలోని అన్ని రాష్ర్టాల గృహ నిర్మాణ వ్యయం కలిపినా తెలంగాణ పెడుతున్న ఖర్చే ఎక్కువని మంత్రి వివరించారు.
రెండేండ్లలో ట్యాంకర్ల అవసరముండదు..
——————————————-
గత పాలకుల నిర్లక్ష్యంతో హైదరాబాద్ నగరంలో దాదాపు 40వేల కుటుంబాలకు ట్యాంకర్ల ద్వారా నీళ్లు అందించే పరిస్థితి నెలకొందని, వచ్చే ఎన్నికలకు వెళ్లేలోపు ట్యాంకర్ల వద్దకు వెళ్లే అవసరం లేకుండా ఇండ్ల వద్దనే నల్లా ద్వారా నీళ్లు ఇస్తామని కేటీఆర్ చెప్పారు. ఏ ఆడకూతురు బిందెలు, కుండలతో రోడ్ల మీదకు వచ్చే పరిస్థితి లేకుండా ఇంటింటికీ నల్లా ద్వారా నీరు అందించాలన్న సీఎం కేసీఆర్ లక్ష్యానికి అనుగుణంగా నగరంలో ఇంటింటికీ నల్లా ద్వారా నీరిందించే ప్రక్రియ వేగంగా కొనసాగుతుందని, దాదాపు 300 బస్తీల్లో తాగునీటి వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని చెప్పారు. జీహెచ్ఎంసీలో విలీనమైన నగర శివారులోని 10 సర్కిళ్లలో రూ.1900కోట్లు ఖర్చు పెట్టి 35 లక్షల మందికి జలఫలాలను అందించామన్నారు. 18 నెలల్లో పూర్తిచేయాల్సిన ఈ ప్రాజెక్టును రికార్డు సమయంలో 11 నెలల్లో పూర్తిచేశామని చెప్పారు. రాబోయే రెండేండ్లలో హైదరాబాద్ నగరాన్ని మనం అశించిన స్థాయిలో చూడాలన్న ప్రయత్నంలో భాగంగానే మౌలిక వసతులపై ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. ఇందులో భాగంగానే కరెంట్, తాగునీటి సమస్యను పరిష్కరించామని తెలిపారు.
కేంద్రం నుంచి గ్రాంటు ఇప్పించాలె
మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలను నీతి ఆయోగ్ మెచ్చుకుని, మిషన్ భగీరథకు రూ.15వేల కోట్లు, మిషన్ కాకతీయకు రూ. 9వేల కోట్లు ఇవ్వాలని కేంద్రానికి సిఫారసు చేసిందని మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు. అయితే ఇప్పటివరకు కేంద్రం గ్రాంటు మంజూరు చేయలేదని విచారం వ్యక్తం చేశారు. పక్క రాష్ట్రంలో కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, సురేశ్ ప్రభు అక్కడి ప్రభుత్వం అడిగినవన్నీ ఇస్తూ ఆదుకుంటున్నారని, అదే రీతిలో తెలంగాణకు సహకారం కావలసి ఉందని అన్నారు. రాష్ట్ర బీజేపీ నాయకత్వం పూనుకొని నీతి ఆయోగ్ చేసిన సిఫారసు మేరకు నిధులను మంజూరు చేయించాలని సభలో ఉన్న బీజేపీ నాయకులను కోరారు. అలాగే ఉద్యమ సమయంలో నమోదైన రైల్వే కేసులు ఉపసంహరింపజేయాలన్నారు. మంత్రులుగా ఉండీ తాను, కేంద్ర మంత్రి దత్తాత్రేయ కూడా కోర్టుల చుట్టూ తిరుగాల్సి వస్తున్నదని పేర్కొన్నారు.
అన్ని రంగాల్లో మనమే నంబర్ వన్
————————————–
తెలంగాణ అన్ని రంగాల్లోనూ నెంబర్ వన్గా ఉంటూ ఆదర్శవంత రాష్ట్రంగా అగ్రశ్రేణిలో నిలుస్తున్నదని కేటీఆర్ చెప్పారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం, ఆదాయ వృద్ధి రేటు, ఏక్ భారత్- శ్రేష్ఠ్ భారత్, మిషన్ ఇంద్ర ధనుష్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, పెద్ద నోట్ల రద్దు తర్వాత డిజిటల్ లావాదేవీల విషయంలో ప్రధానమంత్రి, కేంద్రం ఆలోచనలకు అనుగుణంగా నిలిచింది తెలంగాణయే తప్ప గుజరాత్ కాదన్నారు. తాగునీరు, సాగునీరు, సంక్షేమం, వంటి రంగాల్లో దేశం అబ్బురపడే విధంగా రాష్ట్రం నిలబడుతున్నదన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పాత్రికేయుల బృందం వచ్చి ఐడీహెచ్ కాలనీని, గజ్వేల్ నియోజకవర్గంలో ఇండ్లను పరిశీలించిందని కేటీఆర్ చెప్పారు. అక్కడి పాత్రికేయులు ఇక్కడికి వచ్చిన వార్తలు ప్రధాని కచ్చితంగా చూస్తారని, ఆ మేరకు దేశవ్యాప్తంగా డబుల్ బెడ్రూం ఇండ్ల పథకం చేపడుతారని ఆశిస్తున్నామని అన్నారు.
సీఎం లౌకికవాది
—————–
సీఎం కేసీఆర్ నిజమైన లౌకికవాది అని కేటీఆర్ పేర్కొన్నారు. ఆయన అన్ని మతాలను, ధర్మాలను గౌరవిస్తున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి హోదాలో ఉండీ అయుత చండీయాగం చేసినా తన ధర్మాన్ని తాను ఆచరిస్తూ అదే సమయంలో ఇతర మతాలను కూడా గౌరవించారన్నారు. రంజాన్, క్రిస్మస్ల సందర్భంగా పేదలకు బట్టలు పంపిణీ చేస్తున్నారని గుర్తు చేశారు. బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలకు కానుకలు ఇచ్చే విధంగా చర్యలు చేపడుతున్నారని వెల్లడించారు.
మాది సంక్షేమ ప్రభుత్వం
————————–
తమది పేద వాళ్ల కష్టాల్లోంచి వచ్చిన ప్రభుత్వమని.. అందుకే వారి సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నామని మంత్రి కేటీఆర్ చెప్పారు. పేదల ముఖాల్లో చిరునవ్వు చూసేందుకు ఆసరా పింఛన్లు ఇస్తున్నామని తెలిపారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 200 పింఛన్ను 29 లక్షల మందికి ఇస్తూ సంవత్సరానికి రూ. 800కోట్లు ఖర్చు చేస్తే తమ ప్రభుత్వం 40 లక్షల మందికి సంవత్సరానికి రూ. 5300కోట్లు ఖర్చు పెడుతున్నదని చెప్పారు. పేదవాడి బియ్యంలో సీలింగ్ను ఎత్తివేశామని, హాస్టళ్లలో, ప్రభుత్వ పాఠశాలల్లో సన్న బియ్యం అన్నం పెడుతున్నామని చెప్పారు. కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ కింద ఆడబిడ్డలకు రూ. 75,116 కానుక ఇస్తున్నామని, జూన్ 2 నుంచి కేసీఆర్ కిట్ పథకం ప్రారంభించామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, పట్నం మహేందర్రెడ్డి, ఎంపీ మల్లారెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, ఎమ్మెల్యేలు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, ఎమ్మెల్సీలు మైనంపల్లి హన్మంతరావు, శంభీపూర్ రాజు జలమండలి ఎండీ దానకిశోర్ తదితరులు పాల్గొన్నారు.
దమ్ము, ధైర్యం ఉన్న ఏకైక సీఎం కేసీఆర్
——————————————–
తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు ఎండకాలం వచ్చిందంటే విద్యుత్ కోతలు, ఖైరతాబాద్ జలమండలి ముందు ప్రతిపక్ష పార్టీల ధర్నాలు, నిరసనలు ఉండేవని మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎండకాలంలోనూ నాణ్యమైన కరెంట్ను ఇస్తున్నామన్నారు. 70 ఏండ్ల స్వాతంత్ర భారత దేశంలో ఇంటింటికీ నల్లా నీళ్లు ఇవ్వకపోతే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగననే దమ్ము, ధైర్యం కలిగిన ముఖ్యమంత్రి ఒక్క కేసీఆరేనని ఆయన చెప్పారు. ఇందులో భాగంగానే పల్లెలు, తండాల కోసం రూ. 42వేల కోట్లతో రూరల్ మిషన్ భగీరథ పథకాన్ని, అలాగే పట్టణాల్లో రూ.4వేల కోట్లతో పట్టణ భగీరథ కింద నీరు అందించే కార్యక్రమం చేపట్టామన్నారు.