మొక్కలు నాటి పరిరక్షిస్తే గ్రేస్ మార్కులు – రాష్ట్ర అటవీశాఖ మంత్రి శ్రీ జోగు రామన్న
మొక్కలు నాటడంలో చురుగ్గా వ్యవహరిస్తూ వాటిని చక్కగా పరిరక్షించే టెన్త్ విద్యార్థులకు సైన్స్లో ఐదు గ్రేస్ మార్కులు ఇచ్చేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని రాష్ట్ర అటవీశాఖ మంత్రి శ్రీ జోగు రామన్న చెప్పారు. మంగళవారం సనత్నగర్లోని రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి కార్యాలయంలో నేషనల్ గ్రీన్ కార్ప్స్ విద్యార్థుల రాష్ట్రస్థాయి అవగాహన సదస్సులో మంత్రి మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా హరితహారం విజయవంతానికి 2.5 లక్షల మంది విద్యార్థులతో 5000 ఈకో క్లబ్లను ఏర్పాటుచేస్తున్నట్లు తెలిపారు. ఒక్కోక్లబ్లో 10 మంది విద్యార్థులతో ఒక గ్రూపు ఏర్పాటుచేసి, ఐదు గ్రూపులు కలిపి 50 మందితో హరితదళాలను రూపొందించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతులను మాత్రమే వాడాలని మంత్రి కోరారు. కార్యక్రమంలో కాలుష్య నియంత్రణ మండలి సభ్యకార్యదర్శి సత్యనారాయణరెడ్డి, ఎన్జీసీ ఇన్చార్జి రవీందర్ తదితరులు పాల్గొన్నారు.