మూడేండ్లు..365 పథకాలు….ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు నేతృత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం గత మూడేండ్ల పాలన
మూడేండ్లు..365 పథకాలు
-193 పేజీల రిఫరెన్స్ బుక్ రూపొందించిన సీఎం కార్యాలయం
-ఒక్క రైతుల కోసమే 36 పథకాలు
-సాగునీటినుంచి వ్యవసాయ పెట్టుబడిదాకా అన్నింటా భరోసా
-అభాగ్యులందరికీ పింఛన్లు-సర్వజనులకు సంక్షేమ ఫలాలు
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు నేతృత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం గత మూడేండ్ల పాలనలో 365 పథకాలను తీసుకువచ్చింది. ఈ పథకాలమీద సమగ్ర సమాచారంతో ముఖ్యమంత్రి కార్యాలయం 193 పేజీల రిఫరెన్స్ బుక్ను రూపొందించింది. ఇందులో ఒక్కో పథకానికి నిధుల కేటాయింపు, అవి క్షేత్రస్థాయిలోఅమలు జరుగుతున్న తీరు తదితర వివరాలు పొందుపరిచారు. ప్రజల జీవన ప్రమాణాలు పెంపొందించి, వారికి మెరుగైన సేవలను అందించడానికి సీఎం కేసీఆర్ అనేక పథకాలను ప్రకటించడమే కాకుండా వాటి అమలుతీరును ఎప్పటికపుడు సమీక్షిస్తున్న నేపథ్యంలో సీఎంవో ఈ రిఫరెన్స్ బుక్ను రూపొందించింది.
రైతులకోసం 36 పథకాలు.
————————–
14 ఏండ్ల ఉద్యమ కాలంలో తెలంగాణ రైతుగోసను స్వయంగా చూసిన కేసీఆర్ రాష్ట్రసాధన అనంతరం రైతుసమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత నిచ్చారు. ఈ క్రమంలో ఇంతవరకు రైతుల కోసం 36 పథకాలు తీసుకువచ్చారు. తెలంగాణలో కోటి ఎకరాలకు నీరు లక్ష్యంగా ప్రాజెక్టులు చేపట్టారు. చెరువుల పూడికతీతకు మిషన్ కాకతీయ పథకం, రైతులకు రూ.17 వేల కోట్ల రుణమాఫీ పథకం అమలు చేశారు. కేవలం రుణమాఫీతో రైతు పరిస్థితి మెరుగుపడదని భావించి రైతుల సేద్యానికి కావాల్సిన ఎరువులు, తదితర పెట్టుబడిని సమకూర్చాలని చారిత్రక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఎకరాకు ఏడాదికి రూ. 8 వేల పెట్టుబడి పథకం ప్రవేశపెడుతున్నారు. సకాలంలో ఎరువులు, విత్తనాలు సరఫరా చేయాలని నిర్ణయించారు. వీటితోపాటు పెద్ద ఎత్తున ఉద్యానవన రైతులకు సబ్సిడీ పథకం.. వ్యవసాయానికి 9 గంటలు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా పథకం అమలు జరుగుతున్నది. ఈ వర్షాకాల సీజన్ నుంచి 24 గంటలు విద్యుత్ సరఫరా చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది. అలాగే 11 లక్షల మంది రైతులకు ఉచితంగా సాదాబైనామాలు అమలుచేశారు.
సామాజిక భద్రత రంగం
———————–
ఇక సామాజిక భద్రత రంగంలో అనేక పథకాలు తెచ్చారు. వృద్ధులకు, బీడీ కార్మికులకు, వికలాంగులకు భారీగా పింఛన్లు ఇస్తూ పథకాలు తెచ్చారు. గత ప్రభుత్వం సామాజిక పెన్షన్ల కింద రూ. 835.64 కోట్లు ఖర్చు చేయగా, తెలంగాణ ప్రభుత్వం 35,84,385 మందికి ఏడాదికి రూ. 5,330 కోట్లు ఇస్తున్నది. 4.5 లక్షల మంది బీడీ కార్మికులకు వెయ్యి రూపాయల భృతి అందిస్తున్నది. అలాగే పేదింటి ఆడపిల్లల పెళ్లిళ్ల కోసం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను అమలుచేస్తున్నది. అణగారిన వర్గాల సంక్షేమం కింద పేదింటి ఆడపిల్లల పెండ్లిళ్లకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల కింద రూ.75,116 ఇస్తున్నది. హాస్టళ్లలో చదువుకునే విద్యార్థులకు సన్నబియ్యం అన్నం పథకం తెచ్చారు. పేదలకు పంపిణీచేసే రేషన్ బియ్యంపై పరిమితిని ఎత్తివేసి, ఒక్కో వ్యక్తికి నెలకు ఆరు కిలోల బియ్యం ఇస్తున్నారు. మున్సిపాలిటీల్లో పేదలందరికి ఒక్క రూపాయకే నల్లా కనెక్షన్ పథకాన్ని తీసుకువచ్చారు. రాష్ట్రంలో ప్రతి ఇంటికీ సురక్షితమైన తాగునీరు అందించే మిషన్ భగీరథ పథకాన్ని యుద్ధప్రాతిపదికన చేపట్టి పూర్తిచేస్తున్నారు.
మహిళా సంక్షేమానికి
———————
మహిళల భద్రతకు షీ టీమ్స్ ఏర్పాటు చేశారు. గర్భిణీ స్త్రీల కోసం రూ. 12 వేల రూపాయల నగదుతో పాటు కేసీఆర్ కిట్స్ పథకాన్ని తీసుకువచ్చారు. అలాగే గర్భిణీ స్త్రీలను దవాఖానలకు తీసుకురావడం, ప్రసవం తరువాత ఇంటికి సురక్షితంగా తీసుకువెళ్లడం కోసం అమ్మ ఒడి పథకాన్ని అమలు చేస్తున్నారు. ఆశా వర్కర్లకు, అంగన్వాడీ టీచర్లకు వేతనాలు పెంచారు. ఒంటరి మహిళలకు రూ.1000 పెన్షన్ పథకం జూన్లో ప్రారంభిస్తున్నారు. రాష్ట్రంలోని 4.22 లక్షల స్వయం సహాయక గ్రూపుల్లోని 50 లక్షల మందికి రూ. 10 లక్షల వరకు వడ్డీ లేని రుణం పథకానికి 2017-18 బడ్జెట్లో రూ.1245.34 కోట్లు విడుదల చేశారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమానికి
————————————–
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం 39 పథకాలను అమలు చేస్తున్నది. ఎస్సీ, ఎస్టీలకు సబ్ప్లాన్ చట్టాన్ని తీసుకువచ్చింది. దళితులకు మూడెకరాల భూమి పంపిణీ కొనసాగుతున్నది. బీసీలలో అత్యంత వెనుకబడినవారి కోసం ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. బీసీ సమగ్ర అధ్యయనం కోసం బీసీ కమిషన్ను ఏర్పాటు చేశారు. మైనార్టీలలోని పేద వర్గాల అభివృద్ధి కోసం 12 శాతం రిజర్వేషన్లకు అసెంబ్లీలో బిల్లు తెచ్చారు. విదేశాలలో చదివే విద్యార్థుల కోసం రూ. 20 లక్షల ఓవర్సీస్ స్కాలర్షిప్ పథకం ప్రవేశపెట్టారు. వివిధ వర్గాల వారికి విరివిగా గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేశారు. యాదవులకు 75 శాతం సబ్సిడీతో 84 లక్షల గొర్రెలను పంపిణీ చేసే పథకం త్వరలో ప్రారంభించనున్నారు. మత్య్స పరిశ్రమ అభివృద్ధికి ఉచితంగా చేపల సీడ్ను పంపిణీ చేశారు. చేనేత కార్మికుల సంక్షేమానికి పవర్లూమ్ కార్మికుల రుణాలను మాఫీ చేసింది. సెలూన్లకు గృహ కేటగిరిలో విద్యుత్ సరఫరా చేస్తున్నది.
ఉద్యోగుల కోసం
—————-
ఉద్యోగులకు తెలంగాణ ప్రత్యేక ఇంక్రిమెంట్,43 శాతం ఫిట్మెంట్ ఇచ్చారు. ఆర్టీసీ ఉద్యోగులకు 44 శాతం ఫిట్మెంట్ ఇచ్చారు. పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు రిటైర్మెంట్ రోజునే పెన్షన్ కార్యక్రమం ప్రారంభిస్తున్నారు. ఉద్యోగులకు, జర్నలిస్ట్లకు ప్రత్యేకంగా నగదు రహిత వైద్యం పథకం తెచ్చి వెల్నెస్ సెంటర్లను ఏర్పాటు చేశారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరణ, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు భారీగా వేతనాల పెంపు అమలు. జరుపుతున్నారు. మహిళా ఉద్యోగినిలకు 90 రోజుల చైల్డ్ కేర్ లీవ్ను ఇచ్చారు.
డబుల్ బెడ్రూం ఇండ్లు
———————–
డబుల్ బెడ్రూం ఇండ్ల పథకం అమలు ప్రారంభమైంది. మెదక్, ఖమ్మం జిల్లాల్లో కొన్ని చోట్ల గృహప్రవేశాలు జరిగాయి. గ్రేటర్ హైదరాబాద్తో సహా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలలో ఈ సంవత్సరం రెండు లక్షల ఇండ్లు నిర్మిస్తున్నారు. నియోజకవర్గానికి 1400 ఇండ్ల చొప్పున ఈ ఏడాది నిర్మిస్తున్నారు. 125 గజాలలోని ప్రభుత్వ స్థలాల్లో గుడిసెలు వేసుకొని జీవిస్తున్న పేద ప్రజల స్థలాల క్రమబద్ధీకరణ జరిపారు. జీహెచ్ఎంసీ పరిధిలో లక్ష మందికి పట్టాలు పంపిణీ చేశారు. ఇలా సుమారు 365 పథకాలను ప్రభుత్వం అమలు చేస్తున్నది.