మిషన్ భగీరథ ప్రధాన పనులు పూర్తి- ఇక నుంచి ఇంట్రా పనుల పైనే దృష్టి -మిషన్ భగీరథ సమీక్షా సమావేశంలో వైస్ ఛైర్మెన్ వేముల ప్రశాంత్ రెడ్డి
- మిషన్ భగీరథ ప్రధాన పనులు పూర్తి- ఇక నుంచి ఇంట్రా పనుల పైనే దృష్టి
- ఇంట్రా పనుల్లో పెద్ద వర్క్ ఏజెన్సీల సహకారం
- డబుల్ బెడ్ రూం కాలనీల కోసం ప్రత్యేక ప్రణాళిక
- ఈ వేసవికి ప్రతీ గ్రామానికి భగీరథ నీళ్లు
- మిషన్ భగీరథ సమీక్షా సమావేశంలో వైస్ ఛైర్మెన్ వేముల ప్రశాంత్ రెడ్డి.
మిషన్ భగీరథ ప్రధాన పనులు పూర్తయినందున ఇక నుంచి ఇంట్రా పనుల మీద దృష్టిపెట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారని వైస్ ఛైర్మెన్ వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. బల్క్ సరాఫరా మొదలయినంక ఇంట్రా పనులను త్వరగా పూర్తి చేయడానికి ప్రధాన పనులు చేసిన వర్క్ ఏజెన్సీ ల సహకారం తీసుకుంటామన్నారు. సచివాలయంలోని తన కార్యాలయంలో మిషన్ భగీరథపై సమీక్ష సమావేశం నిర్వహించిన వేముల ప్రశాంత్ రెడ్డి, ఇప్పటిదాకా అయిన ఇంట్రా పనులపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఇంట్రా పనుల కోసం ప్రత్యేకంగా RWS&S ఈ.ఈలు ఉన్నందున పనుల్లో మరింత వేగం చూపించాలని చీఫ్ ఇంజనీర్లను ఆదేశించారు. కొన్ని మారుమూల ప్రాంతాల్లో ఇంట్రా విలేజ్ పనులు చేయడంలో ఎదురవుతున్న ఇబ్బందులను త్వరలోనే పరిష్కరిస్తామన్నారు. స్థానిక భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా OHSR డిజైన్ లను మార్చుకునేందుకు ప్రభుత్వం ఇదివరకే అనుమతి ఇచ్చిందని గుర్తుచేశారు.
ఇక డబుల్ బెడ్ రూం కాలనీలు వచ్చే ప్రాంతాల్లో తాగునీటి అవసరాలను తీర్చేందుకు అవసరమైన ప్రణాళికను ముందే తయారుచేయాలన్నారు. ఇంట్రా పనులకు అవసరమైన మెటీరియల్ సరాఫరాలో ఉన్న ఇబ్బందులను తొలగించామని, అవసరమైనంత తెప్పించుకోవాలన్నారు. ఇంట్రా పనులు ఎలాంటి ఆటంకం లేకుండా పూర్తి కావడానికి ఎమ్మెల్యేల సహకారం తీసుకోవాలని సూచించారు. కాంట్రాక్టర్లతో పాటు కూలీలను సమీకరించుకోవడంలో చీఫ్ ఇంజనీర్లు మరింత క్రియాశీలకంగా పనిచేయాలని సూచించారు. ఈసారి రాష్ట్రంలోని ఏ గ్రామంలోనూ తాగునీటి కొరత రాకుండా చూడాలని ఆదేశించారు. ప్రతీ ఇంటికి నల్లాతో నీరు సరాఫరా అయినప్పుడే ముఖ్యమంత్రి గారి స్వప్నం సాకారం అవుతుందని, అందుకు అనుగుణంగా పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు. ఈ వేసవికి ప్రతీ గ్రామానికి భగీరథ నీళ్లు సరాఫరా అవుతున్నందున, ఎండాకాలంలో తలెత్తే తాగునీటి కొరతను తీర్చేందుకు ప్రత్యేకంగా నిధులు విడుదల చేయడం లేదన్నారు RWS&S కార్యదర్శి స్మితా సభర్వాల్. ఇంట్రా పనుల కోసం కలెక్టర్లు పూర్తి సహకారం అందిస్తారని, సద్వినియోగపరుచుకోవాలన్నారు.
ఈ సమావేశంలో RWS&S ఈ.ఎన్.సి సురేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు జ్ఞానేశ్వర్, చీఫ్ ఇంజనీర్లు కృపాకర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, విజయపాల్ రెడ్డి, విజయ్ ప్రకాశ్, కన్సల్టెంట్లు నర్సింగరావు, శ్రీనివాస్ రెడ్డి, జగన్, నందారావు, సురేష్ కుమార్, మనోహర్ బాబు,ఈ.ఈ విజయ్ కుమార్ పాల్గొన్నారు.