బేగంపేట ఎయిర్ పోర్టు వద్ద బిజెపి స్వాగతోత్సవలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగం
హైదరాబాద్: బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న ప్రధాని మోదీ… అక్కడ ఏర్పాటు చేసిన సభలో బీజేపీ ముఖ్య నేతలను ఉద్దేశించి ప్రసంగించారు. తన ప్రసంగాన్ని తెలుగులో ప్రారంభించి అందరిలో ఉత్సాహం నింపారు. సోదర సోదరీ మణులారా మీ అందరికీ నా హృదయ పూర్వక శుభాకాంక్షలు అంటూ తన ప్రసంగాన్ని తెలుగులో ప్రారంభించి అందరిలోనూ ఉత్సాహాన్ని నింపారు. బేగంపేట విమానాశ్రయం పరిసర ప్రాంతాలంతా మోదీ.. మోదీ అనే నినాదాలతో హోరెత్తిపోయింది. సుమారు ఐదు నిముషాలపాటు మోదీ పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. తెలంగాణ అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని చెప్పారు. అదే సమయంలో ప్రపంచం మొత్తం హైదరాబాద్వైపు చూస్తోందని అన్నారు. ప్రపంచంలోని పారిశ్రామిక వేత్తలంతా హైదరాబాద్ చేరుకుంటున్నారని అన్నారు. తన ప్రసంగంలో ప్రధానంగా హైదరాబాద్ వస్తే తనకు పటేల్ గుర్తుకు వస్తారని మోదీ చెప్పారు. హైదరాబాద్ సంస్థానాన్ని భారత్లో విలీనం చేయడానికి ఆయన చేసిన కృషిని మోదీ అభినందించారు. అలాగే తన ప్రసంగాన్ని కూడా తెలుగులోనే ముగించి… అందరికీ ధన్యవాదాలు తెలిపారు. అనంతరం అక్కడి నుంచి మోదీ ప్రత్యేక హెలీకాఫ్టర్లో మియాపూర్ మెట్రో స్టేషన్కు బయలుదేరారు. అక్కడ మోట్రో పైలాన్ను ప్రారంభించనున్నారు.