బాలికల విద్యాభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం
– వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి
బాలికల విద్యాభివృద్ధే ధ్యేయంగా తెలంగాణ సర్కారు అడుగులు వేస్తున్నదని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి అన్నారు. మహబూబ్నగర్ జిల్లా బాలానగర్ మండల కేంద్రంలో బాలికల గురుకుల కళాశాలను మంత్రి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా పాఠశాలలో ఏర్పాటు చేసిన యోగా, కరాటే ప్రదర్శనలను తిలకించారు. అనంతరం మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ప్రైవేట్కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలను తీర్చిదిద్దుతూ మెరుగైన విద్యాబోధనతో ఉత్తమ ఫలితాలు తీసుకొచ్చేందుకు సర్కారు కృషి చేస్తున్నదన్నారు. విద్యావైద్య రంగాలను ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నదన్నారు. బాలికలకు అండగా ఉంటూ ఆదుకునేందుకు ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను చేపట్టిందన్నారు.
పాలమూరును సస్యశ్యామలం చేసేందుకు సీఎం కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని తెలిపారు. జడ్చర్ల నియోజకవర్గంలోని లక్షా యాభై వేల ఎకరాలకు సాగునీరందిస్తామన్నారు. ప్రతిపక్షాలు ఇప్పటికైనా అభివృద్ధిలో కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు.