పోలీస్ అమరవీరులకు ఘన నివాళి – సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ లో పరేడ్
పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఈరోజు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లోని అమరవీరుల స్థూపం వద్ద పోలీస్ అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. ముందుగా.. ట్రైనీ కానిస్టేబుళ్లు కమాండ్ ట్రైనింగ్ సెంటర్ నుంచి అమరవీరుల స్థూపం వరకు కవాతుగా చేరుకున్నారు. అనంతరం డిసిపి ట్రాఫిక్ ఏఆర్ శ్రీనివాస్ గౌరవ వందనం స్వీకరించి సైబరాబాద్ సిపి సందీప్ శాండిల్యాను ఆహ్వానించారు. ఈ సందర్భంగా సైబరాబాద్ సిపి సందీప్ శాండిల్యా మాట్లాడుతూ పోలీసులు లేని సమాజాన్ని ఊహించలేమన్నారు. పోలీసు వారు వీధుల్లో భాగంగా కుటుంబానికి, పండుగలకు, సంతోషాలకు, సరదాలకు దూరంగా ఉంటూ సమాజ సేవ చేస్తారన్నారు. ప్రజా రక్షణ కోసం ప్రాణాలను సైతం తృణప్రాయంగా విడిచే పోలీస్ అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివని కొనియాడారు. తాను విధుల్లో చేరినప్పటి పరిస్థితులతో పోల్చుకుంటే ఇప్పుడు తెలంగాణలో శాంతి భద్రతలు మెరుగ్గా ఉన్నాయన్నారు. తెలంగాణ ప్రభుత్వం పోలీస్ శాఖకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడమే ఇందుకు కారణమన్నారు. తెలంగాణ రాస్త్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానం నడుస్తోందన్నారు. శాంతి భద్రతల కోసం పౌరులు పోలీసులకు సహకరించి ఫ్రెండ్లీ సిటిజన్స్ అనిపించుకోవాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో శాంతి స్థాపన కోసం పోలీసులు నిర్విరామంగా కృషి చేస్తున్నారన్నారు. తెలంగాణా పోలీసులు దేశంలోనే ఉత్తమ పోలీసులుగా గుర్తింపు తెచ్చుకున్నారని తెలిపారు. అమర వీరుల కుటుంబాలకు మేమున్నామని భరోసా ఇవ్వడానికి ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయన్నారు. అనంతరం అడిషనల్ డిసిపి సెక్యూరిటీ మాణిక్ రాజ్ దేశవ్యాప్తంగా విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన పోలీసు వారి పేర్లను చదివి వినిపించారు. సైబరాబాద్ సిపి సందీప్ శాండిల్య, సైబరాబాద్ ట్రాఫిక్ డిసిపి ఏ ఆర్ శ్రీనివాస్ అమర వీరుల స్థూపానికి సెల్యూట్ చేశారు. తరువాత రెండు నిమిషాల పాటు (యూనిఫాంలో ఉన్న వారు సెల్యూట్ చేస్తూ, సివిల్ డ్రెస్ లో ఉన్నవారు అటెన్షన్)లో మౌనం పాటించారు. అమరుల త్యాగాలను స్మరిస్తూ వారి కుటుంబ సభ్యులను శాలువాతో సత్కరించారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ లో వివిధ అంశాలపై పోలీసులకు నిర్వహించిన వ్యాస, వక్తృత్వ, పెయింటింగ్ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు ప్రశంసాపత్రం, షీల్డ్ లను బహూకరించారు. అనంతరం విద్యార్థుల గీసిన బొమ్మలను సిపి సందీప్ శాండిల్యా, ఇతర పోలీస్ అధికారులు తిలకించారు. ఈ కార్యక్రమంలో సైబరాబాద్ సిపి సందీప్ శాండిల్యా, డిసిపి మాదాపూర్ విశ్వప్రసాద్, డిసిపి బాలానగర్ సై శేఖర్, డిసిపి ట్రాఫిక్ ఏఆర్ శ్రీనివాస్, డిసిపి క్రైమ్స్ జానకి శర్మిలా, అడిషనల్ డిసిపి సెక్యూరిటీ మాణిక్ రాజ్, ఇన్ చార్జ్ అడ్మిన్ ఏసీపీ గాంధీ నారాయణ, ఆర్ఐ తోట శ్రీనివాసులు, సైబర్ క్రైమ్స్ ఏసీపీ జయరాం, పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు భద్రారెడ్డి, కార్యవర్గ సభ్యుడు కృష్ణారెడ్డి, ఇతర పోలీస్ అధికారులు, అమరవీరుల కుటుంభ సభ్యులు, రిటైర్డ్ పోలీస్ ఉద్యోగులు, ట్రైనీ కానిస్టేబుళ్లు, వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.