పాలమూరులో ఇంటింటికీ త్రాగునీరు : కేటీఆర్
పాలమూరు జిల్లా కేంద్రంలో ఇంటింటికీ త్రాగు నీరు సరఫరా చేస్తామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఇవాళ జిల్లా కేంద్రంలో పర్యటించిన కేటీఆర్.. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం జడ్పీ గ్రౌండ్స్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేటీఆర్ ప్రసంగించారు. పాలమూరు జిల్లాను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని ఉద్ఘాటించారు. గతంలో 10 రోజులకొక సారి మంచినీళ్లు వచ్చేది. త్వరలోనే ఆ సమస్య తొలగిపోతుందన్నారు. మిషన్ భగీరథ పూర్తయితే తాగునీటి కష్టాలు తీరుతాయన్నారు మంత్రి. వచ్చే ఎండకాలం నుంచి ప్రతి ఇంటికీ మంచినీరు సరఫరా చేస్తామని ఉద్ఘాటించారు.
పాలమూరు జిల్లాలో అతిపెద్ద ప్రాజెక్టు నిర్మించాలని ఆనాడు నిజాం ప్రభువు భావించాడని కేటీఆర్ తెలిపారు. 170 టీఎంసీలతో అప్పర్ కృష్ణా ప్రాజెక్టుకు ఆనాడే ప్రణాళిక రూపొందించిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. ఆంధ్ర, హైదరాబాద్ రాష్ర్టాల విలీనంతో ఆ ప్రాజెక్టు అటకెక్కిందన్నారు. పాలమూరు పచ్చబడకపోతే తెలంగాణ వచ్చి లాభం లేదనేది సీఎం కేసీఆర్ అభిప్రాయమని చెప్పారు మంత్రి.
పాలమూరు పచ్చబడాలనేదే సీఎం కేసీఆర్ ఆకాంక్ష అని తెలిపారు. పాలమూరు ప్రజలు వలసపోవడానికి గత పాలకులే కారణమన్నారు. అన్ని వర్గాల అభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకు పోతున్నదని స్పష్టం చేశారు. పాలమూరులో 3700 డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం జరుగుతుందన్నారు. దసరా నాటికి 1200 లేదా 1300 ఇండ్లను ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు. రాష్ర్ట వ్యాప్తంగా డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం వేగవంతమైందన్నారు.
పేదలకు నాణ్యమైన విద్య, వైద్యం అందిచేందుకు కృషి చేస్తున్నామని ఉద్ఘాటించారు.
Courtesy: TRS Party Online