పంచాయితీ రాజ్, గ్రామీణ తాగునీటి సరాఫరా విభాగం ఇంజనీర్ల ఆధ్వర్యంలో ఎర్రమంజిల్ లోని RWS&S కార్యాలయంలో ఘనంగా నిర్వహించిన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు – పాల్గొన్న ఈ.ఎన్.సి సురేందర్ రెడ్డి
తెలంగాణ వస్తే ఏమొచ్చింది అన్న ప్రశ్నకు తాగు,సాగునీటి రంగంలో సాధిస్తోన్న విజయాలే సమాధానమన్నారు RWS&S ఈ.ఎన్.సి సురేందర్ రెడ్డి. పడావుబడ్డ భూముల్లో జలసిరులను నింపడంతో పాటు దూప కోసం తన్లాడుతున్న గొంతుకలకు గుక్కెడు మంచినీళ్లు ఇచ్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న భగీరథ యజ్ఞానికి ఇవాళ యావత్ దేశం సలాం చేస్తోందన్నారు. పంచాయితీ రాజ్, గ్రామీణ తాగునీటి సరాఫరా విభాగం ఇంజనీర్ల ఆధ్వర్యంలో ఎర్రమంజిల్ లోని RWS&S కార్యాలయంలో నిర్వహించిన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఈ.ఎన్.సి, 2030 నాటికి ప్రతీ ఒక్కరికి సురక్షిత మంచినీటిని అందించాలన్న యునిసెఫ్ లక్ష్యాన్ని ఈ సంవత్సరమే తెలంగాణ సాధించిందన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రత్యక్షంగా చూసేందుకు దేశం నలుమూలల నుంచి వస్తున్న సందర్శకులతో డెవలప్ మెంట్ టూరిజానికి తెలంగాణ నాంది పలికిందన్నారు.
అమరుల త్యాగఫలంతో ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డ తెలంగాణకు తొలి ముఖ్యమంత్రి గా కేసీఆర్ అద్భుతమైన పాలనను అందిస్తున్నారని చెప్పారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణను అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు ప్రతీ క్షణం తపిస్తున్నారన్నారు. ఏ పనిలోనైనా ఒత్తిడి ఉంటుందని అయితే ధ్యానం, వ్యాయామంతో దాన్ని సులువుగా దూరం చేసుకోవచ్చన్నారు. ఆ తర్వాత మాట్లాడిన పంచాయితీరాజ్ ఈ.ఎన్.సి సత్యనారాయణ రెడ్డి, సాటిలేని కేసీఆర్ పోరాటంతోనే ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడిందన్నారు. ప్రజల ఆకాంక్షలు, ఆశలను నెరవేర్చేందుకు అనుక్షణం పాటుపడుతున్న సిఎం కేసీఆర్ కు ప్రతీ ఒక్క ఉద్యోగి అండగా నిలబడాలన్నారు. అంతకుముందు ఎర్రమంజిల్ కార్యాలయంలో జాతీయ జెండాను పంచాయితీరాజ్ ఈ.ఎన్.సి సత్యనారాయణ రెడ్డి ఎగరవేశారు.RWS&S ఈ.ఎన్.సి సురేందర్ రెడ్డి తో కలిసి కేక్ కట్ చేశారు.
ఈ కార్యక్రమంలో చీఫ్ ఇంజనీర్లు రాములునాయక్, జగన్మోహన్ రెడ్డి, విజయపాల్ రెడ్డి, విజయప్రకాశ్, జాన్ మిల్టన్, రవితో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.