నిర్మాణాత్మకమైన వార్తలు అందించాలి – ప్రెస్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విలేకరుల శిక్షణ ముగింపు కార్యక్రమంలో రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి
తెలంగాణ ప్రెస్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నరంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్ జిల్లాల విలేకరుల రెండురోజుల శిక్షణా కార్యక్రమం కూకట్పల్లి జేఎన్టీయూ లో ఆదివారం ఘనంగా ముగిసింది.
ప్రెస్ అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ అధ్యక్షతన జరిగిన ముగింపు కార్యక్రమానికి రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ పాలన కోసం కొత్త జిల్లాలు ఏర్పడినప్పటికీ, విలేకరులకు బస్ పాస్ లు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు వర్తించేలా తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిలా పని చేస్తున్న విలేకరులు అందరికీ డబల్ బెడ్ రూమ్ ఇళ్ళను అందిస్తామన్నారు.
విలేకరులలో వృత్తిపర నైపుణ్యాన్ని పెంపొందించేందుకు శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ప్రెస్ అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మొదలుగా తెలంగాణ ప్రాజెక్టులు అనే అంశంపై ‘నమస్తే తెలంగాణ’ ఎడిటర్ కట్టా శేఖర్ రెడ్డి ప్రసంగించారు. నదులు-జలసంపద – పత్రికల భాష-తప్పొప్పులు, దిద్దుబాటు అనే అంశంపై ‘నమస్తే తెలంగాణ’ రీజినల్ డెస్క్ ఇన్-ఛార్జ్ చిల్ల మల్లేశం, తెలంగాణ న్యూ మీడియా అనే అంశంపై దిలీప్ కొణతం, సాధించుకున్న తెలంగాణ – జర్నలిజంలో ప్రత్యేక సవాళ్లు అనే అంశంపై సీనియర్ జర్నలిస్టు టంకశాల అశోక్, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా పరస్పర ఆధారితాలు అనే అంశంపై వీ6 సీనియర్ జర్నలిస్టు బుచ్చన్న ప్రసంగించారు.
శిక్షణ ముగింపు కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, వివేక్, శేఖర్ పాల్గొన్నారు.
ఈ రెండు రోజుల శిక్షణకు హాజరైన విలేకరులు హర్షం వ్యక్తం చేసారు. పలు అంశాలపై సీనియర్ పాత్రికేయుల సూచనలు, సలహాలు ఎంతగానో ఉపయుక్తంగా ఉన్నాయని అన్నారు.
శిక్షణకు హాజరైన విలేకరులకు ఈ సందర్భంగా పత్రాలు అందించారు.