నిరంతరంగా సివిల్స్, పోటీ పరీక్షల శిక్షణ
నోటిఫికేష న్స్ తో సంబంధం లేకుండా శిక్షణ
బీసీ స్టడీ సర్కిల్స్ శిక్షణతో ఉద్యోగం గ్యారంటీ ఉండాలి
బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న
హైదరాబాద్, జూన్ 21 : సివిల్స్, గ్రూప్, ఇతర పోటీ పరీక్షలకు బీసీ స్టడీ సర్కిల్స్ ద్వారా నిరంతరంగా శిక్షణా కార్యక్రమాలు కొనసాగాలని బీసీ సంక్షేమం, అటవీ శాఖల మంత్రి జోగు రామన్న ఆదేశించారు. గురువారం సాయంత్రం సచివాలయంలోని తన ఛాంబర్లో బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేషం, కమిషనర్ అనితా రాజేంద్ర, బీసీ స్టడీ సర్కిల్ రాష్ర్ట సంచాలకులు గొట్టిపాటి సుజాత, ఇతర అధికారులతో మంత్రి జోగు రామన్న సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి జోగు రామన్న మాట్లాడుతూ బీసీ అభ్యర్థులు పోటీ పరీక్షలలో అద్భుతంగా రాణించే విధంగా శిక్షణ కార్యక్రమాలు కొనసాగేలా చర్యలు తీసుకోవాలన్నారు. అందుకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలను కల్పించాలని, లైబ్రరీ, శిక్షణకు అవసరమైన స్టడీ మెటీరియల్ అభ్యర్థులకు అందుబాటులో ఉంచాలన్నారు. బీసీ స్టడీ సర్కిల్లో శిక్షణ తీసుకున్న ప్రతి అభ్యర్థికి ఉద్యోగం వచ్చే విధంగా చూడాలన్నారు. అన్ని బీసీ స్టడీ సర్కిల్స్ లో స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ ఇవ్వాలని జోగు రామన్న అన్నారు. రాష్ర్టంలో 11 బీసీ స్టడీ సర్కిల్స్ ఉన్నాయని, ఈ సర్కిల్స్ నుంచి అద్భుతమైన ఫలితాలు వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆదిలాబాద్, మెదక్, ఖమ్మం, నిజామాబాద్, కరీంనగర్లలో నిర్మాణాల్లో ఉన్న స్టడీ సర్కిల్ భవనాలు సత్వరమే పూర్తి చేయాలని ఆయన సూచించారు.