నిజామాబాద్లో ఐటీ హబ్ కోసం ఉత్తర్వులు
నిజామాబాద్కు ఐటీ హబ్ను మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. ఇటీవలే ఖమ్మంలో ఐటీహబ్ను ఏర్పాటుచేసిన ప్రభుత్వం, తాజాగా నిజామాబాద్లో ఐటీ హబ్కు అనుమతులు ఇచ్చింది. ఈ మేరకు సచివాలయంలో ఐటీ శాఖ మంత్రి కే తారక రామారావు.. నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తాకు అనుమతిపత్రాలను అందజేశారు. దీంతో ఐటీహబ్ కోసం ఎంపీ కవిత చేసిన కృషి ఫలించినట్టయింది. అనంతరం ఎమ్మెల్యేలు గణేశ్గుప్తా, శీనివాస్గౌడ్లతో కలిసి ఎంపీ కవిత మీడియాతో మాట్లాడారు. నిజామాబాద్కు ఐటీ టవర్తోపాటు ఇంక్యుబేటర్ను మంజూరు చేయడం సంతోషంగా ఉందన్నారు. దీనికోసం రూ.50 కోట్లు మంజూరైనట్టు చెప్పారు. ఎమ్మెల్యే గణేశ్ గుప్తా కృషితో 60 ఐటీ కంపెనీలు నిజామాబాద్ ఐటీహబ్లో కార్యకలాపాలు సాగించేందుకు ముందు కొచ్చాయన్నారు. వచ్చే దసరా నాటికి ప్రారంభం కానున్న ఈ ఐటీహబ్ ఉత్తర తెలంగాణకు కూడలిగా మారుతుందని ఆమె అన్నారు. పదివేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇంక్యుబేటర్ నిర్మాణం ఉంటుందన్నారు.
హైదరాబాద్తోపాటు ఇతర జిల్లాల్లోనూ ఐటీ పార్కులను ఏర్పాటుచేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. ఈ క్రమంలోనే ఖమ్మంలో మొదటి ఐటీ టవర్ను ఏర్పాటుచేసిన ప్రభుత్వం తర్వాత మహబూబ్నగర్ జిల్లా దివిటిపల్లిలో 400 ఎకరాల్లో ఐటీ, ఇండస్ట్రియల్ హబ్ ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించిందని వివరించారు. త్వరలో పనులు ప్రారంభమవుతాయని చెప్పారు. నిజామాబాద్కు ఐటీ టవర్, ఇంక్యుబేటర్ను ప్రభుత్వం మంజూరు చేయడంపై నిజామాబాద్ ప్రాంత ప్రజల పక్షాన సీఎం కేసీఆర్కు, మంత్రి కేటీఆర్కు కవిత కృతజ్ఞతలు తెలిపారు. మహబూబ్నగర్ ఐటీ కారిడార్పై సానుకూలంగా స్పందించిన మంత్రి కేటీఆర్కు మహబూబ్నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు.
మున్సిపాలిటీల అభివృద్దికి రూ. 350 కోట్లు మంజూరు
నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలోని 5 మున్సిపాలిటీల అభివృద్ధికి రూ. 50 కోట్ల చొప్పున రూ.250 కోట్లు, నిజామాబాద్ కార్పొరేషన్ అభివృద్ధికి రూ.100 కోట్లు కలిపి మొత్తం రూ. 350 కోట్లు మంజూరయ్యాయని ఎంపీ కవిత తెలిపారు. ఏప్రిల్ 6న ఆర్మూర్లో జరిగిన జనహిత ప్రగతిసభలో ఇచ్చిన హామీని మంత్రి కేటీఆర్ నిలబెట్టుకున్నారని ఆమె అన్నారు.