హైదరాబాద్: దేశవ్యాప్తంగా ప్రఖ్యాతి గాంచిన ఖైరతాబాద్ మహాగణపతి గంగమ్మ ఒడికి చేరాడు. మహాగణపతి నిమజ్జనం గణపతి బప్పా మోరియా నినాదాల మధ్య అట్టహాసంగా ముగిసింది. కన్నుల పండువగా నిర్వహించిన శోభాయాత్ర ద్వారా భారీ వాహనంపై ఖైరతాబాద్ నుంచి ట్యాంక్బండ్కు చేరుకున్న మహాగణపతికి అర్చకులు తుది పూజలు నిర్వహించారు. అనంతరం భారీ క్రేన్ ద్వారా గణపతిని హుస్సేన్సాగర్ జలాల్లో నిమజ్జనం చేశారు.
అధికారుల విజ్ఞప్తి మేరకు గణేష్ ఉత్సవ సమితి సభ్యులు ఉదయమే మహాగణపతి శోభాయాత్ర ప్రారంభించారు. విగ్రహాన్ని మండపం నుంచి వేరుచేసి రవి క్రేన్స్కు చెందిన హైడ్రాలిక్ టెలీస్కోప్ మొబైల్ క్రేన్’ ద్వారా భారీ వాహనంపైకి ఎక్కించారు. 60 అడుగుల పొడవు, 11 అడుగుల వెడల్పు గల భారీ వాహనంపై గణనాథుడు హుస్సేన్సాగర్కు బయలుదేరాడు. భక్తజనం అడుగడుగునా మహాగణపతికి నీరాజనం పలికారు. గతంలో కంటే ఈ ఏడాది నిమజ్జనం రోజునే ఖైరతాబాద్ గణేషుడిని నిమజ్జనం చేశారు. అధికారులు అన్ని చర్యలు తీసుకోవడంతో అనుకున్న సమయానికే గణేశుడు ట్యాంక్బండ్కు చేరుకున్నాడు. అనంతరం ట్రాలీ నుంచి విగ్రహాన్ని దించి భారీ క్రేన్ సాయంతో హుస్సేన్సాగర్ జలాల్లో నిమజ్జనం చేశారు.
మహాగణపతి నిమజ్జనాన్ని తిలకించేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. భక్తులతో ట్యాంక్బండ్, ఎన్టీఆర్ మార్గ్ పరిసర ప్రాంతాలు కిక్కిరిసిపోయాయి. ఆ ప్రాంతం భక్తులతో కోలాహలంగా మారింది. ట్యాంక్ బండ్ పై సందడి వాతావరణం నెలకొంది.
ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనాన్ని కనులారా వీక్షించేందుకు తరలివచ్చిన భక్తులతో ట్యాంక్బండ్ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. నగరం నలుమూలల నుంచి పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చారు. మహాగణపతి గంగమ్మ ఒడిలోకి చేరుతున్న సమయంలో జయజయ ధ్వానాలు పలికారు.
గణేశ్ నిమజ్జనం సందర్భంగా ట్యాంక్బండ్ పరిసరాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ఠ చర్యలు తీసుకున్నారు. సీసీ కెమెరాల ద్వారా పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.
గణనాథుల నిమజ్జన యాత్ర శోభాయమానంగా కొనసాగుతోంది. హుస్సేన్ సాగర్ కు తొమ్మిది ప్రధాన మార్గాల్లో గణనాథులు చేరుతున్నాయి. ప్రధాన శోభాయాత్రతో పాటు నగరంలో మొత్తం 21 ఊరేగింపు మార్గాల్లో గణనాథులు ఊరేగుతున్నాయి. గణనాథుల శోభాయాత్రను తిలకించేందుకు భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు.
ఇక నిమజ్జనం సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నగరంలో 28 ప్రాంతాల్లో కార్యక్రమాలు చేపట్టారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి11గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలు కొనసాగనున్నాయి.
నిమజ్జనం నేపథ్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. 26 వేల మంది పోలీసులు విధి నిర్వహణలో ఉన్నారు. హుస్సేన్ సాగర్ పరిసరాల్లో సీసీ కెమెరాలతో ఎప్పటికప్పుడు భద్రతను పర్యవేక్షిస్తున్నారు పోలీసులు. నిమజ్జన కార్యక్రమం వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.