ప్రతి పాత జిల్లాకో మెడికల్ కాలేజీ
-దశలవారీగా దవాఖానల ఆధునీకరణ: మంత్రి డాక్టర్ సీ లక్ష్మారెడ్డి..
-కరీంనగర్లో మాతా, శిశు ఆరోగ్య కేంద్రం ప్రారంభం
రాష్ట్రంలోని పాత జిల్లా కేంద్రాల్లో మెడికల్ కళాశాలలు నెలకొల్పాలని ప్రభుత్వం నిర్ణయించిందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ సీ లక్ష్మారెడ్డి తెలిపారు. గురువారం కరీంనగర్లో రూ. 20 కోట్లతో నిర్మించిన మాతా, శిశు ఆరోగ్య కేంద్రాన్ని మంత్రి ఈటల రాజేందర్తో కలిసి ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఇప్పటికే మహబూబ్నగర్లో ప్రారంభించామని, త్వరలో సిద్దిపేటలో ప్రారంభిస్తామన్నారు. మలి దశలో కరీంనగర్, నల్గొండ జిల్లా కేంద్రాల్లో ప్రారంభిస్తామని చెప్పారు. వైద్య, ఆరోగ్య శాఖ, వైద్య విధాన పరిషత్ల ఆధ్వర్యంలోని ప్రతి దవాఖానను దశల వారీగా ఆధునీకరిస్తున్నట్టు తెలిపారు.
రాష్ట్రంలో 20 ప్రధాన దవాఖానాల్లో ఐసీయూ విభాగాలను ఏర్పాటు చేస్తున్నామని, కరీంనగర్తోపాటు మరో మూడు చోట్ల ఇప్పటికే ప్రారంభించా మన్నారు. 39 దవాఖానల్లో డయాలసిస్ కేంద్రాలను నెలకొల్పే ప్రక్రియ కొనసాగుతున్నదన్నారు. కరీంనగర్లో సూపర్ స్పెషాలిటీ వైద్యశాలతోపాటు మెడికల్ కళాశాలను నెలకొల్పుతామని హామీ ఇచ్చారు. రాష్ట్ర ఆర్థిక, పౌర సరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ పేదలకు మంచి వైద్యాన్ని, వారి పిల్లలకు నాణ్యమైన విద్యను అందించినపుడే బంగారు తెలంగాణ సాధ్యమన్నారు. విద్యుత్ విషయాన్ని ప్రస్తావిస్తూ రైతులకు నాణ్యమైన కరెంట్ను అందిస్తున్నామని అన్నారు. ఇకముందు 24 గంటల పాటు కరెంట్ సరఫరా చేసే స్థితికి రాష్ట్రం చేరుకున్నదని మంత్రి ఈటల స్పష్టం చేశారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో జెడ్పీ అధ్యక్షురాలు తుల ఉమ, మేయర్ సర్దార్ రవీందర్ సింగ్, కలెక్టర్ మాట్లాడారు.
ఆరోగ్యవంతమైన తెలంగాణే సీఎం లక్ష్యం
——————————————-
ఆరోగ్యవంతమైన తెలంగాణే సీఎం కే చంద్రశేఖర్రావు లక్ష్యమని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. గురువారం వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్లో నిర్మించిన 30 పడకల దవాఖానను మంత్రి ప్రారంభించి మాట్లాడారు. తెలంగాణ వస్తే ఏం వస్తుందో ప్రజలకు తెలిసేలా ప్రభుత్వం చేసి చూపిస్తున్నదన్నారు. కార్యక్రమంలో ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్, సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్, టీఎస్ ఎంఎస్ఐడీసీ చైర్మన్ మర్యాద కృష్ణమూర్తి తదితరులున్నారు.