తెలంగాణ సాహిత్య అకాడమీ లోగోను, తెలంగాణ ప్రపంచ తొలి తెలుగు మహాసభల లోగోను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి కెసిఆర్
తెలంగాణ సాహిత్య అకాడమీ లోగోను, తెలంగాణ ప్రపంచ తొలి తెలుగు మహాసభల లోగోను ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు మంగళవారం ప్రగతిభవన్లో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు శ్రీ కేవీ రమణాచారి, సాహిత్య అకాడమీ చైర్మన్ శ్రీ నందిని సిదారెడ్డి, అధికార భాషా సంఘం అధ్యక్షుడు శ్రీ దేవులపల్లి ప్రభాకర్ రావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీ ఆయాచితం శ్రీధర్, సాంస్కృతిక శాఖ కార్యదర్శి శ్రీ బుర్ర వెంకటేశం, సీఎం ఓఎస్డీ శ్రీ దేశపతి శ్రీనివాస్, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ శ్రీ మామిడి హరికృష్ణ తదితరులు హాజరయ్యారు. సాహిత్య అకాడమీ లోగోను సిద్దిపేటకు చెందిన ప్రముఖ చిత్రకారుడు, శిల్పి శ్రీ ఎం.వి. రమణారెడ్డి రూపొందించారు. తెలుగు మహాసభల లోగోను చేర్యాలకు చెందిన ప్రముఖ చిత్రకారుడు రవిశంకర్ రూపొందించారు.
సాహిత్య అకాడమీ లోగో విశేషాలు:
————————————-
సాహిత్య అకాడమీ లోగో మధ్యలో ఫిలిగ్రీ శైలిలో హంసను చిత్రించారు. హంస ముక్కు స్థానంలో పాళి కనిపిస్తుంది. హంస కింద పుస్తకం పుటలను నీటి అలలుగా చిత్రించారు. లోగో పైభాగంలో తెలంగాణ మ్యాపులో సాహిత్య వృక్షం శాఖోపశాఖలు విస్తరిస్తున్నట్లు ప్రతీతాత్మకంగా పొందపరిచారు. లోగో మధ్యలో పాల్కురికి సోమన పద్యభాగం ‘సరసమై బరగిన జాను తెనుగు’ అనే పద్యపాదాన్ని ప్రముఖంగా చేర్చారు.
తెలుగు మహాసభల లోగో విశేషాలు:
—————————————
తెలుగు మహాసభల లోగోలో కాకతీయ తోరణం, మధ్యలో తెలంగాణ చిత్రపటం, కాకతీయ సామ్రాజ్య చిహ్నాలైన గజరాజులను నకాశీ చిత్రరీతిలో పొందపరిచారు. లోగో పై భాగంలో తెలంగాణ రాష్ట్ర పక్షి పాలపిట్టలను చిత్రించారు. మన తెలంగాణము తెలుగు మాగానము అనే వ్యాక్యం కనిపిస్తుంది.