-తెలంగాణ పథకాలు ప్రశంసనీయం: కర్ణాటక మీడియా అకాడమీ చైర్మన్ సిద్ధరాజు
-జర్నలిస్టుల కుటుంబాలకు చెక్కుల పంపిణీలో మండలి చైర్మన్ స్వామిగౌడ్
జర్నలిస్ట్ కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉండడంతోపాటు వారి సంక్షేమానికి భరోసా కల్పించిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదేనని శాసనమండలి చైర్మన్ కె. స్వామి గౌడ్ అన్నారు.
వివిధ కారణాలతో మృతిచెందిన, అనారోగ్యం, ప్రమాదాల బారినపడిన 74 మంది జర్నలిస్టుల కుటుంబాలకు చెక్కుల పంపిణీ కార్యక్రమం బుధవారం నాంపల్లి తెలుగు యూనివర్సిటీ ఆడిటోరియంలో రాష్ట్ర మీడియా అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించారు.
రాజ్యసభ సభ్యుడు కే కేశవరావు మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమంతోపాటు వృత్తిపమైన శిక్షణకు ప్రాధాన్యతను ఇవ్వాలని అయన సూచించారు. జర్నలిస్టుల శిక్షణ కార్యక్రమాల ద్వారా వృత్తిలో నైపుణ్యం పెరుగుతుందని తెలిపారు.
తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ మాట్లాడుతూ మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు గత ఏడాది ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు పుట్టినరోజు సందర్బంగానే జనహితలో జర్నలిస్టులకు సంక్షేమ నిధి ద్వారా 100 మంది జర్నలిస్టుల కుటుంబాలకు సంక్షేమనిధి నుంచి చెక్కుల పంపిణి చేసినట్లు అయన వివరించారు. జర్నలిస్టుల సంక్షేమ నిధికి 100 కోట్ల మూల నిధిని సమకూరుస్తునట్లు ప్రభుత్వం ప్రకటించిందని, ఇటువంటి ప్రయత్నం ఏ రాష్ట్రంలోను జరగలేదని తెలిపారు. తెలంగాణ మీడియా ఒకవైపు సంక్షేమం మరోవైపు శిక్షణా తరగతులను సమర్ధంగా నిర్వహిస్తుందని, ఇందుకు పాలకమండలి సభ్యులు సంపూర సహకారం అందిస్తున్నందున వారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియచేసారు.
తెలంగాణ పథకాలు ఆదర్శనీయం: సిద్ధరాజు
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పథకాలు ఆదర్శనీయమని కర్ణాటక మీడియా అకాడమీ చైర్మన్ సిద్ధరాజు ప్రశంసించారు. రెండురోజుల పర్యటనలో ఇప్పటికే మిషన్ భగీరథతోపాటు పలు పథకాలను పరిశీలించామని, జర్నలిస్టుల సంక్షేమ నిధి ఏర్పాటు చాలా గొప్ప విషయమని అన్నారు.
ఈ సందర్బంగా కర్ణాటక మీడియా అకాడెమి చైర్మన్ సిద్దరాజును మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, పాలకమండలి సభ్యులు శాలువా మెమెంటోతో ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో బుద్ధవనం స్పెషలాఫీసర్ మల్లెపల్లి లక్ష్మయ్య, పాలకమండలి సభ్యులు కె. శ్రీనివాస్, కె. శ్రీనివాస్ రెడ్డి, గౌరీ శంకర్, స్టీఫెన్ సన్, అంజయ్య, సత్తిరెడ్డి, కార్యదర్శి బి.రాజమౌళి, సమాచార పౌర సంబంధాల శాఖ అదనపు సంచాలకులు నాగయ్య కాంబ్లీ. సమాచార శాఖ చీఫ్ ఇంజనీర్ కిషోర్ బాబు, జాయింట్ డైరెక్టర్ సుజాత, అసిస్టెంట్ డైరెక్టర్లు వై. వెంకటేశ్వర్లు, హాష్మి, జర్నలిస్ట్ నాయకులు పల్లె రవికుమార్, మారుతీ సాగర్, ఇస్మాయిల్, జర్నలిస్ట్ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.